మహదేవపూర్, ఫిబ్రవరి 27 : మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు సుమారు 200 మందితో కలిసి హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి (శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు బయలుదేరి నేరుగా మేడిగడ్డకు చేరుకొని బరాజ్ను పరిశీలించనున్నారు. కొన్ని నెలల క్రితం మేడిగడ్డ బరాజ్లో పియర్లు కుంగిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్ మరమ్మతు విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో దానిని సందర్శించిన అనంతరం కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టి , కాళేశ్వరం ప్రాజెక్ట్తో అందుతున్న ఫలాలను కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు.