వర్ధన్నపేట, నవంబర్25: రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. రవాణా సౌకర్యం ఉండడంతో పాటు కూరగాయలకు మంచి ధర పలుకుతుండడంతో సీజన్ వారీగా సాగుచేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్కు సమీపంలో ఉన్న సంగెం, పర్వతగిరి, వర్ధన్నపేట, మామునూరు, గీసుగొండ, ఖిలావరంగల్ తదితర మండలాల రైతులు ఇంకాస్త ఎక్కువ సాగుచేసేలా ఉద్యాన శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ మండలాలకు చెందిన రైతులు కూరగాయలను సాగు చేసినట్లయితే నగరంలోని మార్కెట్కు ప్రతి నిత్యం తీసుకువెళ్లి విక్రయించుకునే అవకాశం ఉంది. దీంతో రైతులకు మంచి ఆదాయం కూడా వస్తుంది. అందుకే ఈ ఏడాది కూరగాయల సాగువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కూరగాయ పంటలే కాకుండా పత్తి, మిర్చి, జొన్న, ఇతర ఆహార పంటలపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు.
5,635 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక
వ్యవసాయ ఆధారిత వరంగల్ జిల్లాలో యాసంగిలో 5,635 ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు సాగు చేసేందుకు ఉద్యానవనశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు కూరగాయల పంటలను సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. భూముల స్వభావం ఆధారంగా రైతులు ఎలాంటి కూరగాయలు, పంటలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందనే విషయంపై అధికారులు రైతులకు వివరిస్తున్నారు. గత 2020-21 యాసంగిలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట సబ్ డివిజన్ల పరిధిలోని 3,635 ఎకరాల్లో రైతులు వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. ఇందులో నర్సంపేట డివిజన్లో 575, వరంగల్ సబ్డివిజన్లో 2,826 ఎకరాలు, వర్ధన్నపేట సబ్ డివిజన్లో 234 ఎకరాల్లో రైతులు కూరగాయాల పంటలు వేశారు. అయితే ప్రస్తుతం యాసంగిలో 5,635 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేసేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో నర్సంపేట సబ్డివిజన్లో 1,375, వరంగల్లో 3,426, వర్ధన్నపేటలో 834 ఎకరాల్లో పంటలను సాగయ్యేలా అధికారులు రైతులను సమాయత్తం చేస్తున్నారు.
ఆదాయం వచ్చే పంటలే వేయాలి..
రైతులు కూరగాయలు పండిస్తే వచ్చే యాసంగిలో మేలు జరుగుతుంది. రైతులు మూసపద్ధతిలో వరి పంటలనే సాగు చేస్తే ఆర్థికం గా ఇబ్బందులు తప్పవు. రోజూ ఆదాయం వచ్చే పంటలు సాగుచేయడం మంచిది. ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ను బట్టి పంట వేస్తే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. ప్రభుత్వం కూడా నాణ్యమైన విత్తనాలు, పంటల సాగుకు అవసరమైన పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయలతో పాటు ఆరుతడి పంటలు వేయాలి.