భారీ, మధ్య తరహా నీటిప్రాజెక్టులకు పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులపై రూ.50.96కోట్లతో 14 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. పనులు తుది దశకు చేరగా పుష్కలంగా నీరు నిలిచి జలకళ సంతరించుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులు సంబుర పడుతున్నారు. బోర్ల కింద యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. చెక్డ్యాంల వద్ద మోటర్లు పెట్టి నీటిని పొలాలకు పారించుకుంటున్నారు. చెక్ డ్యాంల నీటిలో చేప పిల్లలు పోసుకొని ఉపాధి పొందుతామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్ బవరి (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం భారీ, మధ్యతరహా సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. వీటితోపాటు ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాగులు, ఒర్రెలపై చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి పంటలకు సకాలంలో సాగునీరు అందుతోందని రైతులు వ్యక్తం చేస్తుండగా, చేప పిల్లలను పోసుకొని ఉపాధి పొందుతామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని భూపాలపల్లి, మహాదేవపూర్ సబ్ డివిజన్లలో మొత్తం రూ.50.96కోట్లతో 14 చెక్డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే 90శాతం పూర్తయిన చెక్డ్యాంలలో నీటితో కళకళలాడుతున్నాయి.
మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామం వద్ద పెద్దవాగుపై రూ.6.52కోట్ల నాబార్డ్ నిధులతో చెక్డ్యాం నిర్మాణం చేపట్టారు. పనులు 90శాతం పూర్తి కాగా నీరు పుష్కలంగా నిలిచింది. దీంతో ఇస్సిపేట, బంగ్లాపల్లి, వేములపల్లి, వాగొడ్డుపల్లి, గుడిపహాడ్, పాత ఇస్సిపేట, చింతలపల్లి గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. గణపురం మండలం చెల్పూర్ వద్ద మోరంచవాగుపై రూ.4.31కోట్ల నాబార్డ్ నిధులతో చెక్డ్యాం నిర్మించగా ప్రస్తుతం జలకళ చెల్పూర్, కుందూరుపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. టేకుమట్ల మండలం వెలిశాల వద్ద చలివాగుపై రూ.10.29కోట్ల నాబార్డ్ నిధులతో చెక్డ్యాం నిర్మాణ పనులను చేపట్టి 90శాతం వరకు పూర్తి చేశారు. ఇందులోనూ నీటి నిల్వలు ఉండగా వెలిశాల, గుమ్మడవెల్లి, రామకిష్టాపూర్(టి) గ్రామాల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. చిట్యాల మండలం కాల్వపల్లి వద్ద మోరంచవాగుపై రూ.3.01కోట్లతో చెక్డ్యాం నిర్మిస్తుండగా పనులు 80శాతం పూర్తయ్యాయి. దీంతో కాల్వపల్లి రైతులు ప్రయోజనం పొందుతున్నారు. భూపాలపల్లి మండలం కమలాపూర్ బొగ్గులవాగుపై రూ.2.28కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన చెక్డ్యాం 78శాతం పూర్తయ్యింది. రేగొండ మండలం దామరంచపల్లి వద్ద చలివాగుపై రూ.2.83కోట్ల స్టేట్ ప్లాన్ నిధులతో చెక్డ్యాం పనులు చేపట్టగా 80శాతం పూర్తయ్యాయి. ఈ చెక్డ్యాంల వద్ద ఇరువైపుల కరకట్ట, రివిట్మెంట్ పనులు చేయాల్సి ఉంది. కాటారం మండ లం చింతకాని గ్రామం వద్ద పెద్దవాగుపై రూ.1.80 కోట్ల స్టేట్ప్లాన్ నిధులతో చేపట్టిన చెక్డ్యాం పనులు 80శాతం పూర్తయ్యాయి. కరకట్ట పనులు, రివిట్మెంట్ పనులు మిగిలి ఉన్నాయి. చింతకాని, ఇబ్రహీంపల్లి గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కట్కుపల్లి వద్ద లోకల్వాగు (పెద్దవాగు)పై రూ.2.21 కోట్ల స్టేట్ప్లాన్ నిధులతో చెక్డ్యాం నిర్మాణ పనులు 80శాతం పూర్తి చేశారు. దీని వల్ల కట్కుపల్లి, దామరకుంట, విలాసాగర్ గ్రామాల రైతులు ప్రయోజనం పొందుతారు. మల్హర్ మండలం పెద్దతూండ్ల ఆరె వాగుపై రూ.2.11కోట్లతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
భూపాలపల్లి మండలం నాగారం పెద్దవాగుపై రూ.2.02కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణ పనులు 74శాతం పూర్తయ్యాయి. గణపురం మండలం నగరంపల్లి వద్ద మోరంచవాగుపై రూ.2.27 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణ పనులు 23శాతం వరకు పూర్తయ్యాయి. ఈ చెక్డ్యాం నిర్మాణం పూర్తయితే నగరంపల్లి, బంగ్లాపల్లి, సీతారాంపురం, కొండాపూర్, అప్పయ్యపల్లిల్లో భూగర్భ జలా లు పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామం వద్ద చలివాగుపై రూ.5.87కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన చెక్డ్యాం పనులు 20శాతం వరకు పూర్తయ్యాయి. పూర్తయితే బంధంపల్లి, పోతుగల్లు, నవాబుపేట రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మల్హర్ మండలం మల్లారం వద్ద ఆరెవాగుపై రూ.2.92కోట్ల స్టేట్ప్లాన్ నిధులతో జనవరిలోనే పనులు చేపట్టారు. రేగొండ మండలం రాజక్కపల్లిలో చలివాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.2.52కోట్ల నాబార్డ్ నిధులు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాకముందు ఇస్సిపేట కాడ పెద్దవాగు పైన చెక్ డ్యాం కట్టాలని బొచ్చెడుసార్లు కోరినం. ఎలచ్చన్లప్పుడు చెక్ డ్యాం కడతామని చెప్పెటోళ్లు. వచ్చి కొలతలు ఏసెటోళ్లు. ప్రతి సారి గిట్లనే చేసెటోళ్లు. ఏడాది కింద చెక్డ్యాం కట్టిన్రు. మంచిగ నీళ్లాగుతున్నయ్. పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నం. కేసీఆర్ సారు అందరికీ బాగా చేస్తుండు. నాకు రెండెకరాలకు రైతుబంధు పైసలు కూడా పడ్డయి.
– పొన్నాల రవి,
రైతు, ఇస్సిపేట, మొగుళ్లపల్లి మండలం
చెక్డ్యాం కట్టకముందు నీళ్లకు బాగా తిప్పలయ్యేది. నీళ్లుండకపోయేది. చేపలు దొరక్కపోయేది. చెక్డ్యాం కట్టినంక నీళ్లు ఫుల్లు ఆగినయి. జిమ్మలు కూడా దొరుకుతున్నయ్. కేసీఆర్ చెర్లళ్ల ఉచితంగా చేపపిల్లలు పోయించి మాకు లాభం చేత్తాండు. అట్లనే ఈ చెక్డ్యాంల కూడా చేపపిల్లలు పోసి – బీర్తి స్వామి, బంగ్లాపల్లి,
మత్స్యకారుడు, మొగుళ్లపల్లి మండలం