సముద్రయానంలో, సాగర వాణిజ్యంలో భారతీయులకు మహోన్నత వారసత్వం ఉన్నది. విదేశాలతో వాణిజ్యమే కాదు, సాంస్కృతిక సమ్మేళనం కూడా జరిగింది. ఇప్పటికీ భారతదేశమంటే ఇతర దేశాలవారు గౌరవిస్తున్నారూ అంటే, నాడు మన పూర్వికులు విదేశాలకు విస్తరించిన సంస్కృతీ సౌరభాలు, తాత్తిక భావధారలే కారణం. మన సంస్కృతిని మనం గౌరవించుకున్నప్పుడే, విదేశీయుల గురించి గౌరవం పొందుతామే తప్ప పరాయి సంస్కృతిని, జీవన విధానాలను అనుకరించడం వల్ల కాదనేది ప్రధాని పీవీ అభిప్రాయం. 1992 జనవరి 6న న్యూ ఢిల్లీలో మ్యారిటైం హెరిటేజ్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని పీవీ నరసింహారావు విదేశాలలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
సముద్ర వాణిజ్య చరిత్ర గల సుసంపన్నమైన ప్రాచీన దేశం మనది. యుగయుగాలుగా భారతీయులు సముద్రాలపై తూర్పునకు, పడమరకు దూరతీరాలకు వెళ్లి వ్యాపారం చేశారు. భిన్న భావజాలాలను, సంస్కృతులను ఇచ్చిపుచ్చుకున్నారు. దక్షిణ భారత ద్వీపకల్పానికి చెందిన నౌకాదళాలు ఇతర దేశాలపై దాడులు జరపలేదు. ప్రపంచంలోని భిన్న ప్రాంతాల ప్రజలతో, శాంతియుత సంబంధాలు నెరిపారు. భారతీయ మిశ్రమ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం ఈ సముద్రయాన ఫలితమే. తూర్పు ఆసియా, పశ్చిమాసియా సాంస్కృతిక ప్రాభవం విభిన్న రూపాలలో ఇక్కడ ప్రతిధ్వనిస్తుంటుంది. భారతీయ సంస్కృతిలో భిన్న ఛాయలు పొడగొడుతుంటాయి. 250- 300ల ఏండ్ల కిందటి దక్షిణ భారత సాహిత్యాన్ని చదివి చూడండి. ప్రబంధ కావ్యాలలో అప్పటి పరిస్థితుల వర్ణనలు ఉంటాయి. తీర ప్రాంతాల రాజ్యాల ప్రాభవం అందులో కనిపిస్తుంది. ఏయే రాజ్యాలలో, ఏయే రాజుల కాలంలో వ్యాపారులు సముద్ర వాణిజ్యం సాగించారు.
ఏయే వస్తువులు మన రాజ్యాలకు చేరేవి అనేది తెలుస్తుంది. ఈ వాణిజ్య కార్యకలాపాల ద్వారా నాటి రాజ్యాలు ఎలా వెలిగిపోయాయో తెలుస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కనుకనే కావ్యాలలో అంత సుదీర్ఘంగా వర్ణించారు. ఈ సముద్రయాన సంస్కృతి లేని ప్రాంతాలలోని భాషలలో ఇటువంటి వర్ణనలు ఉండవు. కవి లేదా సాహిత్యకారుడి సమకాలీన సామాజిక పరిస్థితులు మనకు సాహిత్యంలో కనిపిస్తాయి. సంస్కృతంతో సహా నాటి అనేక కావ్యాలు చదివిన తర్వాత మన సముద్ర వాణిజ్య వారసత్వ విషయంలో నాకు ఎలాంటి సందేహం కలగడం లేదు. మన వ్యాపారులు సముద్రాంతరాలు వెళ్లేవారు. ఆ విధంగా మనకు గొప్ప సముద్ర వాణిజ్య చరిత్ర ఉన్నది.
భారతదేశ సముద్ర వాణిజ్యానికి సంబంధించిన మ్యూజియంను గతంలో కూడా చూశాను. కానీ ఇక్కడ కాదు, బహ్రైన్లో. 1980 దశకం ప్రారంభంలో నేను విదేశాంగ మంత్రిగా వెళ్లినప్పుడు వారు సముద్రయాన మ్యూజియంను చూడవలసిందిగా కోరారు. ఒకరోజు ఉదయం రెండున్నర గంటల పాటు ఆ మ్యూజియంలో తిరిగాను. వారు ఏ దేశంతో సముద్రమార్గం పెట్టుకున్నా అది భారతదేశం ద్వారానే ఉన్నది. అన్ని సముద్రాల నుంచి వచ్చేపోయే దారులు భారతదేశం మీదుగానే పోతున్నాయి.
