హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: సహజ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సహజ ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఉపకులపతి ప్రారంభించారు. నిత్యం తీసుకునే ఆహారంలో సహజపద్ధతిలో పండించిన ఉత్పత్తులు భాగం కావాలని, రసాయనాల అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆయన పేర్కొన్నారు.
కేయూ ఈసీ మెంబర్ అనితారెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని, సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కేంద్రంలో సహజ ఉత్పత్తులు మూడు రోజులపాటు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భయ్యా సారయ్య, మిల్లెట్స్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.