రాయపర్తి, ఆగస్టు 3: మండలకేంద్రాల్లో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాలను అందంగా, భవిష్యత్ తరాలకనుగుణంగా తీర్చిదిద్దాలని అడిషనల్ డీఆర్డీవో వసుమతి సూచించారు. మండలకేంద్రంలోని రాయపర్తి-తిర్మలాయపల్లి రోడ్డులోని ముకుందరెడ్డి కంచెలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్కు నిర్మాణ పనులను మంగళవారం ఆమె సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి పరిశీలించారు. బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో మండలకేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని ఆమె అన్నారు. పార్కుల్లో రకరకాల పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో తుల రామ్మోహన్, కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, ఈజీఎస్ ఈసీ సాంబశివరావు, టెక్నికల్ అసిస్టెంట్లు యాకూబ్, కిషన్రెడ్డి, వెంకట్రెడ్డి, సరోజన, కారోబార్ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులను పూర్తి చేయాలి
చెన్నారావుపేట: మండలంలో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన ఎంపీవో గౌడ సురేశ్తో కలిసి పలు గ్రామాలను సందర్శించారు. అమీనాబాద్లోని మామిండ్లపల్లెలో స్థలానికి ఉన్న అడ్డంకులు తొలగించి పల్లెప్రకృతి వనం పనులను ప్రారంభించారు. అలాగే, సూర్యపేటతండా, గొల్లభామతండాలోని డంపింగ్ యార్డులు, క్రిమిటోరియం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో వర్మీకంపోస్టు తయారీపై సర్పంచ్లు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అమీనాబాద్, సూర్యపేటతండా, గొల్లభామతండా సర్పంచ్లు సిద్దెన రమేశ్, బదావత్ కిషన్, గుగులోత్ నేజీ, కార్యదర్శులు శ్రీనివాసరావు, భరత్కుమార్ పాల్గొన్నారు.