రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్నవరం సరస్సు పర్యాటకానికి కొత్త చిరునామాగా మారింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీఎస్) తాజాగా ఇక్కడ మూడో వేలాడే వంతెనను ఏర్పాటు చేసింది. దీంతో మూడు దీవుల వరకు పర్యాటకులు వెళ్లేందుకు దారి పడింది. చూసినంత దూరం నీరు, మధ్యలో 12 దీవులతో ప్రకృతి అందాలను కలబోసుకున్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులోని వేలాడే వంతెనలు, ద్వీపాలు పర్యాటకుల మనసు దోస్తున్నాయి.
చుట్టూ ఎత్తయిన కొండలు.. మధ్యలో నీటిలో ఎగిసిపడే అలలు.. 12 దీవులు.. 3 వేలాడే వంతెనలతో లక్నవరం సరస్సు ప్రకృతి అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. తాజాగా ఇక్కడ మూడో వేలాడే వంతెనను ఏర్పాటు చేయగా, మూడు దీవుల వరకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇవి విదేశాల్లోని దీవుల్లాగా అబ్బురపరుస్త్తున్నాయి. దేశవిదేశీయులు బోట్లలో, వంతెనలపై నడుస్తూ లక్నవరం అందాలను తిలకిస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. సరస్సులోని వేలాడే వంతెనలు, ద్వీపాలు నిత్యం పర్యాటకులతో కిటకి టలాడుతున్నాయి. ఆదివారాల్లో సుమారు ఐదు నుంచి ఏడు వేల మంది వస్తుండగా, సాధారణ రోజుల్లోనూ రద్దీ ఉంటోంది. వారానికి సగటున 10 వేల మంది సందర్శిస్తుండగా, లక్నవరం వైభవం దేశవ్యాప్తంగా వెలుగొందుతోంది.
లక్నవరం సరస్సు కట్ట నుంచి మొదటి ద్వీపం(కాకరకాయలబోడు)ను కలుపుతూ 175 మీటర్ల పొడవుతో ఒకటిన్నర మీటరు వెడల్పుతో తీగల వంతెన నిర్మించారు. 2007 నవంబర్ 15 నుంచి దీనిపై పర్యాటకుల రాకపోకలు మొదలయ్యాయి. సరస్సు మధ్యలో నీటిపైన ఉన్న అనుభూతి కలిగేలా ఈ వంతెన నిర్మాణం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదటి దీవిలో 16 కాటేజీలతో పాటు పర్యాటకులకు ఘుమఘుమలాడించే వంటకాలతో రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అద్దాలతో నిర్మించిన రెస్టారెంట్ నుంచి సరస్సు మొత్తం కనిపిస్తుంది. బోటింగ్ అవకాశం ఉంటుంది. పర్యాటకుల సంఖ్య పెరుగు తుండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ ఇక్కడ విస్తరణ పనులు మొదలుపెట్టింది. రాకపోకలకు ఒకే దారి ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా 212 మీటర్ల పొడవు, ఒకటిన్నర మీటరు వెడల్పుతో రెండవ వంతెనను నిర్మించారు. 2017లో పనులు ప్రారంభించి కేవలం సంవత్సరం వ్యవధి లోనే పూర్తి చేశారు. మొదటి ద్వీపం నుంచి 1800 మీటర్ల దూరంలో రెండో దీవి ఉంది. ఇక్కడికి పడవలో మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. రెండో దీవిలో రెండు అద్దాల కాటేజీలు ఉన్నాయి. మరో 8 డార్మెట్ రూమ్లను నిర్మించారు. సకుటుంబ సపరివారంగా వచ్చే వారికి ఈ రూమ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రెండో దీవి నుంచి మూడో దీవికి మధ్య 120 మీటర్ల వేలాడే వంతెనను నిర్మించారు. ఇది తాజాగా అందుబాటులోకి వచ్చింది. మూడో దీవిలో చిన్నపిల్లల కోసం ఒక పార్కుతో పాటు విలాస వంతమైన కాటేజీలను నిర్మిస్తున్నారు. ఆ కాటేజీల్లోకి పర్యాటకులు వెళితే ఊటీకి వెళ్లినట్లు అనుభూతి కలిగేలా నిర్మిస్తున్నారు. టీఎస్టీడీసీ పర్యాటకులు బస చేయడానికి మొదటి దీవిలో పిల్లల కోసం బ్యాటరీ బైకులు, బ్యాటరీ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిప్ సైకిల్పై పర్యాటకులు వెళ్తూ నీళ్లపై నడిచినట్లుగా వారి అనుభూతిని పంచుకుంటున్నారు. మొదటి వంతెన టికెట్ కౌంటర్ నుంచి మొదటి ఐలాండ్ కాకరకాయలబోడు వరకు జిప్ వే సౌకర్యం రానున్నది. దీంతో పర్యాటకులు మరింత అనుభూతిని పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఇంజినీర్ గిరీష్ భరద్వాజ్ లక్నవరంలోని వేలాడే వంతెనల రూపకర్త. తీగల వంతెనల నిర్మాణంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ ఖర్చుతో తీగల వంతె నలు నిర్మిస్తున్న గిరీష్ భరద్వాజ్ను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో గుర్తించింది. లక్నవరంంలోని మొదటి రెండు వంతెనలకు ఆయన రూపమిచ్చారు. మూడో వంతెనను గిరీష్ కొడుకు పతంజలి భరద్వాజ్ రూ పొందించాడు. గిరీష్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. వీళ్ల సొంతూరు మంగళూరు సమీపంలోని సులియా. ఇది మారుమూల ప్రాంతం. రోడ్డు ఉండేది కాదు. పట్టణానికి రావాలంటే మధ్యలో పాయస్వి నది అడ్డుగా ఉండేది. వానకాలంలో రాకపోకలు ఉండేవి కావు. దీంతో అప్పట్లో 1975లో గిరీష్ సొంతంగా స్టీల్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమ నెలకొల్పాడు. వాళ్ల నాన్న కోరిక మేరకు కట్టెలు, స్థానికంగా అందుబాటులో ఉన్న సామగ్రితో 1989లో సొంతూరిలో తీగల వంతెన నిర్మించాడు. సులియా గ్రామస్తుల కష్టాలను తొలగించిన గిరీష్కు గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి తీగల వంతెనలను నిర్మించడం కొనసాగిస్తున్నారు. గిరీష్ కొడుకు పతంజలి సివిల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ చదివి ఇదే రంగంలో స్థిరపడ్డాడు. మూడో వంతెన నిర్మాణం పూర్తిగా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది.