తెలంగాణలోని గ్రామీణ జీవనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల వృత్తులు, చేతి వృత్తులతో పెనవేసుకున్నది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో, సమృద్ధితో ఉన్నాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సమైక్య పాలనలో ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చూపిన నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల గ్రామీణ జీవనం విధ్వంసానికి గురైంది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితమే అల్లకల్లోలమైంది. వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేత బట్టుకుని పట్టణాలు, పరదేశాలకు వెళ్లి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ గ్రామీణ సమాజాన్ని గట్టెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం రూపొందించింది. ఇప్పటికీ మనుగడలో ఉండి, ప్రజలకు ఆ కుల వృత్తుల అవసరం ఉంటే, దాన్ని ప్రోత్సహించడం మొదటి వ్యూహం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, నాయీ బ్రాహ్మణ వృత్తి, రజక వృత్తి లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఆయా వృత్తులను యధాతథంగా కొనసాగిస్తూ, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలమాన పరిస్థితుత్లో వచ్చి మార్పుల కారణంగా కొన్ని వృత్తుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి వృత్తులను ఆధునీకరించడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం లాంటి చర్యల ద్వారా దానిపై ఆధారపడిన వారి జీవితాల్లో మార్పు తేవడం. చేనేత లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక మూడోది, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూసుకునే వారికి తగిన ఆర్థిక సహాయం చేయడం. ఈ త్రిముఖ వ్యూహం అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వస్తున్నది.
తెలంగాణలో వృత్తి నైపుణ్యం కలిగిన అపారమైన మానవ వనరులున్నాయి. కుల వృత్తుల ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలు కలిగి ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత. అదొక వరం కూడా. వారి నైపుణ్యానికి, అనుభవానికి తగిన పనిని, ఆదరణను, ప్రేరణను ఇస్తే వారు తరగని సంపదను సృష్టించగలరని ప్రభుత్వం విశ్వసించించింది. ఇప్పటి వరకూ ఈ దిశగా సరైన ప్రయత్నమేదీ జరగలేదని గ్రహించింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా కూలిపోయిన కుల వృత్తులకు జీవం పోయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వారిలో 90 శాతానికి పైగా వెనుకబడిన తరగతుల (బిసి కులాలు) వారే ఉంటారు కాబట్టి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తేవాలని నిర్ణయించింది.
గ్రామీణ వృత్తులకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 28 నుంచి 30 లక్షల వరకు గొల్ల కుర్మల జనాభా ఉంది. వీరిలో 5 లక్షల నుంచి 6 లక్షల కుటుంబాల వారు 1 కోటి 75 లక్షల గొర్రెలు, మేకలను పెంచుతున్నారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజక వర్గంలోని కొండపాక గ్రామంలో 20 జూన్, 2017న ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ జిల్లాల్లోని 100 నియోజక వర్గాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కుర్మ కులాలవారికి ఉత్తమ జాతికి చెందిన గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి వీరికి అందించారు.
గొర్రెల పంపిణీకి సంబంధించి ఒక్కో యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు వున్నాయి. ఒక్కో యూనిట్ కు రూ. లక్షా 25 వేలు అవుతుంది. ఇందులో 25 శాతం (రూ.31,250) లబ్ధిదారుడు, మిగతా 75 శాతం (రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.
రాష్ట్రంలో 7,925 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలుండగా, వాటిలో 7,61,895 మంది సభ్యులుగా వున్నారు.
తెలంగాణలో గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కుర్మ కులాల వారి కోసం రూ. 5,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.3434 కోట్లు. లబ్ధిదారుల వాటా రూ.1145 కోట్లు. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 77 లక్షల గొర్రెలను 3.66 లక్షల మందికి పంపిణీ చేసింది. ఆ గొర్రెలు మరో 1 కోటి 8 లక్షల గొర్రె పిల్లలను పెట్టడంతో వాటి సంఖ్య మొత్తం 1 కోటి 85 లక్షలకు పెరిగింది. ఈ గొర్రెలతో గొల్ల, కురుమలకు రూ.4,877 కోట్లకు పైగా సంపద సమకూరింది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి ఏకంగా 105 శాతం పెరిగింది. తలసరి మాంసం వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో అప్పటి ప్రభుత్వాలు కేవలం 12 వేల గొర్రెలను మాత్రమే ఇచ్చాయి.
బీమా సౌకర్యం: పంపిణీ చేసిన గొర్రెలకు బీమా సౌకర్యం కూడా కల్పించారు. గొర్రెల పెంపకందారులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా అందుతున్నది.
గొర్రెల కోసం 90 శాతం సబ్సిడీతో షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
సబ్సిడీ గొర్రెలకు ఉచితంగా దాణా: కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వం వాటికి గొర్రెల అభివృద్ధి పథకం కింద పుష్టికరమైన దాణా, వేసవిలో నీరు అందిస్తున్నది. ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. సబ్సిడీ గొర్రెలకు యూనిట్కు 4 బస్తాల దాణాను అందిస్తున్నది. మిగతా గొర్రెలకు 75 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ చేయనున్నారు. మే, జూన్ నెలల్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఉండటంతో ప్రతి లబ్ధిదారుడికి 200 కిలోల చొప్పున ఉచితంగా దాణా పంపిణీ చేయాలని నిర్ణయించారు. 21 మే, 2019న ఉచిత దాణా పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10 కోట్ల విలువచేసే 15 వేల టన్నుల దాణా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గొర్రెలకు సంవత్సరానికి సరిపడా టీకాల కోసం ప్రతి లబ్ధిదారుడికి రూ.415 విలువైనవి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
మాంసం ప్రియులకు కేంద్రమైన తెలంగాణ ఇప్పడు మాంసం ఉత్పత్తిలోనూ రికార్డు సృష్టించింది. ఉత్పత్తిలోనే కాకుండా వినియోగంలో కూడా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి ఏకంగా 105 శాతం పెరిగింది. గొర్రెల మాంసం ద్వారా రూ.4,877 కోట్ల సంపద పెరిగింది. తలసరి మాంసం వినియోగంలో కూడా మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 2014-15 లో 12.95 కిలోల తలసరి మాంసం వినియోగం ఉండగా, అది 2019-20 నాటికి 16.45 కిలోలకు చేరింది. 2019లో నిర్వహించిన 20వ జాతీయ పశుగణన ప్రకారం 1.85 కోట్ల గొర్రెలతో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. 2012లో 1.28 కోట్ల గొర్రెలుండగా ప్రస్తుతం 2020 నాటికి 1.97 కోట్లకు చేరింది. మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం గత రికార్డులను తిరగరాసింది. 2013-14లో 4.46 లక్షల టన్నుల మంసం ఉత్పత్తి అవగా, అది 2019-20 నాటికి 8.48 లక్షల టన్నులకు చేరింది. అప్పటితో పోల్చుకుంటే 4.02 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగింది. 90.13 శాతం ఉత్పత్తి పెరిగింది.
-2015-16 నుంచి 2020 వరకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా 2020 చివరి నాటికి 3,66,797 యూనిట్లు (77,02,737 గొర్రెలు) పంపిణీ చేసింది. వాటి ద్వారా మరో కోటి 20 లక్షల పిల్లల ఉత్పత్తి జరిగింది. మొత్తంగా వీటి సంఖ్య 1,97,02,737 కి చేరింది. గొర్రెల పంపిణీకి ప్రభుత్వం రూ.3435 కోట్లు ఖర్చు చేసింది. లబ్ధిదారుల వాటా రూ.1145 కోట్లు. మొత్తం గొర్రెలకు అయిన ఖర్చు రూ.4,580 కోట్లు.
వీటి మాంసం విక్రయం ద్వారా వచ్చిన సంపద రూ.4,877 కోట్లు.
ఈ పథకం అమల్లోకి వచ్చాక 75,866 టన్నుల మాంసం అధికంగా ఉత్పత్తి అయ్యింది.
మాంసం వినియోగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానం.
జాతీయ తలసరి మాంసం వినియోగం 5.4 కిలోలు.
తెలంగాణలో తలసరి మాంసం వినియోగం 9.2 కిలోలు కాగా, ఇందులో గొర్రె మాంసం వాటా 4 కిలోలుగా ఉన్నది.
2013-14 లో రాష్ట్ర వ్యాప్తంగా 2,012 గొర్రెల పెంపకం దారుల సొసైటీల్లో 1,30,000 మంది సభ్యులు ఉండగా.. 2019-20 నాటికి వీటి సంఖ్య 8,109 కి చేరింది. ఈ సొసైటీల్లో 7,61,895 మంది సభ్యులు ఉన్నారు.
రాష్ట్రం | 2012లో గొర్రెల సంఖ్య (కోట్లలో) | 2019 లో గొర్రెల సంఖ్య (కోట్లలో) | పెరుగుదల శాతం |
తెలంగాణ | 1.28 | 1.91 (2020 జనవరి నాటికి 1.97 కోట్లు) | 48.51 |
ఆంధ్రప్రదేశ్ | 1.36 | 1.76 | 30.00 |
కర్ణాటక | 0.96 | 1.11 | 15.31 |
రాజస్తాన్ | 0.91 | 0.79 | 12.95 |
తమిళనాడు | 0.48 | 0.45 | 5.98 |
జమ్మూకాశ్మీర్ | 0.34 | 0.32 | 4.19 |
మహారాష్ట్ర | 0.26 | 0.27 | 3.87 |
గుజరాత్ | 0.17 | 0.18 | 4.66 |
ఒడిశా | 0.16 | 0.13 | 19.10 |
ఉత్తరప్రదేశ్ | 0.14 | 0.10 | 27.25 |
రానున్న రోజుల్లో గొర్రెల సంతతి పెంపును దృష్టిలో ఉంచుకొని, ప్రతి 3 మండలాలకు ఒక గొర్రెల కొనుగోలు సంతను, 100 గ్రామీణ నియోజకవర్గాల్లో అధునాతన వధశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పీపీపీ పద్ధతిపై 200 ఎకరాల్లో టెర్మినల్ మార్కెట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీనిద్వారా మన రాష్ట్రంలోని వారే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలవారు తమ గొర్రెలు, మేకల క్రయ విక్రయాలు చేసుకొనే వీలుంటుంది.
యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి, వారికో వేదిక ఉండడానికి గొల్ల, కుర్మల కోసం హైదరాబాద్ లో రూ.10 కోట్ల వ్యయంతో 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించి, అందులో యాదవ్, కురుమ భవన్ లను నిర్మించనున్నారు. యాదవ, కురుమ సంక్షేమ భవనాల నిర్మాణానికి కోకాపేట సమీపంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో డిసెంబర్ 29, 2017న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. యాదవులు సమావేశాలు నిర్వహించుకోవటానికి, పేద యాదవులు పెండ్లిళ్లు జరుపుకోవడానికి అనువుగా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమల్లో ఎవరు అనాథగా ఉన్నా, వారికి ఇక్కడ అన్నం, విద్య దొరికే విధంగా ఈ సంక్షేమ భవనాలు రూపొందనున్నాయి. తల్లిదండ్రులు లేని గొల్ల, కురుమ అమ్మాయిలకు, పేద అమ్మాయిలకు ఇక్కడ వివాహాలు జరిపించేందుకు కల్యాణ మండపం ఏర్పాటు చేయనున్నారు.
యాదవులకు రూ. కోటి నిధి: యాదవులను ఆదుకునేందుకు మూలధనం కింద కోటి రూపాయలు మంజూరు చేశారు. యాదవ కుటుంబాల్లో చదువుకునే వారికి, వైద్యం అవసరం ఉన్న వారికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది.
గ్రామీణ ప్రాంతాల యాదవులకు గొర్రెలు పంచితే, పట్టణ ప్రాంతాల్లోని యాదవుల కోసం ప్రభుత్వమే ఆర్థికసాయం అందించి మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని భావించింది. వీటికి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ నుంచి సబ్సిడీ ఇవ్వనుంది. ఇవి కేవలం హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు కోసం, గల్ఫ్, జర్మనీ దేశాలకు వెళ్లి అక్కడ మీట్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో 100 ఎకరాల విస్తీర్ణంలో మాంసం ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లూలూ ఇంటర్నేషనల్ సంస్థ అంగీకరించింది. గల్ఫ్ ఫుడ్ట్రేడ్ షోలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 20 ఫిబ్రవరి, 2018న లూలూ ఇంటర్నేషనల్ సంస్థ సీఈవో, కో-డైరెక్టర్లతో చర్చలు జరిపి, ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసే మాంసం ఎగుమతి కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 203 మాంసం, కూరగాయల మార్కెట్లను అభివృద్ధి చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. 2018-19లో రూ.32.13 కోట్ల ఖర్చుతో 81 కూరగాయల మార్కెట్లు, 122 మాంసం మార్కెట్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మత్య పరిశ్రమ ఊహించని రీతిలో అభివృద్ధి చెందడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దీంతో కొన్ని లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి లభించేలా ప్రభుత్వం చేపల పెంపకాన్నిప్రొత్సహిస్తున్నది. చెరువుల్లో చేపలను పెంచే బెస్తలు (గంగపుత్రులు), ముదిరాజులతో పాటు ఇతర కులాల్లోని చేపల పెంపకందారులకు ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లలను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని 3 అక్టోబర్, 2016 న ప్రారంభించారు. ప్రతీ సంవత్సరం 3,20,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీకి ప్రభుత్వం 04 ఫిబ్రవరి, 2021 నాటికి రూ.231.26 కోట్లను (చేప పిల్లలకు రూ.209 కోట్లు + రొయ్య పిల్లలకు రూ.22.26 కోట్లు) ఖర్చుచేసింది.
వివిధ నీటివనరుల్లో 272.32 కోట్ల చేప,రొయ్య పిల్లలను (చేప పిల్లలు 260.65 కోట్లు + రొయ్యలు 11.64 కోట్లు) విడుదల చేశారు.
2015 నుంచి ఫిబ్రవరి 2021 నాటికి 13,10,239 టన్నుల ఉత్పత్తి జరిగింది. వీటి విలువ సుమారుగా 17,199 కోట్ల వరకు ఉంటుంది.
క్ర.సం | సంవత్సరం | చేపల ఉత్పత్తి (టన్నుల్లో) | రొయ్యల ఉత్పత్తి | మొత్తం ఉత్పత్తి | ఉత్పత్తి అయిన చేపల విలువ | ఉత్పత్తి అయిన రొయ్యల విలువ | వీటి మొత్తం విలువ (కోట్లలో) |
1 | 2015-16 | 2,28,185 | 8,567 | 2,36,752 | 2,397 | 249 | 2,646 |
2 | 2016-17 | 1,93,732 | 5,189 | 1,98,921 | 2,111 | 142 | 2,252 |
3 | 2017-18 | 2,62,252 | 7,783 | 2,70,035 | 3,419 | 198 | 3,617 |
4 | 2018-19 | 2,84,211 | 9,998 | 2,94,209 | 3,742 | 272 | 4,014 |
5 | 2019-20 | 2,99,869 | 10,453 | 3,10,322 | 4,332 | 338 | 4,670 |
మొత్తం | 12,68,249 | 41,990 | 13,10,239 | 16,001 | 1199 | 17,199 |
సంవత్సరం | జలాశయాలు | జలాశయాల్లో వేసిన చేప పిల్లలు (కోట్లలో) | ఖర్చు (కోట్లలో) |
2016-17 | 3,939 | 27.85 | 22.46 |
2017-18 | 11,067 | 51.08 | 44.6 |
2018-19 | 10,776 | 49.15 | 42.95 |
2019-20 | 15,715 | 64.08 | 46.63 |
2020-21 | 18,335 | 68.52 | 52.01 |
మొత్తం | 260.68 | 209 |
సంవత్సరం | జలాశయాలు | జలాశయాల్లో వేసిన రొయ్య పిల్లలు (కోట్లలో) | ఖర్చు (కోట్లలో) |
2017-18 | 11 | 1.08 | 1.38 |
2018-19 | 24 | 3.19 | 6.27 |
2019-20 | 70 | 3.42 | 6.39 |
2020-21 (04 02, 2021 వరకు) | 93 | 3.95 | 8.22 |
మొత్తం | 11.64 | 22.26 |
2016-17 బడ్జెట్లో మత్స్యశాఖకు రూ.101 కోట్లు, 2017-18 లో రూ.60.5 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో రూ.1,126.73 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.1.204 కోట్లు, 2020-21లో రూ.1586.38 కోట్లను పశు సంవర్థక, మత్స్య శాఖకు కలిపి కేటాయించారు. ఇందులో మత్స్యశాఖకు రూ.320 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.650 కోట్లు ప్రతిపాధించారు. ఈ నిధులను ఉచితంగా చేప పిల్లల పంపిణీకి, కేజ్ కల్చర్ (పంజరాల్లో చేపల పెంపకం), చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి వీటిని వినియోగిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలు, వలలు వాహనాల కోసం, మత్స్య కార మహిళా సహకార సంఘాల కోసం మార్చి 2020 నాటికి రూ.750 కోట్లు ఖర్చు చేశారు. గతంలో ఒక్కో మత్స్య సహకార సంఘానికి రూ.12,500 వరకే ఇస్తే ఇప్పుడు చెరువు సామర్థ్యానికి అనుగుణంగా చేప పిల్లలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పట్టిన చేపలు అమ్ముకోడానికి వీలుగా 33 జిల్లాల్లో మొత్తం 40 రిటైల్ సేల్ చేపల మార్కెట్లు నిర్మిస్తున్నారు. మరో 250 రిటైల్, 30 హోల్ సేల్ చేపల మార్కెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 చోట్ల హోల్ సేల్ చేపల మార్కెట్లను రూ.9.65 కోట్ల వ్యయంతో నిర్మించారు. రాష్ట్రంలోని సుమారు 3.2 లక్షల మత్స్యకారులకు ప్రభుత్వం రూ.6 లక్షల బీమా కల్పిస్తున్నది.
గొర్రెల పెంపకం తరువాత తెలంగాణలో మత్స్య పరిశ్రమ పైనే ఎక్కువ మంది ఆధారపడ్డారు. మత్స్యకారులను ఆదుకోవాలని, మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 బడ్జెట్లో చేప పిల్లల పంపిణీకి 1 కోటి రూపాయలు కేటాయించారు. 5 సెప్టెంబర్, 2018 న రూ.1,000 కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 2019 నాటికి 1.60 లక్షల మందికి విలువైన ఉపకరణాలను రూ.535 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేశారు. ఈ పథకం కింద మత్స్యకారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీతో పరికరాలను అందిస్తున్నారు. 80 వేల మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్మును చిల్లించగా వారికి 75 శాతం సబ్సిడీతో రూ.535.93 కోట్ల విలువైన 77,448 యూనిట్ల పరికరాలను అందించింద. 60,398 మందికి వెండింగ్ యూనిట్ల కింద పంపిణీ చేసే మోపెడ్లను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఫెబ్రవరి 2019 నాటికి 50,460 మందికి పంపిణీ చేశారు. ప్లాస్టిక్ ఫిష్ క్రేట్స్ 30 వేలకు గాను 3,515, 9,759 లగేజీ ఆటోలకు గాను 2 వేలు పంపిణీ చేశారు. 1,591 మొబైల్ ఫిష్ ఔట్ లెట్లకు గాను 420 ఏర్పాటు చేశారు. చేపలు అమ్మేందుకు 50 వేల బైక్ లను 75 శాతం రాయితీతో ఇస్తోంది. ప్లాస్టిక్ చేపల క్రేట్లను ఒక్కోటి రూ.4 వేల చొప్పున 30 వేలు ఇవ్వనున్నారు. 45 వేల వలలు, క్రాప్టులు అందజేయనున్నారు. పోర్టబుల్ చేపల అమ్మకానికి కియోస్కూలను రూ.20 వేల ధరతో 19 వేల యూనిట్లు అందించాలని నిర్ణయించారు. ప్రాసెసింగ్ యూనిట్ ధర రూ.76 లక్షలు కాగా రూ.19 లక్షలకే ఇవ్వనున్నారు. ఐస్ ప్లాంట్ నిర్మాణానికి రూ.25 లక్షలు కాగా, లబ్ధిదారునికి రూ.6.25 లక్షలకు ఇస్తారు. ఇన్సులేటెడ్ ట్రక్కు ధర రూ.15 లక్షలు కాగా, లబ్ధిదారునికి రూ.3.75 లక్షలకు, లగేజీ ఆటో ధర రూ.5 లక్షలు కాగా, రూ.1.25 లక్షలకు, పరిశుభ్ర రవాణా వాహనపు ధర రూ.10 లక్షలు కాగా, రూ.2.50 లక్షలకు అందిస్తారు.
మహిళా మత్స్య సంఘాలకు రూ.5 లక్షల చొప్పున గ్రాంట్లు అందిస్తున్నారు. ప్రమాద వశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారు. చేపల పెంపకానికి అనుకూలమైన అన్ని నీటి వనరులలో 100 శాతం గ్రాంట్తో చేప పిల్లలను పంపిణీ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
మత్స్యకారులకు అదనపు ఆదాయాన్ని కల్పించటం కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా హేచరీలలో ఉత్పత్తి అయిన 1 కోటి 8 లక్షల మంచినీటి రొయ్య విత్తనాలను 11 జలాశయాల్లో ప్రయోగాత్మకంగా వేశారు. ఇందుకోసం రూ.14 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం ద్వారా 5 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.70 లక్షల టన్నుల మత్స్య సంపద లభించింది.
నీలివిప్లవం పథకం క్రింద 11 జలాశయాలలో ఆధునిక పద్ధతిలో అధిక మొత్తంలో చేపల ఉత్పత్తిని చేపట్టడానికి రూ.3 లక్షల యూనిట్ విలువ గల 360 పంజరాలను ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టారు. ఈ పథకంతో 400 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం క్రింద 2016-17 లో రూ.14.65 కోట్లు, 2017-18 లో రూ.19.60 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించారు. 2018-19 లో రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు.
మత్స్యకారులు పట్టిన చేపలను ప్రజలకు అందించేందుకు పట్టణాలు, మున్సిపాలిటీల్లో 75 శాతం సబ్సిడీపై 4 వేల పోర్టబుల్ కియోస్కులు, 100 సంచార చేపల అమ్మకం వాహనాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. హైదరాబాద్ నగరంలో మరో 150 సంచార మత్స్య విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రం యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా 50 శాతం సబ్సిడీగా (రూ.5 లక్షలు) ఇస్తారు. పర్యాటక ప్రాంతాలు, హైవేలు, అధిక జనాభా గల ప్రాంతాల్లో చేపలతో తయారుచేసిన ఆహార పదార్ధాలు తక్కువ ధరలకు అందించుటకు 90 శాతం సబ్సిడీపై చేపల విక్రయ కియోస్కులు ఏర్పాటు చేస్తున్నారు.
బీసీ కులాల వారిని ఆదుకుంటూ, వారి వృత్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులు లేని వారికి కూడా ఆర్థిక సాయం చేయ తలపెట్టింది. కుల వృత్తులు లేని వారిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కుల వృత్తులు లేనివారి కోసం వివిధ పథకాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 17 కులాలను గుర్తించిన ప్రభుత్వం వారిని బీసీ జాబితాలో చేర్చింది. గుర్తింపుకు నోచుకోని 17 కులాల్లో 13 కులాలను బీసీ ఏ జాబితాలో, 4 కులాలను బీసీ డీ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 09 సెప్టెంబర్, 2020న జారీ చేసింది.
గీత కార్మికులకు, మత్య్స కార్మికులకు రూ. 6 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని 10 జూన్, 2015న సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా సమాన పరిహారం అందిస్తున్నారు. గీత పారిశ్రామిక సంఘాలు, మత్య్స కార్మిక సంఘాల్లో రిజిస్టర్ అయి సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యులందరికీ బీమా సౌకర్యం లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నది. రాష్ట్రం ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా పేరు సాధించింది. కోళ్ల దాణా ఉత్పత్తిలో, కోడి పిల్లల ఉత్పత్తిలో (6.29 కోట్లు) తెలంగాణ దేశంలో మూడో స్థానంలో వున్నది. కోడి మాంసం ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానం పొందింది. రాష్ట్రంలో ఏటా 20 కోట్ల బ్రాయిలర్ కోళ్లు ఉత్పత్తి చేస్తున్నది. పౌల్ట్రీ పరిశ్రమ రోజుకు 3.2 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నది. ఈ పరిశ్రమపై లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం కరేంటును యూనిట్ కు రూ. 2 సబ్సిడీపై అందిస్తున్నది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి 2018-19 బడ్జెట్లో రూ.109 కోట్లు కేటాయించింది. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమలు రోజూ అంగన్ వాడీ సెంటర్లకు (20 లక్షలు), మధ్యాహ్న భోజన పథకానికి (5 లక్షలు), సోషల్ వెల్ఫేర్ పాఠశాలలకు (50 వేలు) గుడ్లను అందిస్తున్నాయి.
నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. వ్యవసాయం తర్వాత మన దేశంలో అతి పెద్ద ఉపాధి కల్పనా రంగం చేనేత, జౌళి రంగమే. రాష్ట్రంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ఈ రంగం చేయూతనిస్తోంది. తగినంత ముడిసరుకు దొరకకపోవడం, సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడడం, మిల్లుల నుంచి వస్తున్న తీవ్ర పోటీ తదితర కారణాల వల్ల చేనేత రంగం ఒడిదొడులు ఎదుర్కొంటున్నది. ఈ రంగంలోని మేధావులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుమార్లు చర్చించిన ప్రభుత్వం చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంది. నేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుంచి బయటపడి, వారు సంతోషకరమైన జీవితం గడిపేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది. నేత వృత్తిని ఆధారం చేసుకుని బతికే కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల ఆదాయం వచ్చేటట్లుగా ప్రభుత్వం యాజమాన్యాలను ఒప్పించింది. కార్మికులకు నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా బ్యాంకులో వేతనం వేస్తామని వారు వెల్లడించారు.
చేనేత రంగం అభివృద్ధికి చర్యలు: తగినంత బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందితేనే చేనేత రంగం సమస్యల ఊబి నుంచి బయట పడుతుంది. ఈ వాస్తవం తెలుసు కాబట్టే ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లో ఎన్నడూ లేనివిధంగా రూ. 1,270 కోట్లు (సాధారణ బడ్జెట్ -70 కోట్లు, ప్రత్యేక బడ్జెట్ 1,200 కోట్లు) కేటాయించింది. 2018-19 బడ్జెట్లో కూడా రూ.1,200 కోట్లు కేటాయించారు. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం స్థానంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం, ఈ రంగాన్ని నమ్ముకున్న నేత కార్మికులకు స్థిరమైన ఉపాధి దొరికేలా చూడడం, ఎవరైనా ప్రత్యామ్నాయ ఉపాధి కోరుకుంటే వారికి ఉపాధి మార్గాలు చూపించడం, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, బ్రాండ్ ప్రమోషన్ తో ఈ రంగానికి మరింత ప్రచారం తేవడం ఈ కేటాయింపుల ప్రధాన లక్ష్యం. కే తారకరామారావు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించే విధంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలన్నింటినీ చేనేత కళాకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందించే చీరలను, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంలో మైనారిటీలకు అందించే బట్టల అర్డర్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు.
(వివిధ యూనిఫారాలు, ఇతర వస్త్రాలు)
2010 – 14 : రూ. 181. 33 కోట్లు
2014-20 : రూ. 335.71 కోట్లు
(పెరుగుదల 154.38 కోట్లు, పెరిగిన శాతం 85.47 )
హ్యాండ్లూమ్ & టెక్స్ టైల్స్ ఖర్చు
2008 – 14 : రూ. 603.24 కోట్లు (మొత్తం సమైక్య ఎ.పి.)
2014-20 : రూ.1629.76 కోట్లు
(పెరుగుదల రూ.1,026.52 కోట్లు, పెరిగిన 170 శాతం)
నేత కార్మికుడి తలసరి నెల వేతనం
2013-14 : రూ. 5,000
2019-20 : రూ. 15,000
(పెరుగుదల రూ.10,000, పెరిగిన శాతం 200)
బహిరంగ మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూం వీవర్స్ రేటివ్ సొసైటీ లిమిటెడ్) సిద్ధమైంది. విని యోగదారుల అభిరుచి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఈ-కామర్స్ మార్కెట్ లో దూసుకుపోవాలని టెస్కో నిర్ణయించింది. చేనేత వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా విక్రయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో త్వరలో ఒప్పందం చేసుకోనున్నది. మార్చి నాటికి ఈ కామర్స్ సైట్లలో చేనేత చీరెలు, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, షర్ట్స్, ధోవతులు లభించనున్నాయి. తద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు పెరగటంతో పాటు కార్మికుల ఆదాయం రెట్టింపు అవుతోందని చేనేత శాఖ ఆశిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’ అనే పొదుపు పథకానికి శ్రీకారం చుట్టింది. భూదాన్ పోచంపల్లి వేదికగా మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పథకాన్ని జూన్ 24, 2017న ప్రారంభించారు. గతంలో ఈ పథకం కింద సహకార సంఘంలోని నేత కార్మికులు ఒక నెలలో పొందే కూలీలో 8 శాతం వాటాను బ్యాంకులో జమ చేస్తే, తనవంతుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 8 శాతం జమ చేసింది. దీర్ఘ కాలంలో నేతన్నలకు ప్రయోజనకరంగా ఉండే ఈ పథకం పరిధితో పాటు విస్తృతిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ఒక నెలలో పొందే కూలీలో 8 శాతం వాటాను నేతన్న జమ చేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది. గరిష్టంగా రూ.2,400 వరకు జమ చేయబడుతుంది. 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు (వీవర్స్, డైయర్స్, వెండర్స్, వార్పర్స్, సహాయ వీవర్స్) అందరూ ఈ పథకానికి అర్హులు. మూడేళ్ల తర్వాత ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు. సహకార సంఘంలో లేని వారికి కూడా ఈ పథకం (థ్రిఫ్ట్) వర్తింపచేశారు. గతంలో కేవలం సహకార సంఘంలో వున్న నేతన్నలకే ఈ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు సహకార సంఘంలో లేనివారు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు. డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, చేనేత అనుబంధ కార్మికులూ ఈ పథకానికి అర్హులవుతారు.
కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకానికి రూ.110 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం నేతన్నలను కష్టకాలంలో ఆదుకున్నది. నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను నేత కార్మికులు గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో 25 వేల మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులు చెల్లించిన పొదుపు మొత్తానికి రెట్టింపు, పవర్ లూం కార్మికుల వాటాకు సమానంగా ప్రత్యేక అకౌంట్లలో జమచేసింది. మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ఉండగా, కరోనా నేపథ్యంలో ముందే డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించింది. చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు, పవర్లూం కార్మికులకు రూ.13 కోట్లు మొత్తంగా రూ.110కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.
మొదటి సారిగా మరమగ్గాల కార్మికులకు థ్రిఫ్ట్ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం నెలకు వచ్చే కూలీలో 8 శాతం జమచేస్తుంది. 10 వేల మరమగ్గ కార్మికులు ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇందుకోసం రూ. 15 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సమృద్ధి యోజన పథకాల కింద లబ్ధిదారుడి తరుపున ప్రతీ కార్మికుడి పేరిట రూ.80 చొప్పున 7,200 మంది లబ్ధిదారులకు 5.76 లక్షల రూపాయలను 2018-19 గాను ప్రభుత్వం చెల్లించింది. నేత కార్మికుడు సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు అందజేస్తారు.
చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించనుంది. వారి నుంచి ఒక్కపైసా వసూలు చేయకుండా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అంతే కాకుండా జీవిత కాలం రెన్యూవల్ కూడా ప్రభుత్వమే చేపట్టనుంది. కేవలం దరఖాస్తు చేసుకుంటే అతడికి జీవితాంతం బీమా వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో 30వేల మందికిపైగా లబ్ధి కలుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం ప్రీమియం రూ.470, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.290, ఎల్ఐసీ రూ.100 చెల్లిస్తుంది. కార్మికుడి వాటాగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు ఉన్న పవర్ లూం మీద పనిచేసే ప్రతి కార్మికుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడు. ఒక ఇంట్లో ఎంతమంది పనిచేస్తుంటే అంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో జనశ్రీ బీమా యోజన పథకం స్థానంలో కొత్తగా కన్వర్జ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని రూపొందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35,762 మరమగ్గాలు వున్నాయి. వీటి అధునీకరణకు అవసరమయ్యే నిధుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలనుంచి 50 శాతం, రాష్ట్ర బడ్జెట్ నుంచి 50 శాతం సబ్సిడీని సమకూర్చుతారు. ఎలాంటి పరిమితులు లేకుండా ఎంతమంది కార్మికులకైనా సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం కార్మికులు చేనేత జౌళి శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరమగ్గాల ఆధునీకరణకు రూ.30 కోట్లు కేటాయించారు. వీటిలోంచి రూ.8.15 కోట్లతో 9,723 మరమగ్గాలను ఆధునీకరించారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన రూ.1,200 కోట్ల నుంచి ఈ నిధులను వెచ్చిస్తున్నారు.
చేనేత కళాకారులు తయారుచేసే స్కూల్ యూనిఫాం (లీవరీ వెరైటీ క్లాత్) వస్త్రం తయారీ ధరను 50శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సూటింగ్ క్లాత్ మీటర్ రూ.27 చెల్లిస్తుండగా, ఇకపై రూ. 40.50పైసలు, షర్టింగు క్లాత్ మీటర్ కు రూ.24 ఇస్తుండగా ఇకపై రూ.36 ఇవ్వనున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం ఏటా 25 లక్షల మీటర్ల లివరీ వెరైటీ క్లాత్ ను కొనుగోలు చేస్తున్నది. కూలి ధరలు తక్కువగా ఉన్నాయన్న వినతి మేరకు టెస్కో అంగీకరించి ధర పెంచింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.2.7 కోట్ల భారం పడుతున్నది.
పని కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన కార్మికులు తిరిగి వచ్చి ఇక్కడే ఉపాధి పొందే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు (కేఎంటీపీ)కు 22 అక్టోబర్, 2017న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పార్కును 1,190 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,075 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో రూ. 9 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా. నూలుపోగు నుంచి రెడీమేడ్ వస్త్రాల వరకు అన్నిరకాల వస్త్రాలను తయారు చేసే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే పెద్దది. అదేరోజు తెలంగాణ ప్రభుత్వం దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలతో అవగాహన ఒప్పందాల్ని కుదుర్చుకుంది. 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 60 వేల నుంచి 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఈ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలను కేటాయించింది. మౌలిక వసతుల కల్పన కోసం రూ.24 కోట్లు విడుదల చేసింది. యంగ్ వన్ కార్పొరేషన్, వెల్స్ పన్, చిరిపల్, ఇండో కౌంట్ వంటి ప్రధాన సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సహకరించి భూములిచ్చిన రైతుల కుటుంబాలకు పార్కులోనే ఒక్కో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. టెక్స్ టైల్ పార్కుకు విదేశీ వ్యాపారవేత్తలు వచ్చేందుకు వీలుగా పక్కనే ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది. పూర్తిస్థాయి విమానాశ్రయంగా కాకపోయినా, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల రవాణాకు అనువైన సౌకర్యం కల్పించనున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కొరియా నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ టెక్స్ టైల్ పార్కులోని 290 ఎకరాల్లో రూ.900 కోట్లతో యూనిట్ స్థాపించేందుకు ముందుకు వచ్చింది. 11.12.2019 రోజున హైదరాబాద్ లో కొరియా టెక్స్ టైల్ కంపెనీ యంగ్ వన్ కార్పొరేషన్ ఛైర్మన్ కిహాక్ సుంగ్ కు ఈ యూనిట్ స్థాపనకు అవసరమయ్యే భూమి పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు.
మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రూప్ వర్క్ షెడ్ (వర్కర్ టు ఓనర్) పథకానికి మరియు సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లతో 11 అక్టోబర్, 2017న భూమి పూజ చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వమే వర్క్ షెడ్లను ఉచితంగా నిర్మిస్తుంది. దీంతోపాటు 50 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లోను, 20 శాతం కార్మికుని వాటాతో ఒక్కో కార్మికునికి రూ. 8 లక్షల విలువైన (4) పవర్ లూమ్స్ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) సిద్దం అవుతున్నది. దీంతో సాధారణ మరమగ్గాలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్చరింగ్, డైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, క్యాలెండరింగ్ వంటి సౌకర్యాలతో కామన్ ఫెసిలిటి సెంటర్ ను ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. పై పథకాల కోసం ప్రభుత్వం రూ.327 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద 1,104 మరమగ్గాల యూనిట్లు ఏర్పాటు చేయడానికి 4,416 మరమగ్గ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ, ఉచిత వర్క్ షెడ్ ప్రాంతాలను ఏర్పాటు చేయటానికి 88 ఎకరాల స్థలాన్ని సిరిసిల్లలో కేటాయించడం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.386.88 కోట్లు ఖర్చు కానుంది. మౌలిక వసతుల ఏర్పాట్లు టిఎస్ఐఐసి నిర్వహిస్తుంది.
చేనేత కార్మికులను ఎలాగైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో చేనేత కార్మికుల రుణ బకాయిలను మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మార్కెట్లో తీవ్రమైన పోటీతో చేనేత ఉత్పత్తులకు సరైన ధర రావడం లేదు. ఫలితంగా నేత కార్మికుల ఆదాయం తగ్గిపోతున్నది. నేతన్నలు తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక పోతున్నారు. నేత కార్మికుల సామాజిక, ఆర్థిక బాగు కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం, అప్పుల ఊబి నుంచి వారిని బయటకు తెచ్చేందుకు వారి రుణాలను మాఫీ చేసింది.
చేనేత కార్మికులకు రాష్ట్రం ఏర్పడటానికి పూర్వం ఉన్న రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది. తొలుత నిర్ణయించిన విధంగా 2014 జనవరి 1 నుంచి కాకుండా 2010 ఏప్రిల్ 1 నుంచే రుణమాఫీని వర్తింపజేస్తూ.. 23 మార్చి, 2018న ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం వల్ల 8 వేలమంది చేనేత కార్మికులు రుణ విముక్తులయినారు. రూ.50 కోట్ల వరకు లబ్ధిపొందారు. తొలుత ప్రభుత్వం చేనేత కార్మికులు జాతీయ బ్యాంకుల నుంచి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి చేనేత ఉత్పత్తుల కోసం.. 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకు తీసుకున్నవర్కింగ్ కాపిటల్, వ్యక్తిగత రుణాలను రూ.లక్ష వరకు (లక్ష పైబడి రుణాలు తీసుకున్నా.. రూ.ఒక లక్ష వరకు మాఫీ లభిస్తుంది) మాఫీచేస్తూ జీవోను జారీచేసింది. ప్రభుత్వ పథకాలకు 2014 జూన్ 2ను కటాఫ్ డేట్ గా పరిగణించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సాధారణంగా రుణమాఫీ చేసిన సందర్భాల్లో రుణాలు చెల్లించని వారికే రుణమాఫీ వర్తింప జేస్తారు. కానీ, సకాలంలో రుణాలు చెల్లించిన వారు నష్ట పోకుండా ఉండేందుకు.. వారు చెల్లించిన రుణాలను సైతం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో రుణాలు చెల్లించిన కార్మికుల ఖాతాల్లో రూ. లక్ష పరిమితితో వారి డబ్బులను తిరిగి వేస్తున్నారు.
చేనేత సహకార సంఘంలోని సోసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం సబ్సిడీని ఇస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 10 శాతం సబ్సిడీ అదనం. ఈ నేపథ్యంలో నేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతంకి పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం సబ్సిడీ కూడా ఎప్పటిలాగానే లభిస్తుంది. మొత్తంగా వీరికి 50 నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకంతో చేనేత, అనుబంధ కార్మికులకు 35 శాతం అదనపు ఆదాయం లభిస్తుంది. ఆయా సొసైటీలకు 5 శాతం ఆదాయం సమకూరుతుంది. ఈ పథకం కోసం రు. 20 కోట్లు విడుదలయ్యాయి. మే 2018 నాటికి 648 వాటాదారులు, 17,010 మంది చేనేత కార్మికులకు రూ.18.58 కోట్ల సబ్సిడీని వారి ఖాతాలకు జమ చేశారు.
చేనేత ఉత్పత్తుల విస్తరణ, డిజైన్ ను మెరుగు పరచడం, బ్రాండ్ ప్రమోషన్ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని మగ్గాల నుంచి వస్త్రాలను టి.ఎస్.సి.ఒ కొనుగోలు చేస్తుంది. చేనేత ఉత్పత్తుల కొనుగోలు కోసం 127 కోట్ల రూపాయలు, హస్త కళల అభివృద్ధి కోసం ఇంకో 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటు చేనేత ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ సదుపాయాల కోసం 11 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
ప్రభుత్వం తరపున జరిపే అన్ని శాఖల వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత, మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నారు. టి.ఎస్.సి.ఓ. ప్రభుత్వ పాఠశాలల యూనిఫారంలను, ఇతర శాఖలకు అవసరమైన వస్త్రాలను నేత కార్మికుల నుంచి కొనుగోలు చేసి వస్త్రాలను సరఫరా చేస్తున్నారు. పాఠశాల విద్యా శాఖకు చెందిన 22 లక్షల మంది విద్యార్థుల యూనిఫారాలకు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు 97 లక్షల చీరలు, కేసీఆర్ కిట్లలోని దుస్తులు 4.50 లక్షలు, క్రిస్ మస్ సందర్భంగా అందించే దుస్తులు 2.50 లక్షలు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు 4.50 లక్షల దుస్తులను బహూకరించారు. ఈ బహుమానాల తయారీకి కావలసిన వస్త్రాన్ని 727.09 కోట్ల ఖర్చుతో 2014-15 నుంచి 2017-18 వరకు కొనుగోలు చేయడం జరిగింది. దీంతో చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఉపాధికి ప్రోత్సాహం ఇచ్చినట్లయింది.
చేనేత పార్క్, గద్వాల: రూ.14.98 కోట్లతో గద్వాలలో కొత్తగా హ్యండ్ లూమ్ పార్క్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. స్థానిక నేతలు, కార్మికులతో చర్చలు జరపడం జరిగింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఎన్.హెచ్.డి.పి. క్రింద బ్లాక్ లెవెల్ క్లస్టర్లు: జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద 10.19 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం (8) బ్లాక్ లెవెల్ క్లస్టర్లు మంజూరు అయినాయి. ఆలేరు, కమలాపూర్, వెల్టూర్, ఆర్మూర్, శాయంపేట్, కనుకుల, భూదాన్ పోచంపల్లి, వేములవాడలోని 2,602 చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం క్రింద వీవింగ్, డిజైనింగ్ మరియు రంగుల అధ్దకాలలో శిక్షణ, ఆధునిక చేనేత మగ్గాలను సమకూర్చడం, డై హౌస్ మరియు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తారు.
తెలంగాణలో కల్లు గీత ప్రధాన వృత్తి, ఆ వృత్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రజలకు ప్రాణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కల్లు అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో కల్లు దుకాణాలను పునరుద్దరించింది. కల్లు కాంపౌండ్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2014న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 50 వేల మంది గౌడ కులస్తులకు ఉపాధి లభించింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువు కట్టలపై ఈత చెట్లను నాటించింది. మొత్తం 5 కోట్ల ఈత మొక్కలను నాటాలని నిర్ణయించింది.
గీత కార్మికుల సంక్షేమం :
రాష్ట్రంలోని 62,950 మంది గీత కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున ప్రతిఏటా రూ.153 కోట్లు పెన్షన్ అందజేస్తున్నది.
గీత భవన్ నిర్మాణానికి హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు.
తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసింది.
లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది.
బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు.
గీత కార్మికులకు అందించే సబ్సిడీ రూ.25 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు.
