ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ప్రతిపాదనలు
ప్రొఫెసర్కు ముగ్గురు పీజీ విద్యార్థుల ప్రాతిపదికన పెరుగనున్న సీట్లు
వైద్య విద్యలో కొత్త కరిక్యులం
14 మంది విద్యార్థులకు ఒక మెంటర్
వరంగల్, నవంబర్ 17 : కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు పెరుగనున్నాయి. నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా మరో 30 నుంచి 35 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రొఫెసర్కు ముగ్గురు విద్యార్థులు, అసోసియేట్ ప్రొఫెసర్కు ఒక్క విద్యార్థి చొప్పున కేఎంసీకి అదనంగా 35 సీట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కళాశాలలో ఉన్న డిపార్ట్మెంట్ల వారీగా పెరుగనున్న సీట్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు పంపారు. ప్రస్తుతం కేఎంసీలో 45 మంది ప్రొఫెసర్లు, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. 180 పీజీ సీట్లు ఉన్నాయి. కొత్త ప్రాతిపదికన కేఎంసీకి 30 నుంచి 35 వరకు పీజీ సీట్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనలకు ఐఎంసీ ఆమోదం తెలిపితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి సీట్లు పెరగనున్నాయి.
కొత్త కరిక్యులం
నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకువచ్చిన కొత్త కరిక్యులం విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తెలిపారు. దశాబ్దాల క్రితం రూపొందించిన కరిక్యులంలో మార్పులు తీసుకువచ్చారు. కేఎంసీలో గత ఏడాది నుంచి కొత్త కరిక్యులంనే బోధిస్తున్నారు. గత ఏడాది కంటే ముందున్న విద్యార్థులకు పాత సిలబస్నే బోధిస్తున్నారు. కొత్త కరిక్యులంలో మొదటి సంవత్సరం నుంచే రోగితో ఎలా ఉండాలనే అంశాలను బోధిస్తుంటారు. విద్యార్థుల మధ్య గ్రూప్ డిస్కషన్ నిరంతరం నిర్వహించేలా కరిక్యులం రూపొందించారు. ప్రస్తుతం వైద్య విద్యలో తీసుకువచ్చిన కొత్త కరిక్యులం అమెరికా వైద్య విద్యా విధానాన్ని పోలి ఉందని ప్రొఫెసర్లు అంటున్నారు. ఇది వైద్యులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుందని వారు చెబుతున్నారు.
పర్యవేక్షణకు
మెంటర్ నియామకం
వైద్య విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించేందుకు 14 మంది విద్యార్థులకు ఒక మెంటర్ను నియమించారు. గతంలో ఇలాంటి వ్యవస్థ లేదు. కొత్త కరిక్యులంలో దీన్ని చేర్చారు. ఈ మెంటర్ 14 మంది విద్యార్థులను పర్యవేక్షించడంతోపాటు గ్రూప్ డిస్కషన్లోనూ పాల్గొంటారు. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేయడానికి ఇలాంటి మెంటర్ వ్యవస్థ ఉంతో దోహదపడుతుంది. విద్యార్థులకు ధైర్యం చెప్పేలా మెంటర్ వ్యవస్థను కొత్తగా తీసుకువచ్చారు.