అహల్య, సీత, ద్రౌపది, తార, మండోదరి.. పురాణ ప్రపంచం మెచ్చిన పంచపాత్రలు. మహావనితలు. అందులోనూ మండోదరి వ్యక్తిత్వం శిఖరసమానం. దేవకాంత, కానీ అసురుడి ఇల్లాలు. మదినిండా
మానవత, చుట్టూ రాక్షసగణం. ధర్మ పక్షపాతి, అధర్మవర్తనుడైన భర్తను కాపాడుకోవాల్సిన దుస్థితి. వైవిధ్యమైన మండోదరి వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ మానిని జె.ఆనందని రచించిన ‘మండోదరి: క్వీన్ ఆఫ్ లంక’ ఆంగ్ల పుస్తకం ఈ మధ్యే విడుదలైంది. త్రేతాయుగంనుంచి కలికాలం వరకూ.. కాలం మారినా ఏమాత్రమూ మారని మహిళ అంతరంగ ఘర్షణను హృద్యంగా చిత్రించారు మానిని.
మొత్తంగా మండోదరిని ఎలా చూడాలి? విఫలనారిగా భావించాలా, అశక్తురాలైన స్త్రీగా అర్థం చేసుకోవాలా? రావణుడి వినాశనం తప్పదని ముందే ఊహించిన తాత్వికురాలిగా గుర్తుంచుకోవాలా? ఈ అభిప్రాయాలన్నీ నిజం కావచ్చు. అబద్ధాలూ కావచ్చు. సీతాదేవిలోని ఉదాత్త గుణాలన్నీ తనలో ఉన్నా.. రావణుడిని భాగస్వామిగా ఎంచుకోవడం వల్లే ఆమె పాత్రకు గ్రహణం పట్టింది. ఆ మబ్బుల్ని తొలగించే ఓ చిన్న ప్రయత్నం ‘మండోదరి: క్వీన్ ఆఫ్ లంక’
మధుర ఓ అప్సరకాంత. శివ భక్తురాలు. ముక్కంటి మీద మనసు పడింది. కటాక్షం కోసం ఘోర తపస్సు చేసింది. పార్వతీపతి దిగొచ్చాడు కానీ, ఆ పడతి కోరికను కాదన్నాడు. ‘నువ్వు కాకపోయినా.. నీ అంతటివాడిని వరుడిగా ప్రసాదించు చాలు’ అని వేడుకుంది. ‘తథాస్తు’ అన్నాడు త్రిశూలధారి. అయినా, ఆశ చావక.. గౌరీదేవి లేని సమయంలో కైలాసానికి వెళ్లింది మధుర. యోగనిద్రలో ఉన్న మహాదేవుడిని పరవశింపజేసింది. అంతలోనే జగన్మాత రానే వచ్చింది. విషయం అర్థమైపోయింది. ‘పన్నెండేండ్ల కాలం మండూకంలా బతికెయ్’ అని ఆమెను శపించింది.
అంతలోనే శివుడు కల్పించుకుని.. ‘ఇదంతా లోక కల్యాణం కోసమే. మహా శివభక్తుడిని నువ్వు మనువాడతావు’ అని సర్దిచెప్పాడు. ఆ మండూకమే.. మన కథానాయిక మండోదరి! పుష్కరకాలం తర్వాత మాయాసురుడనే రాక్షస రాజు దంపతులకు పసిబిడ్డగా లభిస్తుంది. బాల్యంలోనే సకల విద్యలూ నేర్చుకుంటుంది. యుద్ధ తంత్రాన్నీ అభ్యసిస్తుంది. పాలనలో తండ్రికి చేదోడుగా ఉంటుంది. ఆమె వ్యక్తిత్వం నిరుపమానం. మహా ఆత్మాభిమాని. సంక్షోభ సమయాల్లోనూ సమర్థంగా వ్యవహరించింది. కానీ, రామాయణం ఆ పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వ లేదనే అపవాదు ఉంది. ఆ లోపాన్ని సరిచేయడానికే ఈ ఇతి వృత్తాన్ని ఎంచుకున్నానని చెబుతారు మానిని. ఆ ప్రయత్నంలో జైన రామాయణాల సాయాన్నీ తీసుకున్నారు. సమస్యలూ సవాళ్లూ ఎదురైనప్పుడు, కష్టాలూ కన్నీళ్లూ వెంటాడినప్పుడు.. కుమిలిపోవాల్సిన పన్లేదు. కుంగిపోవాల్సిన అగత్యమూ లేదు. ఆ సమయంలో సీత ఉంటే ఎలా వ్యవహరించేది? తార అయితే ఏం చేసేది?.. అనుకోగలిగితే ఎక్కడలేని ధైర్యం వస్తుంది.
అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథాపంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనం..శ్లోక అంతరార్థమూ ఇదే. భర్త వెనుకే అడుగులు .. సహధర్మచారిణిగా మండోదరి సర్వకాల సర్వావస్థల్లోనూ భర్త వెంటే నడిచింది. రావణుడు దారి తప్పుతున్నప్పుడు.. అర్ధాంగిగా అతని మనసు మార్చే ప్రయత్నం చేసింది. ఏదో ఒకరోజు దశకంఠుడు మారి పోతాడనే ఆశించింది. రావణుడు-మండోదరి జంటది ప్రేమ వివాహం. సృష్టిలోనే అత్యంత సౌందర్యరాశిని మనువాడాలనే ఆరాటంతో.. విశ్వయాత్రకు బయల్దేరతాడు రావణ బ్రహ్మ. అప్పుడే, మండోదరి తారసపడుతుంది. ఆమె అందానికి మైమరచిపోతాడు. రుద్రతేజస్సుతో వెలిగిపోతున్న ఆ అసుర సార్వభౌముడూ ఆమెను అమితంగా ఆకర్షిస్తాడు.
‘మండోదరీ! నాతో జీవనం అంత సులభం కాదు. ముల్లోకాలను పాదాక్రాంతం చేసుకోవాలన్నదే నా లక్ష్యం. నా జీవితమే ఓ పోరాటం’ అంటాడు రావణుడు. ‘స్వామీ మీ ఉన్నతికి సహకరించడం భార్యగా నా బాధ్యత. మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచను’ అని మాటిస్తుంది మండోదరి. తను కాకుండా మరో మహిళ.. ధన్యమాలిని కూడా రావణుడి జీవితంలో ఉందని తెలిసిప్పుడు, మండోదరి మనసుకు గాయం అవుతుంది. అంతలోనే తమాయించుకుంటుంది. ‘రాజకీయ కారణాలతో జరిగిన వివాహం అది. మనసా, వాచా, కర్మణా.. రావణుడు మనువాడిన మహిళను నేనే’ అని సర్దిచెప్పుకొంటుంది. రావణుడు కూడా ‘ఏ కాంత అయినా.. నీ తర్వాతే’ అని మాటిస్తాడు. ఆ మాత్రందానికే సగటు ఇల్లాలిలా పొంగిపోతుంది మండోదరి. ఈ ఘట్టాన్ని హృద్యంగా ఆవిష్కరించారు మానిని.
సీత విషయంలో రావణుడి ప్రతి చర్యనూ మండోదరి ఖండించింది. స్వయంవరానికి వెళ్తున్నప్పుడు అడ్డు చెప్పింది. సీతను అపహరించే ప్రయత్నమే వద్దని వారిస్తుంది. ‘ఆమె నిప్పు. ముట్టుకుంటే మసైపోతావు’ అని హెచ్చరిస్తుంది. ‘తోటి మహిళగా సీత పట్ల సానుభూతి ఉంది. ఓ భార్యగా భర్త నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యతా ఉంది’ అంటూ కుమిలిపోతుంది. మంచిచెడుల మధ్య నలిగిపోతున్న ఓ మహిళగా మండోదరి పట్ల ఎంతో సానుభూతి చూపించారు రచయిత్రి. పత్నీధర్మాన్ని పాటించే ఇల్లాలిగా, లంకేశ్వరుడి పట్టపురాణిగా.. తన బాధ్యతలకు న్యాయం చేసే క్రమంలో ఆమెలోని స్త్రీ సహజ హృదయం మరుగునపడిపోయిందేమో అనిపిస్తుంది చాలాసార్లు. ఆ మాట నిజం కూడా. ఓ సందర్భంలో రావణుడు మాట తూలడంతో మండోదరి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. రెండు రోజుల తర్వాత కానీ ప్రాణాపాయం నుంచి బయటపడదు. ఆ సంఘటన రావణుడిలో పశ్చాత్తాపం కలిగిస్తుంది. ‘నా కోపం నీ ప్రాణాల మీదికి తెచ్చింది. క్షమించు హృదయేశ్వరీ’ అని వేడుకుంటాడు. అసుర
పతిని అంతగా కదిలించగల శక్తి యావత్ రామాయణంలో మండోదరికి మాత్రమే ఉంది. కొన్ని రామాయణాల ప్రకారం.. రావణ సంహారం తర్వాత మండోదరి విభీషణుడిని మారు మనువు చేసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కూడా భూతద్దంలో చూడలేం. అది యుగధర్మం కావచ్చు. స్త్రీవాదుల కోణంలో చూస్తే.. అధర్మవర్తనుడైన భర్త పట్ల, అతని మరణానంతరం నిరసన తెలిపిన తీరూ కావచ్చు.