దీపావళి పర్వదినాల్లో లక్ష్మీదేవి పసిడి రూపంలో అడుగులేస్తూ.. అందరినీ ఆశీర్వదిస్తుందని ఓ నమ్మకం. అందుకే, దీపావళికి ఎంతోకొంత బంగారం కొనేందుకు యత్నిస్తారు. అందులోనూ ‘ధన త్రయోదశి’ నాడు ధనలక్ష్మి ఘల్లుఘల్లుమంటూ గడపలో అడుగుపెడుతుందని విశ్వసిస్తారు. ఆ కారణంగానే పండక్కి కొనే సంప్రదాయ ఆభరణాల్లో మొదటి స్థానం లక్ష్మీ కాసులపేరుదే. జోడీగా ఇప్పుడు లక్ష్మీదేవి ప్రతిబింబాలతో చోకర్లు, మోటిఫ్లు, గాజులు, బ్రేస్లెట్లు, వడ్డాణాలు, వంకీలు అందుబాటులో ఉన్నాయి. యాంటిక్ జువెలరీ, టెంపుల్ జువెలరీ పేరున అష్టలక్షులు, వినాయకుడు, సీతారాముల హారాలు, నెక్లెస్లు అతివల ఆభరణాల పెట్టెలో చేరుతున్నాయి. ప్రాచీన కట్టడాలపై ఉన్న శిల్పాల డిజైన్లతోనూ ఆభరణాలను రూపొందిస్తున్నారు. ఓ నగల తయారీ సంస్థ ఈ దీపావళికి కాశీ క్షేత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెక్లెస్లు డిజైన్ చేయించింది. జాతిరత్నాలు, గుట్టపూసలు, రాళ్లు, వజ్రాలు పొదిగిన భారీ ఆభరణాలు పండుగ సీజన్లో భలే సందడి చేస్తున్నాయి.