యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ కాంప్లెక్స్లు కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనానికి సుమారు గంటన్నర, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి పోలీసులు వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు.