లాఠీ దెబ్బలకూ, రబ్బర్ బుల్లెట్ల గాయాలకూ చలించకుండా ఓయూ నుంచి ఎగిసిన పోరు కెరటం… దాత్రిక స్వప్న. ఉద్యమ సహచరుడినే వివాహం చేసుకొని, ఇద్దరు ఆడపిల్లల ఆలనాపాలనా చూస్తూనే తన చిరకాల లక్ష్యమైన పీహెచ్డీని పూర్తి చేసింది స్వప్న. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు. అన్నిటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించిందామె.కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామం దాత్రిక స్వప్న సొంతూరు. తల్లిదండ్రులు.. అరుణ, నాగయ్య. చదువులో ప్రతిభకు అనేక బహుమతులు సాధించింది. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాటంలోనూ రాటుదేలింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ విద్యార్థి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షు రాలిగా నియమితురాలైంది. ‘ప్రత్యేక తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో’ అంటూ టీఆర్ఎస్ అధినేత ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడటంతో మలిదశ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఆ సమయంలో స్వప్న విద్యార్థి జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. ఓ దశలో ర్యాలీలో అగ్రభాగాన ఉన్న స్వప్నకు ఒక కాలికి లాఠీ గాయమైంది. మరో కాలిని రబ్బర్ బుల్లెట్ ఛిద్రం చేసింది. అయినా, ‘జై తెలంగాణ’ నినాదం ఆపలేదు. తమకు ఏ ప్రత్యామ్నాయాలూ అవసరం లేదని, తాము కోరుకున్న తెలంగాణను తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ శ్రీకృష్ణ కమిటీ ముందు నిరసన గళాన్ని వినిపించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వప్నకు ఓయూ పరిశోధక విద్యార్థి, విద్యార్థి జేఏసీ నాయకుడిగా ఉన్న పుప్పాల మల్లేశ్తో ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారింది. అనతి కాలంలోనే ప్రేమగా చిగురించింది. వారి వివాహానికి ఉద్యమ సారథి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు హాజరయ్యారు.
డాక్టరేట్ సాధనే ధ్యేయంగా
ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినా తన జీవిత లక్ష్యమైన డాక్టరేట్ సాధనను మాత్రం పక్కన పెట్టలేదామె. 2013లో ఓయూ జువాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా చేరింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో పరిశోధనా ప్రస్థానాన్ని ప్రారంభించి, మెరిట్ ఫెలోషిప్ దక్కించుకుంది. ప్రొఫెసర్ గీతారాజలింగం పర్యవేక్షణలో ‘ఎకో బయోలాజికల్ స్టడీ ఆఫ్ ఫైటోనిమటోడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ లీఫీ వెజిటెబుల్ క్రాప్స్’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి, తన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించింది. కానీ ఓయూ జువాలజీ విభాగం రాజకీయాలు ఆమెకు పీహెచ్డీ ప్రదానం కాకుండా అడ్డుకున్నాయి. వాటన్నిటినీ పట్టుదలతో ఎదుర్కొన్నది. చివరికి, ఓయూ రిజిస్ట్రార్ ఆదేశంతో పీహెచ్డీ ఫైనల్ వైవాను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి ఆమెకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ రీసర్చ్ జర్నల్స్లో డాక్టర్ స్వప్న పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. తెలంగాణ ప్రభుత్వం 2016లో స్వప్నకు ‘బెస్ట్ స్టూడెంట్ రీసర్చర్’ అవార్డును ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2017 మార్చి 8న విశిష్ట మహిళా పురస్కారాన్నీ అందించింది.
అజయ్ కుమార్ సేగూరి