హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11 : ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించిన ప్రాంతం. ఎందరో అగ్రనేతలు సేదతీరిన ప్రదేశం. రజాకార్ల, భూస్వామ్య పెత్తందార్లకు ఎదురొడ్డి పోరాడిన కమ్యూనిస్టు పోరాటయోధులకు నిలయం హనుమకొండ కుమార్పల్లిలోని బుద్ధభవన్. ఎంతోమంది అగ్రనేతలు ఇక్కడే సమావేశమై ఉద్యమాలకు వ్యూహరచన చేశారు. బుద్ధభవన్ నిర్మాణ పనులకు 1956లో బీఆర్ భగవాన్దాస్ శ్రీకారం చుట్టారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలనుకున్నారు కానీ అప్పటికే ఆయన మృతిచెందడంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. బాలసముద్రం చెరువు రాళ్లు బుద్ధభవన్ పునాదిరాళ్లు.. ఇంటింటా చందాల రూపంలో డబ్బులు వసూలు చేసి భవనాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికొకరు ఆనాడు నిర్మాణ పనుల్లో భాగస్వాములైనవారే.. అయితే భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పేరు పెట్టే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. బీఆర్ భగవాన్దాస్ అంబేద్కర్వాది, బుద్ధిజాన్ని నమ్మిన సిద్ధాంతుడు. మొదట అంబేద్కర్ భవన్గా నిర్ణయించినా తర్వాత బుద్ధభవన్ అని నామకరణం చేశారు. నగరంలో బుద్ధుడి పేరుతో నిలయాలు ఎక్కడా లేవు. హనుమకొండ, కాజీపేట, వరంగల్ పట్టణాల్లో ఏకైక బుద్ధభవన్ ఇదే.
ఉద్యమాలకు కార్యాచరణ ఇక్కడినుంచే..
పేదల పక్షాన పోరాడిన ఉద్యమకారులు ఇక్కడినుంచే ప్రణాళికలు రూపొందించారు. అగ్రనేతలు ఉద్యమాల కార్యాచరణ బుద్ధభవన్ నుంచే ప్రారంభించేవారు. ఆనాటి కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మాజీ మంత్రి గోకా రామస్వామి, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్, పీపుల్స్వార్ అగ్రనేత కేజీ సత్యమూర్తి, సురవరం ప్రతాపరెడ్డి, పువ్వాడ నాగేశ్వర్రావు, చండ్ర రాజేశ్వర్రావు, మోటూరి హన్మంతరావు, బీఆర్ భగవాన్దాస్, గొర్రె నర్సయ్య, మద్ది రాజయ్య, గొర్రె అంజయ్య లాంటి ఎందరో నాయకులు ఇక్కడ సమావేశమై, ఉద్యమాన్ని నడిపించేవారు. అనేక ఉద్యమాలకు ఇక్కడినుంచే పునాదులు వేసేవారు. ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులు ఉండటాన్ని చూసి అప్పటి కలెక్టర్ కాకి మాధవరావు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడివారు చాలామంది ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రశాంతతకు మారుపేరు..
ప్రశాంతతకు మారుపేరు బుద్ధభవన్. ఉద్యమమే కాదు శాంతిని చాటడం కూడా తెలుసని ఉద్యమకారులు ఆనాడే చాటి చెప్పారు. భవన్లో బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలతో పాటు బుద్ధుడు సూచించిన శాంతి సందేశాలను కూడా ఏర్పాటు చేశారు. నగరంలో బుద్ధుడి పేరుతో నిలయాలు ఎక్కడా లేవు. అది ప్రశాంత వాతావరణకు నిలయంగా ఉంటుంది. బుద్ధభవన్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ ఉండటం విశేషం. భవనాన్ని ఇక్కడ నిర్మించడం వల్లే తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని స్థానికులు గర్వంగా చెబుతున్నారు.
హెడ్కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి..
బీఆర్ భగవాన్దాస్ పోలీస్ హెడ్కానిస్టేబుల్గా తన జీవితం ప్రారంభించారు. ఆనాడు రజాకార్లు ప్రజలపై దమనకాండకు జరుపుతున్న పరిస్థితుల్లో ఆవేదనకు గురైన బీఆర్ భగవాన్దాస్ అప్పుడు తాను పనిచేస్తున్న అబిడ్స్ పోలీస్స్టేషన్లో తన రాజీనామా సమర్పించి, కనీసం పెన్షన్ కానీ, ఉద్యోగపరంగా వచ్చే సదుపాయాలను కానీ తీసుకోకుండా కుమార్పల్లికి వచ్చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్షితులై కమ్యూనిస్టు నేత గొర్రె అంజయ్య నాయకత్వంలో పార్టీలో చేరారు. పార్టీలో కొనసాగుతూనే షెడ్యూల్డ్ కులాలు, జాతుల బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థ కృషిచేసిన మహనీయుడు బీఆర్ భగవాన్దాస్.
అంబేద్కర్ స్ఫూర్తితో భవన్ నిర్మాణం..
