మహదేవపూర్, మార్చి 27 : దసలిపట్టు పంట అమ్మి నా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలో సుమారు 300 గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఏన్నో ఏండ్లుగా దసలి పట్టు పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. సమీప అడవిలో పట్టు సాగు చేసి గూళ్లను మండలకేంద్రంలోని సెరికల్చర్ కార్యాలయానికి తరలిస్తారు. వాటిని వేలం ద్వారా అధికారులు వీవర్స్, వ్యాపారులకు విక్రయిస్తారు. సెప్టెంబర్ చివరి వారంలో దసలి పట్టు సాగును ప్రారంభించగా, డిసెంబర్ చివరి వారంలో రైతులు గూళ్లను సేకరించి కార్యాలయానికి తరలించారు. దిగుబడి సుమారు 16 లక్షల గూళ్లు రాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 8న బహిరంగ వేలం నిర్వహించగా వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.
గతేడాది ఒక్కో మేలైన పట్టు గూడుకు రూ.6.60 ధర పలుకగా ఈసారి రూ.4.90 మాత్రమే పలకడం రైతులను నిరాశ కలిగించింది. ధర తగ్గినా రావాల్సిన డబ్బులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వేలం నిర్వహించిన 10-15 రోజుల్లోనే రైతులకు పంట డబ్బులు అందేవి. ఈ ఏడాది వేలం పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు అందలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే డబ్బులు రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సెరికల్చర్ మండల అధికారి సమ్మయ్యను వివరణ కోరగా పట్టు గూళ్ల రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని, సిబ్బంది కొరత వల్లే కొంత ఆలస్యమైందన్నారు. వారంలో మిగతా రైతులందరికీ డబ్బులందేలా చూస్తామన్నారు.