ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
శాయంపేట పీహెచ్సీ తనిఖీ
లాక్డౌన్ను పటిష్టంగా అమలుచేయాలని పోలీసులకు ఆదేశం
శాయంపేట, మే 15 : కరోనాకు అసలైన మందు మనోధైర్యమే అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్ని మందులున్నప్పటికీ కరోనా వచ్చిన వారు మానసికైస్థెర్యాన్ని కోల్పోవద్దన్నారు. శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో ఉన్న ప్రజలను పలకరించి. వైద్యాధికారి నాగశశికాంత్తో మాట్లాడారు. కరోనా టెస్టులు, వ్యాక్సిన్ల వివరాలను తెలుసుకున్నారు. పీహెచ్సీలో తొమ్మిది మంది సిబ్బందికి కరోనా రావడంతో టెస్టులు చేయడం లేదని చెప్పడంతో వైద్యసిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలన్నారు. కలెక్టర్తో మాట్లాడానని, ఎన్ని కిట్లు కావాలో తెచ్చుకోవాలని, లక్షణాలు లేవని పంపించడం సరికాదని సూచించారు. పీహెచ్సీలో ఆక్సీమీటర్ పెట్టుకోకపోవడంపై ఎమ్మెల్యే వైద్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పాటిజివ్ వ్యక్తుల వివరాలు ఎందుకు నమోదు చేయలేదని వైద్యాధికారిని ప్రశ్నించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని వైద్యాధికారి సూచించారు. కరోనా బారిన పడిన వాళ్లు బయట తిరుగుతున్నారని, దీనివల్ల ఇతరులకు వ్యాపిస్తున్నదని, వచ్చిన వాళ్లు 15 రోజులు ఇంట్లోనే ఉండాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని స్థానిక సీఐ, ఎస్సైలు సీరియస్గా అమలు చేయాలన్నారు. వరి కోతలు పూర్తయి కల్లాల్లో ధాన్యం ఉన్నదని, కలెక్టర్తో మాట్లాడి ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటున్నదన్నారు. ప్రజలు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయాలని, అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టీర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పొడిశెట్టి గణేశ్, రేణుకుంట్ల సదయ్య తదితరులు పాల్గన్నారు.