చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ చౌరస్తా, జూన్ 12 : బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సర్క్యూట్ గెస్ట్హౌస్లో జిల్లా బాలకార్మిక నిర్మూలన సం స్థ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాలబాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ర్టాలకు ఇచ్చిందన్నారు. పిల్లలతో నిర్బంధంగా పనులు చేయించడం, అంగడి సరుకులుగా మార్చ డం నేరమన్నారు.
బాలల హక్కుల రక్షణ కోసం తెలంగా ణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, బాలకార్మికులను గుర్తించి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చేర్పించాలన్నారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకుంటే జువైనెల్ జస్టిస్ యాక్ట్ 2005 ప్రకారం శిక్షార్హులని, 18 సంవత్సరాలలోపు బాలలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమాని బాలకార్మిక నిషేధచట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 2001 సంవత్సరాన్ని బాలకార్మిక నిర్మూలన సంవత్సరం గా అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించిందని, 2025 నాటికి బాలకార్మికులు లేని ప్రపంచాన్ని చూడాలనే సంకల్పంతో ‘యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్’ పేరుతో ప్రణాళికను రూపొందించిందన్నారు. ఆపదలో ఉన్న బాలలను చేరదీసేందుకు చైల్డ్లైన్ -1098 వారికి ప్రత్యేక వాహన సౌకర్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైల్డ్వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనీల్చందర్రావు, సభ్యులు డాక్టర్ పీ సుధాకర్, కాజాంపురం దామోదర్, సందపాని రాజేంద్రప్రసాద్, బాలల న్యాయమండలి సభ్యులు మేరుగు సుభాశ్, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డైరెక్టర్ బుర్ర అశోక్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పీ సంతోష్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ ప్రవీణ్కుమార్, చైల్డ్లైన్ కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.