వాషింగ్టన్: కొత్త ఎయిర్ ఫోర్స్ వన్(Air Force One) విమానాన్ని ట్రంప్ ఆవిష్కరించారు. అమెరికా అధ్యక్షులు ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ అని పిలిచే విషయం తెలిసిందే. అయితే ఖతార్ సర్కారు గిఫ్ట్గా ఇచ్చిన బోయింగ్ 747-8ఐ లగ్జరీ విమానాన్ని రీఫర్బిష్ చేశారు. ఎరుపు, తెలుపు, నేవీ బ్లూ లైన్లతో ఆ విమానాన్ని తీర్చిదిద్దారు. కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని మేరీల్యాండ్లో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్లో ఆవిష్కరించారు. అక్కడ ల్యాంగర్ను పార్క్ చేసిన విమానాన్ని ట్రంప్ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానం భారీ సైజులో ఉన్నట్లు చెప్పారు. విమానానికి కొత్త రంగులు వచ్చాయని, బేబీ బ్లూ ఇష్టమే కానీ, ఆ రంగును మార్చినట్లు ఆయన చెప్పారు. అమెరికా జాతీయ పతాకం రంగులు బాగున్నట్లు ట్రంప్ తెలిపారు.
త్వరలోనే కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో దేశాధ్యక్షుడు ప్రయాణిస్తారని అమెరికా వైమానిక దళం పేర్కొన్నది. బోయింగ్ కంపెనీ కోసం కొత్త విమానాల ఆర్డర్ ఇచ్చామని, కానీ ఆ విమానాల ఉత్పత్తి ఆలస్యం అవుతోందని, ఈ నేపథ్యంలో ఖతార్కు చెందిన 747 విమానాన్ని వాడుకోవాలని నిర్ణయించామని ట్రంప్ తెలిపారు. కొత్త బోయింగ్ విమానాలు 2028లో డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జూలై 4వ తేదీన జరిగే సంబరాల్లో కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఫ్లైఓవర్ నిర్వహిస్తుందని ట్రంప్ తెలిపారు.