పాలకుర్తి, జూలై16 ;వల్మిడి శివారు గుట్టలపై ఉన్న రామాలయాన్ని మరో భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. స్థానికంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన వల్మిడిలోని రామాలయంలో భద్రాచలం తరహాలోనే శ్రీరా మ నవమి కల్యాణం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. భద్రాద్రి రాముడి దగ్గరకు వెళ్లి కల్యాణాన్ని చూసినట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో రాముల గుట్టపై సుమారు రూ.30 కోట్లతో నూతన రామాలయ నిర్మాణ పనులు చేపట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో పర్యాటక ప్యాకేజీలో చేర్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ పక్కనే వాల్మీకి మహర్షి తపమాచరించిన మునుల గుట్టను సైతం బాగు చేయనున్నారు. ఈ ఆలయాన్ని వచ్చే నెలలో ప్రారం భించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాటి వాల్మీకి పురమే నేడు వల్మిడిగా రూపాంతరం చెందినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేసి రామాయణాన్ని రాసినట్లు చరిత్ర చెబుతోంది. ఇలాంటి చారిత్రక ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వల్మిడికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా చారిత్రక గుట్టలు
వల్మిడి సమీపంలో ఉన్న గుట్టలపై శ్రీరామనవమి వేడుకలు ఏటేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాములోరి కల్యాణం చూసేందుకు ఒక్కరోజే సుమారు లక్ష మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం నుంచి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న వల్మిడి దేవస్థానం గుట్టలపై సుమారు రూ.30 కోట్లతో ప్రత్యేక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కళాసంపద, స్తూపాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కాగా, వచ్చే నెలలో లాంఛ నంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వల్మిడికి గొప్ప చరిత్ర ఉంది..
వల్మిడికి గొప్ప చరిత్ర ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృషితో ఆలయానికి పూర్వవైభవం రాబోతుంది. భావితరాలకు గుర్తుండేలా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. త్వరలో మరో భద్రాద్రిగా మారనుంది.
– వీరమల్ల బాబురావుపటేల్, ఆలయ గౌరవ సలహాదారుడు
నా చిరకాల వాంఛ నెరవేరింది..
టూరిజం ప్యాకేజీలో భాగంగా వల్మిడి గుట్టలకు సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేశాం. ఫలితంగా నా చిరకాల వాంఛ నేరవేరింది. రానున్న రోజుల్లో వల్మిడి మరో భద్రాచలంగా మారనుంది. పర్యాటకుల రాకతో స్థానికంగా ఆదాయ వనరులు పెరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఏటా ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణానికి హాజరై స్వామివార్ల ఆశీర్వాదం తీసుకుంటున్న. వల్మిడితోపాటు పాలకుర్తి, బమ్మెర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటికి సుమారుగా రూ.100 కోట్లు కేటాయించాం.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
లవ కుశుల జన్మస్థలంగానూ ప్రాచుర్యం
వల్మిడి లవ కుశుల జన్మస్థలంగానూ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ వారు కలియ తిరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. వాల్మీకి మహర్షి తపమాచరించిన గడ్డ వల్మిడి. ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలతోపాటు ఏటేటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాకతీయుల సామంతరాజు వీరమల్ల సోమనాథుడు వల్మిడిని పరిపాలించినట్లు ఆధారాలున్నాయి. అంతేకాక కాకతీయ సైన్యం, ఇతరత్రా సామగ్రిని కూడా భద్రపరిచినట్లు తెలుస్తోంది. క్షీరాద్రిపైన ఉన్న గుట్టలను రాముల గుట్ట, మునులగుట్టగా పిలిచేవారు. ఇక్కడ శ్రీరామ నవమి రోజు గుండంలో భక్తులు స్నానం చేసి స్వామివార్లను దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుండాలు ఎన్నడూ ఎండిన దాఖలాలు లేవు. మునుల గుట్టపై వాల్మీకి దేవాలయం కూడా ఉంది.