భీమదేవరపల్లి, జనవరి 14: కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భోగి పండు గ కావడంతో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి చెంతకు తరలివచ్చి కోరమీసాలు, గుమ్మడికాయలు సమర్పించి, కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆనవాయితీ ప్రకారం కడిపికొండ, దామెరకు చెందిన కుమ్మరి వంశస్థులు భోగి రోజున వీర బోనం తీశారు. ఎడ్లబండ్లను అందంగా తీర్చిదిద్ది కుమ్మరిబోనం నెత్తిన పెట్టుకోని వెళ్తుండగా డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తులు నృత్యం చేస్తూ వెంట నడిచారు. వీరశైవులు ఖడ్గాలు వేశారు. బోనంతో కుమ్మరి వంశస్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. జాతరలో జన్నపురెడ్డి సురేందర్రెడ్డి భక్తులకు వృక్షప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఆచార్య జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో వలంటీర్లు వాటర్బాటిళ్లను పంపిణీ చేశారు.
భోగి సందర్భంగా స్వామివారికి సర్వాంగ అభిషేకం చేశారు. భద్రకాళి అమ్మవారికి శ్రీ చక్ర నవావరణ పూజ జరిపించారు. సూర్యయంత్రాన్ని స్థాపించి అరుణపారాయణం, సూర్యనమస్కారాలు గావించారు. యాగశాలలో పూజలు చేశారు. సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే కుమారుడు ఇంద్రనీల్ శంసిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేడు సంక్రాంతి సందర్భంగా ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షిణ ఉంటుంది. ఉత్సవాలల్లో ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్రావు పూర్తి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ వంగ రవి, దేవాదాయ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునిత, ఎంపీడీవో భాస్కర్, ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, భూక్య తులస్య, మఠం శ్రీశైలం పాల్గొన్నారు.