‘అర్హత’ కలవాడు, ‘అధికారం’ ఉన్నవానినుంచి ఉపదేశంగా పొందినపుడే మంత్రం ఫలిస్తుంది. ఒక రాజు తన మంత్రి నివాసానికి వెళ్తే ఆయన జపంలో ఉన్నారని విన్నాడు. రాజు నిరీక్షించి మంత్రి రాగానే వివరం అడిగాడు. తాను మంత్రరాజమైన ‘గాయత్రి’ని జపిస్తున్నానన్నాడు. రాజు తనకా మంత్రాన్ని ఉపదేశించమన్నాడు. మంత్రి తనకా అధికారం లేదన్నాడు. రాజు ఇతరులనుంచి
ఆ మంత్రాన్ని పొంది జపిస్తూ, కొంతకాలం తర్వాత తాను చేసేది సరైనదేనా అని మంత్రితో అన్నాడు. మంత్రం సరైనదే కానీ, దానిని రాజు జపించడం సరికాదన్నాడు మంత్రి. వివరణ కోరాడు రాజు.
మంత్రి అటూ ఇటూ, చూసి ఓ భటుణ్ని పిలిచి రాజుని బంధించమని ఆదేశించాడు. భటుడా ఆజ్ఞను పాటించలేదు. మంత్రి ఎన్నిసార్లు ఆదేశించినా ఫలితం శూన్యం. ఈ సంఘటనతో రాజు కోపించి, అదే భటుడితో మంత్రిని బంధించమన్నాడు. రాజాజ్ఞ తక్షణం అమలైంది. బందీ అయిన మంత్రి నవ్వి, ‘రాజా! మీరు కోరిన వివరణ ఇదే’ అన్నాడు. అర్థంకాక ఆశ్చర్యంతో చూస్తున్న రాజుతో, ‘ఆజ్ఞ అదే, పాలకుడు (భటుడు) ఒకడే, కానీ అధికారి వేరే, కదా! నేను ఆజ్ఞవేస్తే పాలించనివాడు, మీరు ఆజ్ఞ వేయగానే వెంటనే అమలుపరిచాడు? మంత్రాల విషయంలోనూ ఇలాగే అధికారం పనిచేస్తుంది’ అని వివరించాడు.
– భగవాన్ రమణ మహర్షి