ఖిలావరంగల్, మార్చి 22: వసంత రుతువుతో అడుగులు వేస్తూ.. విచ్చేసిన శోభకృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా జరుపుకున్నారు. అత్యంత శోభను చేకూర్చేది.. సకల శుభాలను కలిగించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే శుభకృత్ నామ సంవత్సరం సంబురాలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. గుమ్మాలకు మామిడి తోరణాలు, గడపలను పసుసు కుంకుమలతో అలంకరించుకున్నారు. షడ్రుచుల వంటకాలను భుజించారు. కొత్త బట్టలతో ఇంటిల్లిపాది ముస్తాబై ఆధ్యాత్మిక సౌరభాలను గుభాళించే దేవాలయాల బాటపట్టారు. తమ ఇష్ట దైవాలను దర్శించుకున్నారు. అలాగే, తమ భవిష్యత్, ఆదాయ వ్యయాలు, రాజ్యప్యూం, అవమానం వంటి విషయాలు తెలుసుకునేందుకు సంధ్యాసమయంలో దేవాలయానికి వెళ్లి పంచాంగ శ్రవణాల్లో పాల్గొన్నారు. శివనగర్లోని శ్రీవైష్ణవ కమ్యూనిటీ భవనంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాలను ఆవిష్కరించారు. ఖిలావరంగల్ మధ్యకోటలోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు శీలమంతుల శంభులింగం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. శివనగర్లోని ఆర్యవైశ్య భవనంలో పంచాంగాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన పంచాంగ శ్రవణాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని తమ రాశిఫలాలు తెలుసుకున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఉగాది సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, ఇల్లంద రామలింగేశ్వరాలయం, ల్యాబర్తి శివాలయం, కొత్తపల్లి, నల్లబెల్లి, ఉప్పరపల్లి, చెన్నారం, కట్య్రాలలో వేదపండితులు శ్రవణం చేశారు. ఇల్లంద ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న శ్రీసీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల ప్రజలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట పట్టణ ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ప్రధాన అర్చకుడు బాబాశర్మ పంచాంగ శ్రావణం చేశారు. ద్వారకపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహేశ్వరం అర్బన్ పాఠశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్, రేఖంపల్లి, చలపర్తి, కేశవాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం, నాచినపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వేదపండితులు పంచాంగ శ్రవణం చేశారు. రాయపర్తి మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు వేంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి, కొత్తూరులోని సీతారామచంద్రస్వామి, తిర్మలాయపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి, కొండాపురంలోని రుక్మిణీ సత్యభామా సమేత చెన్నకేశవస్వామి ఆలయాల్లో ప్రధానార్చకులు ఆరుట్ల రంగాచార్యులు, రామకృష్ణమాచార్యులు, వెంకటరమణాచార్యులు, పరాశరం సుదర్శనాచార్యులు, ఆరుట్ల రామాచార్యులు గ్రామస్తుల సమక్షంలో నూతన పంచాంగ పఠనాలు చేశారు.
గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు
శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా సంగెం మండలంలోని గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు చేశారు. సంగమేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం, కుంటపల్లిలోని రామలింగేశ్వరాలయంలో అప్పె నాగార్జునశర్మ పంచాంగ శ్రవ ణం చేశారు. ప్రజలకు రాశి ఫలాలు తెలియజేశారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో ఉగాది సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించారు. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పుస్తక పూజలు చేశారు. నల్లబెల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడు తిరునహరి ఆధ్వర్యంలో ప్రజలకు రాశిఫలాలు వివరించారు. ఖానాపురం మండలం బుధరావుపేట వేంకటేశ్వరాలయం, అశోక్నగర్ కోదండరామాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. చెన్నారావుపేట సిద్దేశ్వరాలయంలో పూజలు చేశారు. సిద్ధార్థ పాఠశాలలో చైర్మన్ విజయా గోపాల్రెడ్డి కార్యక్రమం నిర్వహించారు.
నగరంలో ఘనంగా వేడుకలు
అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఆర్ఆర్తోటలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారి పాలకుర్తి ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు చేశారు. కరీమాబాద్లోని బొమ్మలగుడిలో పూజారి శివపురం రామలింగ ఆరాధ్య ఆధ్వర్యంలో, బీరన్నకుంటలోని శ్రీబీరన్నస్వామి, కాశీకుంటలోని పోచమ్మతల్లి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. శంభునిపేటలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో వాగ్బాట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని తయారు చేసి సభ్యులకు అందజేశారు. గిర్మాజీపేట గోవిందరాజులస్వామి, చింతల్ భక్తాంజనేయ సహిత రామలింగేశ్వరాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. గోవిందరాజులస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు వరయోగుల శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.
చింతల్లోని భక్తాంజనేయ సహిత రామలింగేశ్వరాలయంలో ప్రధానార్చకుడు ఉప్పునూతల గురుసాయి ఆచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని పంపిణీ చేశారు. వరంగల్ శ్రీనివాసకాలనీలోని శ్రీశృంగేరి శంకరమఠంలో రాశిఫలాలు తెలియజేశారు. అన్నావజ్జుల సోమశేఖరశర్మ నూతన పంచాగం వినిపించారు. ముందుగా భక్తులు శ్రీశారదాంబ అమ్మ వారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సంగమేశ్వరజోషి తెలిపారు. అలాగే, హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో శ్రీగోదా మాధవ ఆధ్యాత్మిక ప్రచారకేంద్రం వ్యవస్థాపకుడు, ఆరుట్ల శ్రీనివాసాచార్య పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారని టీటీడీ నిర్వాహకుడు రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు.