పరకాలలో అత్యధిక వర్షపాతం నమోదు
రాయపర్తిలో అత్యల్పం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
సెంటర్లను సందర్శించిన అధికారులు
చెన్నారావుపేట, జూన్ 3: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పరకాలలో అత్యధికంగా 10.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ప్రణాళిక అధికారి గుర్రాల జీవరత్నం తెలిపారు. శాయంపేటలో 10.78 సె.మీ., గీసుగొండలో 1.92 సెం.మీ, ఆత్మకూరులో 7.72 సెం.మీ, దుగ్గొండిలో 4.02 సెం.మీ, నల్లబెల్లిలో 5.04 సెం.మీ, నర్సంపేటలో 1.12 సెం.మీ, ఖానాపూర్లో 5.56 సెం.మీ, చెన్నారావుపేటలో 1.04 సెం.మీ, సంగెంలో 0.62 సెం.మీ, వర్ధన్నపేటలో 0.24 సెం.మీ, రాయపర్తిలో 0.08 సెం.మీ, నెక్కొండలో 1.02 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు గుర్రాల జీవరత్నం వివరించారు.
నర్సంపేటలో మోస్తరు వర్షం
నర్సంపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం/గీసుగొండ/దుగ్గొండి/ఆత్మకూరు: పట్టణంలో మోస్తరు వర్షం కురిసింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన వర్షం మధ్యాహ్నం 12 గంటలకు వరకు కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నర్సంపేట మండలంలో కురిసిన వర్షంతో పంట భూములు తడిశాయి. దీంతో సాగు పనులు చేసుకునేందుకు రైతులకు సులువుగా మారింది. కాల్వల్లో వరపునీరు భారీగా ప్రవహించింది. ఖానాపురం మండలవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మోస్తరు వర్షం కురిసింది. ధర్మరావుపేట, అయోధ్యనగర్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వర్షం పడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే వాన పడడంతో గీసుగొండ మండల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కొనుగోలు కేంద్రాల వద్ద చివరిదశలో ఉన్న ధాన్యంపై రైతులు పరదాలు కప్పివేశారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ భూముల్లో నీరు నిలిచింది. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల ఆవరణలో కాంటాలు పెట్టిన ధాన్యం తడువకుండా అన్నదాతలు టార్ఫాలిన్లు కప్పారు.
ధాన్యం తరలింపులో వేగం పెంచాలి
వర్ధన్నపేట: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాల తరలింపులో వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. ఇల్లంద మార్కెట్లోని కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు 80 శాతానికిపైగా పూర్తయిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ధాన్యాన్ని తూకం వేయించి మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, అధికారులు విధిగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తూకం వేయించి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఆర్ఐ లోకేశ్ ఉన్నారు.
తాటిచెట్టుపై పిడుగు
శాయంపేట: మండలవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున మొదలైన వాన మధ్యాహ్నం వరకూ ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. గంగిరేణిగూడెం దూదేకులకుంట సమీపంలోని తాటిచెట్టుపై పిడుగుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా, గతంలో ఇదే చెట్టుపై పిడుగు పడిందని, మళ్లీ ఈ చెట్టుపైనే పిడుగు పడడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా రైతులు జాగ్రత్త పడ్డారు. ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దయాకర్ పత్తిపాక, శాయంపేటలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తిపాకలో మూడు వేలు, శాయంపేటలో మూడు వేల చొప్పున కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు ఉన్నట్లు చెప్పారు. లారీల్లో ధాన్యం తరలిస్తామని తెలిపారు. ఆయన వెంట ఏపీఎం శ్రీధర్, సీసీ జ్యోతి ఉన్నారు.
త్వరగా ధాన్యం తరలించాలి..
చెన్నారావుపేట/సంగెం/నెక్కొండ: మండలవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. పాపయ్యపేట, ఉప్పరపల్లి, చెన్నారావుపేట, అమీనాబాద్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలపై రైతులు పరదాలు కప్పి ఉంచారు. వర్షాలు ప్రారంభమైనందున నిర్వాహకులు త్వరగా ధాన్యం తరలించాలని అన్నదాతలు కోరుతున్నారు. కాగా, రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని ఏవో కర్పూరపు అనిల్కుమార్ సూచించారు. సంగెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం బస్తాలు తడిశాయి. కాగా, దుక్కులు సిద్ధం చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. నెక్కొండ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలు, ఇంకా కొనుగోలు చేయని ధాన్యం రాశులు తడిశాయి.
నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు పూర్తయిన ధాన్యం బస్తాలు తడువకుండా మార్కెట్ షెడ్లలో వేశారు. రెడ్లవాడ, అలంకానిపేట, తోపనపల్లిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. నెక్కొండ వ్యవసాయ మార్కెట్తోపాటు తోపనపల్లి, అలంకానిపేట, రెడ్లవాడలోని కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు గురువారం ఏవో అడిదెల సంపత్రెడ్డి, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్రావుతో కలిసి సందర్శించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై చర్చించారు. ఏడీఏ, ఏవో మాట్లాడుతూ మండలంలో 3,54,783 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు 3,22,226 బస్తాలను తరలించినట్లు తెలిపారు. 32,050 బస్తాలు రవాణా కావాల్సి ఉందని వారు అన్నారు.