ఏ దేశంలోని విశ్వవిద్యాలయానికైనా వెళ్లి మాట్లాడండి వారు ప్రాచీన భారతం గురించి చెబుతారు. ఒక్కోసారి నాకు చిరాకనిపించేది. మన దేశంలోని పెద్ద పెద్ద ఫ్యాక్టరీల గురించి మాట్లాడొచ్చు కదా, సింద్రీ ఎరువుల కర్మాగారం గురించి చెప్పవచ్చు కదా అనిపిస్తుంది. వాళ్లు 2 వేల ఏండ్ల కిందటి విషయం గురించే ఎందుకు మాట్లాడుతారనిపించేది. ఇదే విషయం ఒకర్ని అడిగాను, 1947 తర్వాత ఇండియా అనేది ఒకటుందని మీకనిపించదా అని అన్నాను. ఆయన ఒక పండితుడు, రాయబారి కాదు. ఆయన ఎంతో నిజాయితీగా చెప్పాడు. ‘1947 తర్వాత ఇండియాలో ఏమున్నది? మాకు ఇక్కడున్నదే మీకున్నది. గదే చేస్తున్నరు’. ఆయన సమాధానం నా కళ్లు తెరిపించింది. మన దేశం గురించి వీళ్లు ఏమనుకుంటున్నారనేది తెలిసి వచ్చింది. ప్రాచీన కాలంలో మన దేశం గురించి వారికి గొప్ప అభిప్రాయం ఉన్నది.
ఇప్పటి ఆధునిక భారతదేశం గురించి వారికి పెద్దగా గౌరవం లేదు. నాటి అనుబంధాన్ని మనం కోల్పోయాం. ఆ సంబంధాన్ని నెలకొల్పుకుంటే.. మళ్లీ ఆ గౌరవాన్ని పొందగలుగుతాం. వారు పండిట్జీని, గాంధీజీని గౌరవిస్తారు. కానీ తమను (పాశ్చాత్యులను) అనుకరించేవారిని, తమ జీవనశైలి వెంటబడే వారిని పట్టించుకోరు. తమను ఇతరులు అనుసరిస్తున్నారనే ఆనందం వారికి ఉంటుంది. కానీ గౌరవం మాత్రం ఉండదు. నిజమైన భారతీయత నుంచే గౌరవం లభిస్తుంది. అందుకే మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మన చరిత్ర, మన వారసత్వం, మనదైన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి. ఇతరుల వారసత్వం గొప్పది కాదని కాదు, మనది విశ్వ ధర్మం. అది మనదైనది. మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోతే, ఇతరులు గౌరవించరు.
నేను సోవియట్ యూనియన్కు ఎన్నోసార్లు వెళ్లాను. మన భాషల గురించి లోతైన దృష్టి ఒక పండితుని మూలంగా కలిగింది. పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్కు వెళ్లాను. అక్కడ భారతీయ భాషల నుంచి పుస్తకాలను రష్యన్లోకి అనువదిస్తారు. మనం కూడా రష్యన్ నుంచి టాల్స్టాయ్, దోస్తోవిస్కీ వగైరా రచనలను మన భాషల్లోకి అనువదించుకున్నాం. కొంతకాలం తర్వాత వారి అనువాదాలు తగ్గుతున్నాయని తెలిసింది. ఇదే విషయం అడిగాను. కొంచెం తటపటాయించినా.. నేను పట్టి పట్టి అడగటంతో అసలు విషయం చెప్పారు. ‘మీ భాషల గురించి మీరే పట్టించుకోనప్పుడు మేమెందుకు పట్టించుకోవాలి? మీరు వేగంగా ఇంగ్లిష్ను చేపడుతున్నారు. ఇక మేం కూడా మీ భాషలకు బదులుగా ఇంగ్లిష్నే స్వీకరిస్తున్నాం.
మా పిల్లలు ఎలాగూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. భారతదేశంలో జరుగుతున్న దానిగురించి మా డబ్బులెందుకు వృథా చేసుకోవాలి. భారతీయ భాషలను అధ్యయనం చేయటం, భారతీయ పండితులను ఇక్కడికి పిలిపించుకోవటం, అనువాదం కచ్చితంగా ఉండటం కోసం ఓ భారతీయ పండితుడిని, ఓ రష్యా పండితుడిని నియమించుకోవటం ఇదంతా ఎందుకొచ్చిన ప్రయాస? మాకంటూ ఉమ్మడి భాష ఉన్నది. మీరూ ఒకటి వృద్ధి చేసుకుంటున్నారు’ అని ఆయన అన్నారు. నేను ఇంగ్లిష్కు వ్యతిరేకం కాను. కానీ మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనేది చెబుతున్నాను. మన వారసత్వంపై మనకు గౌరవం ఉండాలి. అప్పుడే ఇతరులు మనల్ని, మన వారసత్వాన్ని గౌరవిస్తారు. ఒక్కోసారి వారు మన వారసత్వాన్ని గౌరవిస్తారు, కానీ మనల్ని గౌరవించరు!
నన్ను ఈ మ్యూజియంను సందర్శించవలసిందిగా అడ్మిరల్ రాందాస్ అనేకసార్లు కోరారు. మన చరిత్రను గుర్తుకుతెచ్చే ఇటువంటివి మరిన్ని అవసరం. మన వారసత్వం గురించి తెలుసుకుంటే అది ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదో ఒక దగ్గర మొదలుపెట్టాం. కొన్ని పద్యాలు, రచనలు చదువుతుంటే.. మనల్ని మనం మర్చిపోతాం. గతంలోకి జారిపోయి మన దేశ గొప్పతనం గురించి గర్విస్తాం.