ఐటీడీఏ ఆధ్వర్యంలో విస్తరిస్తున్న పరిశ్రమలు
ఉత్సాహంగా నడిపిస్తున్న మహిళలు
ఇప్పటికే విజయపథంలో నాలుగు యూనిట్లు
జీసీసీ ద్వారా మార్కెటింగ్, విక్రయాలు
సబ్సిడీ కింద అందిస్తున్న ప్రభుత్వం
కొత్తగా మరో ఎనిమిదింటికి ప్రతిపాదనలు
వాటిలో పురుషులకూ అవకాశం
ఏటూరునాగారం, మే 4: మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన స్థానికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్’ కింద ఐటీడీఏ ఆధ్వర్యంలో మొదట డిటర్జెంట్ సబ్బుల తయారీతో మొదలై ఆ తర్వాత శానిటరీ నాప్కిన్స్, దాల్ (పప్పు) మిల్లు, న్యూట్రీమిక్స్ (పౌష్టికాహారం) ఇలా నాలుగు యూనిట్లకు విస్తరించింది. వీటిని నడిపేందుకు మొదట భయపడిన మహిళలే ఇప్పుడు ఉత్సాహంగా పనిచేస్తుండగా.. ఉత్పత్తుల తయారీ, విక్రయాలతో విజయవంతంగా సాగుతోంది. తాజాగా మరో ఎనిమిది పరిశ్రమలకు ప్రతిపాదనలు పంపగా వాటిలో పురుషులకూ అవకాశం దక్కనుంది. ఇలా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ.. ఐటీడీఏ, జీసీసీ ప్రోత్సాహంతో గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది.పట్టణాలకే పరిమితమయ్యే పరిశ్రమలు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. మారుమూల గిరిజన మహిళలు పారిశ్రామికంగా ఎదగాలనే ప్రభుత్వం సంకల్పం క్రమంగా నెరవేరుతోంది. ఇప్పటికే పలు పరిశ్రమలు విజయవంతంగా, లాభదాయకంగా నడుస్తున్నాయి. పరిశ్రమలు నడుపడం అంటే ఒక రకమైన భయం గిరిజన మహిళల్లో నిండుకుని ఉండగా నేడు ఉత్సాహంగా ఇందులో లీన మవుతున్నారు. మరొకరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఉత్పత్తులు జిల్లాలు దాటి పోతున్నాయి.
గత ఏడాదిగా ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్’ కింద పరిశ్రమల ఏర్పాటువేగంగా కొనసాగుతున్నాయి. డిటర్జెంట్ సబ్బుల తయారీకేంద్రంతో తొలి అడుగులు వేసి క్రమంగా అనేక పరిశ్రమలు విస్తరించుకుంటున్నాయి. పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో మార్కెటింగ్లో ఐటీడీఏ, జీసీసీ తన వంతు పాత్ర పోషిస్తున్నాయి. అందిస్తున్న ప్రోత్సాహంతో అనుకున్న లక్ష్యం నెరవేరే దిశగా పరిశ్రమలు పరుగులు తీస్తున్నాయి. ఇక ఏర్పాటు చేసిన పరిశ్రమలు కాస్త సక్సెస్ఫుల్గా నడవడంతో మరిన్ని ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. ముందుగా ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లిలో జాయింట్ లయబిలిటీ గ్రూపుతో డిటర్జెంట్ సబ్బుల తయారీకేంద్రాన్ని రూ.40లక్షలతో ఏర్పాటు చేశారు. ఇక ములుగు మండలం జంగాలపల్లిలో రూ.27లక్షలతో శానిటరీ నాప్కిన్ యూనిట్ను నెలకొల్పారు. కొత్తగూడలో రూ.40లక్షలతో పప్పు మిల్లును నెలకొల్పారు. రూ.40లక్షలతో నూట్రీ మిక్స్(పౌష్టికాహారం) యూనిట్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ పరిశ్రమలపై 60శాతం సబ్సిడీ ఇస్తుండగా బ్యాంకు రుణం 30శాతం, జాయింల్ లయబిలిటీ గ్రూపు పది శాతం తన వంతు వాటా చెల్లిస్తున్నారు.