ఖిలావరంగల్/ వరంగల్ చౌరస్తా, జూన్ 2 : అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఐడీఏఓసీ(అజంజాహి మిల్లు గ్రౌండ్)లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ముందుగా ఖిలావరంగల్లోని అమరవీరుల స్తూపానికి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆజంజాహీ మిల్లు గ్రౌండ్లో దశాబ్ది వేడుకలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. అనంతరం బండా ప్రకాశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే, పో లీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఉద్యమ నేత సీఎం కావడం రాష్ర్టానికి వరం అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని లిఖించిందన్నారు. 2014-15లో వరంగల్ జిల్లా తలసరి ఆదాయం రూ.82వేలు కాగా, 2020-21లో రూ.1.71లక్షలకు పెరిగిందన్నారు. తొమ్మిదేళ్లలో జిల్లాలో అన్ని శాఖల అభివృద్ధి ఘననీయంగా పెరిగిందన్నారు. జిల్లాలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారన్నారు. రైతు బంధు కింద రూ.1,204.105 కోట్లు అందజేశా మన్నారు. జమ చేశారన్నారు. అలాగే, 1970 మంది రైతు కుటుంబాలకు రూ.98.05కోట్ల బీమా అందజేసినట్లు తెలిపారు. ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 39,349 మందికి పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ దవాఖానల మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
కంటి వెలుగులో 7,82,069 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 51,696 మందికి కేసీఆర్ కిట్లు అందజేసినట్లు చెప్పారు. జిల్లాకు 6 బస్తీ దవాఖానలు మంజూరైనట్లు తెలిపారు. ఎంజీఎం దవాఖానలో ఆధునిక వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. మన ఊరు, మన బడి, మన బస్తీ, మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 223 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. డీఆర్డీవో ద్వారా 59,895 మంది కూలీలకు ఉపాధి కల్పించామన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా 4 మినీ డైరీలను పైలట్ ప్రాజె క్టు ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. 3271 మంది గిరిజనులకు పోడు భూముల హక్కుల పత్రాలు మంజూరు చేశామన్నారు.
మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా. 6.85 కోట్లతో జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. నర్సంపేట, నెక్కొండ పట్టణాల్లో రూ.20 లక్షలు నిధులతో రెండు మార్కెట్లు నిర్మి స్తున్నట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్ష ల మంది కార్మికులకు ఉపాది లభిస్తుందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద 527.67 కోట్లతో పనులు చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.52 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్లో 2వ స్థానం, పారిశుధ్య విభాగంలో దేశంలో 7వ స్థానంలో నిలిచిందన్నారు. నర్సంపేటలో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.539.50 లక్షలు నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజి వాకాడే, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.