ప్రతి టీమ్లో పోలీస్, వ్యవసాయశాఖ అధికారులు
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పాటు
ఇప్పటికే డీలర్లు, రైతులతో అవగాహన సదస్సులు
ఇక ముమ్మర తనిఖీలు, రికార్డులు, నిల్వల పరిశీలన
కేసులు, పీడీ యాక్టులతో అక్రమార్కుల్లో వణుకు
వరంగల్ రూరల్, జూన్ 5(నమస్తే తెలంగాణ) : తొలకరి పలకరించడంతో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. దీంతో అవసరమైన విత్తన, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో తీసుకురావడంతో దుకాణాల వద్ద రైతుల రద్దీ ఉంటోంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో కొందరు రైతులు విత్తనాలు నాటుతుండగా ఇదే అదునుగా నకిలీ, అనుమతి లేని విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉన్నతస్థాయి సమావేశంలోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రైతులు పంట నష్టపోకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో టాస్క్ఫోర్స్ టీములను ఏర్పాటు చేసి నకిలీలపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యం త్రాంగం రంగంలోకి దిగింది. నకిలీ, కల్తీ, అనుమతి లేని విత్తనాల అమ్మకాల నియంత్రణ కోసం తొలుత ఆయా జిల్లా కలెక్టర్ వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్క్ఫోర్స్ టీమ్ల ఏర్పాటుపై చర్చించారు. జిల్లా, వ్యవసాయ డివిజన్, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో వ్యవసాయ, పోలీసు శాఖల్లోని జిల్లాస్థాయి అధికారులతో ఒక టీమ్, వ్యవసాయ డివిజన్ స్థాయిలో స్థానిక ఏడీఏ, డీఎస్పీతో మరో టీమ్, మండల స్థాయిలో స్థానిక ఏవో, ఎస్హెచ్వో(ఎస్సై లేదా సీఐ)తో ఒక టీమ్ను ఇలా ప్రతి జిల్లాలో మూడు స్థాయిల్లో టాస్క్ఫోర్స్ టీములను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో బృందాలు ఇవే..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా మూడు టాస్క్ఫోర్స్ టీములను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తరుణ్జోషి ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్లు జీ మధు వరంగల్ రూరల్, శ్రీనివాస్జీ వరంగల్అర్బన్, ఎ రాంబాబు జనగామ జిల్లా టీమ్కు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, సీడ్ స్టోరేజీ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, స్టాక్ పాయింట్లు, సీడ్ డీలర్లు, డిస్ట్రిబూటర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల్లో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఈ టీమ్లు తనిఖీలు చేస్తాయని తెలిపారు. వీటితో పాటు అర్బన్ జిల్లాలో రెండు, రూరల్ జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట కేంద్రంగా మూడు వ్యవసాయ డివిజన్ స్థాయి టీములు ఏర్పడ్డాయి. ఆయా టీమ్లో వ్యవసాయశాఖలోని స్థానిక ఏడీఏతో పాటు సీడ్ సర్టిఫికేషన్ అధికారి ఉన్నారు. రూరల్ జిల్లాలోని మూడు టీముల్లో ఏడీఏలు శ్రీనివాసరావు, వీ రవీందర్, వీ సురేష్కుమార్, సీడ్ సర్టిఫికేషన్ అధికారులు ఎన్ సురేష్కుమార్, కే విజయ్, రీజినల్ మేనేజరు జీ రఘు ఉన్నట్లు డీఏవో ఉషాదయాల్ ప్రకటించారు. జనగామ జిల్లాలో ఒక టీమ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలోనూ జిల్లా స్థాయి టీమ్, మహబూబాబాద్, మరిపెడ వ్యవసాయ డివిజన్ కేంద్రంగా ఏడీఏ, డీఎస్పీతో రెండు డివిజన్ స్థాయి టీములను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో ఏఎస్పీ రూపేశ్, డీఏవో గౌస్హైదర్తో జిల్లా స్థాయి టీమ్, ములుగు, ఏటూరునాగారం కేంద్రంగా రెండు వ్యవసాయ డివిజన్ స్థాయి టీములను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డీఏవోతో పాటు ఇన్స్పెక్టర్ మోహన్తో ఒక జిల్లాస్థాయి టీమ్ ఏర్పడింది. వీటితో పాటు ఆయా జిల్లాలో ప్రతి మండలంలో స్థానిక ఏవో, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్, ఏఈవోలు, ఏఎస్సైలతో మండల స్థాయి టీమ్ పనిచేస్తుంది.
సదస్సులు, తనిఖీలు
నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కదులుతున్నారు. ఐదారురోజుల నుంచి మండల, గ్రామ స్థాయిలో విత్తన డీలర్లు, రైతులతో వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నకిలీ, కల్తీ, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే నమోదు చేసే కేసుల వివరాలను, చట్టాలను ఇటు డీలర్లకు, మోసపోతే ఎదురయ్యే నష్టాలను రైతులకు వివరిస్తున్నారు. అవసరమైతే పీడీ యాక్టు పెడతామని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బిల్లు ఇవ్వాలని చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నకిలీ విత్తనాల గురించి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అవగాహన కోసం వాల్పోస్టర్లు, కరపత్రాలను అందించడంతో పాటు విత్తన, ఎరువుల, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. విత్తన లైసెన్సులు, ఇన్వాయిస్లు, రికార్డులు, బిల్బుక్లు, స్టాక్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చెన్నారావుపేట మండలం లోని ధర్మతండాలో శుక్రవారం అనుమతి లేని మిరప విత్తన ప్యాకెట్లను అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ధర్మతండాలో మిరప విత్తనాలు అమ్మిన వ్యక్తి మహబూబాబాద్ జిల్లావాసిగా విచారణలో తేలినట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లాలోని కాటారం, చిట్యాలలో శుక్రవారం నిషేధిత ైగ్లెఫోసెట్ నిల్వలను పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ కాటన్ విత్తనాలు, ైగ్లెఫోసెట్, వివిధ రకాల నకిలీ విత్తనాల అమ్మకంపై టాస్క్ఫోర్సు అధికారులు నిఘా పెట్టి అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు.