వరంగల్ రూరల్, మే 26(నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గురువారం నుంచి జిల్లాలో ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం హరిత వెల్లడించారు. ఆయా గ్రామంలో ఎక్కువ స్థలం ఉన్నచోట ఈ క్యాంపులు జరిగేలా చూడాలని ఆమె స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ హరిత తన కార్యాలయం నుంచి జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఆమె పలు సూచనలు చేశారు. పదిరోజుల్లో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకుండా కృషి చేయాలని కోరా రు. గ్రామాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండాలని, ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో తెరిచి ఉన్న షాపుల యజమానులకు జరిమానా విధించాలని చెప్పారు. మెడికల్, ఎరువుల దుకాణాలకు మినహాయింపు ఉందని ఆమె గుర్తు చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కిరాణ, మటన్ దుకాణాలు, చేపల విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా సర్పంచ్లు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గ్రామంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని కలెక్టర్ హరిత చెప్పారు.
పెళ్లికి 40 మందికే అనుమతి
వివాహానికి నలభై మంది వరకు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటే విడుతలవారీగా అంతకంటే ఎక్కువ మంది పెళ్లిల్లకు హాజరవుతున్నట్లు తెలుస్తున్నదని హరిత పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఫంక్షన్లు గ్రాండ్గా చేసుకోవచ్చని, ఇపుడు మాత్రం గ్రామాల్లో నిబంధనలు పాటించాలని అన్నారు. గ్రామాల్లో అనుమతి లేకుండా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగితే ఎస్హెచ్వో, తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎలాంటి మరణమైనా అంత్యక్రియలు ఇరవై మందితో జరిగేలా చూడాలని, పరిస్థితులు బాగాలేనందున మన వల్ల ఇతరులకు ప్రాణాపాయం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చెబితే ప్రజలు వింటారని కలెక్టర్ తెలిపారు. కరోనా సోకిన వారు కచ్చితంగా ఐసొలేషన్లో ఉండేలా చేయాలని అన్నారు. ఐదు కంటే ఎక్కువ పాజిటివ్ కేసులున్న గ్రామాల్లో హైస్కూల్, హాస్టల్ లేదా వీలైన చోట ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకపోతే పాజిటివ్ ఉన్న వారిని మండల కేంద్రాలకు పంపాలని చెప్పారు.
ఇంటింటికీ సర్వేతో మందులు
జిల్లాలో ఇంటింటికీ జ్వర సర్వే జరుగుతున్నదని, కరోనా లక్షణాలున్నా లేకపోయినా మందులు ఇస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జ్వర సర్వేతో ప్రభుత్వం అందజేస్తున్న మందులు ప్రజలకు అందేలా చూడాలని చెప్పారు. మందులు, టెస్టుల గురించి మీ మండలం, గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఎంపీడీవో, తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 27 నుంచి అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని చెప్పారు. ప్రతి మండలంలో నలుగురైదుగురు సర్పంచ్లు స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదులున్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తే ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. కరోనాకు సంబంధించి సందేహాలు, సలహాలు కోసం జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ సెంటర్ నంబరు 18004253424ను ప్రతి గ్రామ పంచాయతీలో ప్రచారం చేయాలని ఆమె చెప్పారు. జిల్లా యంత్రాంగం తరుఫున చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ధైర్యం మందు అని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు, ఐసొలేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని హరిత కోరారు.