పేదల పక్షపాతి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కమ్యూనిస్టు యోధుడు బీఆర్ భగవాన్దాస్ చొరవతోనే బుద్ధభవన్ ఏర్పడింది. భవన నిర్మాణానికి ముందు అక్కడ గుడిసె ఉండేది. 1956లో అంబేద్కర్ స్ఫూర్తితో బీఆర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పేదల కోసం పాటుపడిన భగవాన్దాస్ కాంస్య విగ్రహాన్ని హనుమకొండలోని అశోకా జంక్షన్లో ఏర్పాటుచేశారు. అప్పటి కలెక్టర్ కాకి మాధవరావు బుద్ధభవన్ గురించి తెలుసుకుని అది బుద్ధభవన్ కాదు యుద్ధభవన్ అని పిలిచేవారు.
ఉన్నత అవకాశాలు..
బుద్ధభవనం కేంద్రంగా స్ఫూర్తి పొందిన ఎందరో ఉన్నత విద్య ద్వారా ఉన్నత ఉద్యోగాలను పొందారు. అందులో విశ్రాంత జడ్జిగా బి.రాజన్న, విశ్రాంత టెలికాం జనరల్ మేనేజర్గా నరేందర్, సింగరేణి విశ్రాంత డీజీఎంగా రంగయ్య, దేవాదుల ఎస్ఈగా రాధాకిషన్, విశ్రాంత అడిషనల్ ఎస్పీగా కృష్ణస్వామి, విద్యుత్ ఎస్ఈగా లక్ష్మీనారాయణ, శాప్ మేనేజర్గా సారయ్యతో పాటు 25 మందికిపైగా వైద్యులు, 60 మందికిపైగా ఇంజినీర్లు ఇంకా అనేక మంది ఉన్నత పదవులను అలకరించారు.
స్ఫూర్తిదాయక పేర్లు..
బీఆర్ భగవాన్ తనలోని భావాలను ఊరికే పోనివ్వకుండా తనకు స్ఫూర్తినిచ్చిన నేతలను తన పిల్లలలో చూసుకునేందుకు వారి పేర్లు పెట్టారు. భగత్సింగ్పై ఇష్టంతో పెద్దకుమారుడికి భగవత్ ప్రసాద్, అంబేద్కర్పై ఇష్టంతో రెండో కుమారుడి పేరు అంబేద్క ర్గా, సిద్ధార్థుడిపై ఇష్టంతో మూడో కుమారుడికి రాజ్సిద్ధార్థ గా, కమ్యూనిస్టు యోధుడు స్టాలి న్పై ఇష్టంతో నాలుగో కుమారు డికి స్టాలిన్గా, అంబేద్కర్, లెనిన్ పై ఇష్టంతో ఐదో కుమారుడికి బీఆర్ లెనిన్గా పేర్లు పెట్టారు.
13న పూర్వశ్రామికుల ఆత్మీయ అభినందన సభ
బుద్ధభవన్ నిర్మాణంలో భాగస్వాములైన పూర్వశ్రామికుల ఆత్మీయ అభినందన సభ ఈ నెల 13న నిర్వహించనున్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి బుద్ధభవన్ వద్ద నిర్మాణంలో పాలుపంచుకున్న వారి కుటుంబ సభ్యులతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణంలో భాగంగా బుద్ధభవన్ నిర్మాణంలో పనిచేసినవారి జ్ఞాపకార్థం వారిని, కుటుంబసభ్యులను ఘనంగా సత్కరించనున్నా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొననున్నారు. అలాగే 14న ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ప్రముఖుల సందర్శన..
బుద్ధభవనాన్ని దేశంలోని ఎందరో ప్రముఖులు సందర్శించారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతస్థాయి అధికారులు సైతం ఇక్కడికి వచ్చేవారు. ఇందులో అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, లావు బాలగంగాధర్రావు, మోటూరి హనుమంతరావు, ఏకే గోపాలం, దాసరి నాగభూషణరావు, పువ్వాడ నాగేశ్వరరావు, సురవరం, పీవీ నర్సింహారావు, కన్నాభిరాం, హరగోపాల్, నెల్లూరు కాంతారావు, డాక్టర్ భుజంగరావుతో పాటు పలువురు నాయకులు, అధికారులు సందర్శించడం విశేషం.
బుద్ధభవన్ పునర్నిర్మాణానికి చర్యలు..
బుద్ధభవన్ పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. 13, 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తాం. విజేతలకు బహుమతులు అంది స్తాం. బుద్ధభవన్ నిర్మాణంలో భాగస్వాములైన వారిని, వారి కుటుంబసభ్యులను 13న సాయం త్రం ఘనంగా సన్మానిస్తాం. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. బుద్ధభవన్ భవ న నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.
– డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు
బుద్ధభవన్ అభివృద్ధికి కృషి..
పేదల పక్షపాతి బీఆర్ భగవాన్దాస్. నిత్యం పేదల కోసం తపించేవారు. అనేక పోరాటాలు చేశారు. బీఆర్ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి బుద్ధభవన్ను నిర్మించారు. ఉన్నతాధికారులతో పాటు మేధావులు ఉద్యమించారు. బుద్ధభవన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషిచేస్తా. రూ.50 లక్షలతో పునర్నిర్మాణ పనులు చేపడతాం.
– ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్