వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13 : వైద్యశాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీపై పట్టు సాధించడంతో పాటు ఆధునిక వైద్యవిధానాలను అనుసరిస్తూ వైద్యవృత్తి విలువను మరింత పెంచేలా మసులుకోవాలని షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఆదివారం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో 2017 విద్యాసంవత్సరం బ్యాచ్కి చెందిన 250 మంది విద్యార్థులకు డాక్టర్ పట్టాల పంపిణీకి ఏర్పాటు చేసిన 59వ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనిషి ప్రాణాలు నిలిపే వైద్యులు దేవుడితో సమానమన్నారు. ఆ నమ్మకాన్ని నిలుపుకునేలా సేవాభావంతో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యవిధానాలను అధ్యయనం చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని మనసులో కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం సైతం ప్రజారోగ్య విభాగంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నదన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. వైద్యుల అసరాలను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు వెంట వెంటనే కళాశాలల నిర్వహణను సైతం ప్రారంభించిందన్నారు. భవిష్యత్లో వైద్యుల కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథి చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్పీ స్పాట్లలో ఫొటోలు తీసుకొని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రొఫెసర్లు డాక్టర్ రాంకుమార్రెడ్డి, డాక్టర్ రజాక్ మాలిక్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.