వర్ధన్నపేట, ఫిబ్రవరి 13 : భూగర్భ జలాలు పెరిగేలా మండలంలోని ఇల్లంద గ్రామంలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్ర అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. జాతీయ వాటర్ అవార్డు కోసం ఇల్లంద గ్రామాన్ని ఎంపిక చేయాలని ఇటీవల జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో కేంద్ర భూగర్భ జలాల బోర్డు శాస్త్రవేత్త పీ మౌనిక, కేంద్ర వాటర్ బోర్డు కమిషన్ డీఈ చైతన్య డీఆర్డీవో పీడీ వసుమతితో కలిసి గ్రామంలోని ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు, చెక్డ్యాం, పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు, నర్సరీ, హరితహారం చెట్లు, ఇతర పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామంలో భూగర్భ జలాల పెంపు కోసం రైతుల పొలాల్లో ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలనే లక్ష్యంతో నిపుణుల సూచనల మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో పనులను చేపడుతున్నట్లు వివరించారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు బహుళ ప్రయోజనం ఉండేలా చేపడుతున్న పనులను స్థానిక అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు కూడా చైతన్యమై పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఫాంపాడ్లను నిర్మించుకుంటున్నట్లు వివరించారు. ఇల్లంద గ్రామంలో నీటి నిల్వ కోసం చేపట్టిన పనులు చాలా బాగున్నాయని అభినందించారు. అలాగే అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు గొడిశాల శ్రీనివాస్, జ్యోతి, ఏపీవో నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.