పోచమ్మమైదాన్, మే 28: గ్రేటర్ వరంగల్ ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాల వ్యవస్థాపకుడు, ప్రిన్సిపాల్ నలివెల కుమారస్వామి కరోనాతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుమారస్వామి మృతితో వివిధ ప్రాంతాల్లో ఉన్న అంధ విద్యార్థులు బోరున విలపించారు. వరంగల్ తూర్పుకోటకు చెందిన కుమారస్వామి పుట్టుకతో అంధుడైనప్పటికీ కష్టపడి చదివి వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించాడు. తోటి అంధులకు ఉచితంగా విద్యనందించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సొంతంగా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేకంగా అంధుల పాఠశాలను స్థాపించాడు. దాదాపు 30 మంది అంధ విద్యార్థులకు విద్యాబోధన చేయిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తొలుత అద్దె భవనంలో నడిపించి, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆటోనగర్లో సొంత భవనం ఏర్పాటు చేయించాడు. తన జీతం నుంచి సగం వెచ్చిస్తూ, మిగిలిన ఖర్చుల కోసం దాతలతో పాటు ఎన్ఆర్ఐల సహాయంతో పాఠశాలను నడిపిస్తున్నాడు. కరోనా విజృంభిస్తుండగా పాఠశాలను బంద్ పెట్టి ఇంట్లో ఉంటున్న క్రమంలో వైరస్ సోకింది.
ఆటోనగర్, తూర్పుకోటలో విషాదం
తలలో నాలుకలా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్న కుమారస్వామి మృతి చెందడంతో తూర్పుకోట, ఆటోనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి తోటి ఉద్యోగులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే కుమారస్వామి మృతికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంతాపం తెలిపారు. 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ, కుడా డైరెక్టర్ యెలుగం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ లీలావతి, సామాజికవేత్త వలుస కృష్ణ సంతాపం తెలిపారు.