ములుగు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కూతురిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లుడిపై తుపాకీ గురి పెట్టి బెదిరించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ములుగు మండలంలోని దేవగిరిపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోరిక మోహన్లాల్ తన కూతురును అల్లుడు శరత్ కాపురానికి తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్నాడని కోపం పెంచుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం శరత్ ములుగులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాడన్న విషయం తెలుసుకొని హుటాహుటిన అతని వద్దకు చేరుకొని బైక్పై కూర్చొని ఉన్న శరత్పై తుపాకీని గురి పెట్టాడు. దీంతో భయాందోళన చెందిన శరత్ అతన్ని తోసివేయడంతో తుపాకీ కొంత దూరంలో పడింది. పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు వినియోగదారురులు బెంబేలెత్తిపోయారు. అల్లుడు శరత్, మామ మోహన్లాల్ల మధ్య తోపులాట జరుగుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలవడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తుపాకీతో పాటు మోహన్లాల్, శరత్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై ఎస్సై వెంకటేశ్వర్ను వివరణ కోరగా మోహన్లాల్, అతని అల్లుడిపై గురి పెట్టిన తుపాకీని లైటర్ గన్ (గ్యాస్ లైటర్ లాంటిది)గా తేల్చారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన అల్లుడిని బెదిరించింది లైటర్ గన్తోనే అయినా.. పెట్రోల్ బంక్లో అది మిస్ ఫైర్ జరిగితే పెద్ద ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లేదని స్థానికులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.