కులవృత్తులను ప్రోత్సహించి గ్రామాల స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్.. గౌడ కులస్థులు ఆత్మగౌరవంతో బతికేలా నీరా పాలసీని ప్రకటించారు. గత ప్రభుత్వాలు 70 ఏండ్లుగా గీత కార్మికులపై ఆంక్షలు విధించడమే కానీ వృత్తికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గౌడ కులస్థులకు ఇచ్చిన హామీ మేరకు నీరా పాలసీని ప్రకటించారు. నీరాను గీయడం, అమ్మడం గౌడ కులస్తులు మాత్రమే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీరాలోని ఔషధ గుణాలతో షుగర్, మధుమేహం, క్యాన్సర్, లివర్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. నీరా పాలసీలో తాటి చెట్ల నుంచి నీరా సేకరణ, అమ్మకాలు కొనసాగించేందుకు పదేళ్ళ కాలపరిమితితో లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నీరాను శీతల పానీయంగా అన్ని దుకాణాల్లో అమ్ముకునేందుకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలోని నిబంధనలకు సవరణలు చేస్తూ అబ్కారీ శాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఈ ఉత్తర్వులను విడుదల చేసి గీత కార్మికుల ఉపాధి కల్పనకు మరో బాటను ఏర్పరిచారు. నీరా అమ్మకాలను వ్యవస్థీకృతంగా చేపట్టేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీ గీత కార్మికులకు మరింతగా ఆర్థిక దన్ను కల్పించనుంది.
నీరా స్టాల్స్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున హైదరాబాద్లో నీరా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ట్యాంక్బండ్ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్ ఏర్పాటు చేసిన తర్వాత ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దశల వారిగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాలను విస్తరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేస్తున్నది. నీరా లైసెన్స్లు గౌడ కులస్థులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున గౌడ కులస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నీరా స్టాల్ల ఏర్పాటుతో తమ ఉపాధి మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రజకులకు ప్రభుత్వం చేయూత
రజకులు తమ వృత్తులను సాఫీగా కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్లో రజకుల సంక్షేమానికి రూ.250 కోట్లు, 2018-19 బడ్జెట్ లో రజక ఫెడరేషన్ కు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 2,51,398 రజక కుటుంబాలు ఉండగా.. జనాభా 8,66,243 వున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,862 గుర్తింపు పొందిన రజక సంఘాలలో 6,95,496 మంది సభ్యులు ఉన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం, ఆధునిక యంత్రాలతో లాండ్రీల ఏర్పాటు, వ్యక్తిగత ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద బీసీ ఫెడరేషన్ ద్వారా 52 సొసైటీల్లోని 704 మందికి 50 శాతం సబ్సిడీపై రూ.5 కోట్ల 77 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. 2014 నుంచి మే 2018 వరకు రజకులకు ఆర్ధిక సహాయం అందించే పథకాలకు 451.03 కోట్లు, మోడ్రన్ దోభీఘాట్ల నిర్మాణానికి 169.30 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి 2019 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 332 దోభీ ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఒక్కొదాన్ని రూ.5.60 లక్షల వ్యయంతో నిర్మించాలని మొదట నిర్ణయించినప్పటికీ మోడ్రన్ పద్ధతిలో ఈ దోబీఘాట్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి.. ఈ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఈ దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.33.2 కోట్లు కేటాయించింది. దీంతో దాదాపు 6 వేల మంది రజకులు లబ్ధిపొందారు. మొత్తం పథకాలకు గాను 13,093 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దోబీఘాట్లతో పాటు 43 ఆధునిక మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్లను ఒక్కో యూనిట్ కు రూ.37.40 లక్షలతో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 8 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించేందుకు రజక ఫెడరేషన్ రూ.1.67 కోట్లు విడుదల చేసింది. ఆధునిక యంత్రాలతో లాండ్రీలను ఏర్పాటు చేసే పనులు వివిధ దశల్లో వున్నాయి.
రజకుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. తేదీ 11 ఆగస్టు 2018 రోజున ప్రగతిభవన్ లో రజక సంఘం రాష్ట్ర నాయకులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు హామీలిచ్చారు. రజక యువతకు ఉపాధి కోసం రుణాలు ఇస్తామని, వాషింగ్ మెషీన్లు సబ్సిడీపై ఇస్తామని, 50 ఏండ్లు దాటిన రజక వృత్తి దారులకు ఫించన్లు అందజేస్తామని, ప్రభుత్వ దవాఖానాలు, హాస్టళ్లలో దుస్తులు ఉతికే బాధ్యత రజకులకే అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
నాయీ బ్రాహ్మణులకు చేయూత
రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కు ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో రూ.21.63 కోట్లు, 2015-19లో రూ.20 కోట్లు, 2016-17లో రూ.22 కోట్లు, 2017-18 రూ.250 కోట్లు, 2018-19 బడ్జెట్ లో 250 కోట్లు కేటాయించింది. వ్యక్తిగత ఆర్థిక సహాయం పథకం కింద బీసీ ఫెడరేషన్ ద్వారా 589 మందికి 50 శాతం సబ్సిడీపై రూ.5 కోట్ల 26 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.
నాయి బ్రాహ్మణులకు రూ.1 లక్ష ఆర్ధిక సహాయం
రాష్ట్రంలోని 25 వేల మంది నాయి బ్రాహ్మణులకు కొత్తగా క్షౌర శాలలు పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 బడ్జెట్లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 2017-18లో 366 మంది, 2018-19 లో 200 మందికి (స్త్రీలు 33శాతం) వృత్తి నైపుణ్య శిక్షణ పొందారు
సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్
సెలూన్లకు విద్యుత్తు చార్జీల్లో మినహాయింపు ఇవ్వాలని 2 జనవరి, 2016న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు వాడుకునే 18 వేల సెలూన్లకు వాణిజ్య ప్రాతిపదికన కాకుండా గృహ కేటగిరీ టారిఫ్ కింద విద్యుత్ చార్జీలు వేస్తున్నారు. 1 జూన్, 2016 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం పై రూ.144 కోట్ల భారం అదనంగా పడింది.
బీసీ ల్లోని ఇతర వర్గాలకు చేయూత
బీసీ కులాల్లోని ఇతర వర్గాలకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వీరికి ఫెడరేషన్ల ద్వారా అందించే సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు. 2014 నుంచి ఇప్పటిదాకా వాల్మీకి, బోయ ఫెడరేషన్ కు ప్రభుత్వం రూ.11.02 కోట్లు కేటాయించింది. అలాగే సగర (ఉప్పర) ఫెడరేషన్ కు రూ.20.73 కోట్లు, భట్రాజు ఫెడరేషన్ కి రూ.7.61 కోట్లు, కృష్ణ బలిజ (పూసల) ఫెడరేషన్ కు రూ.15.71 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కు రూ.34.11 కోట్లు, కుమ్మరి (శాలివాహన) ఫెడరేషన్ కు రూ.35.27 కోట్లు, మేదర కార్పొరేషన్ కు రూ.13.63 కోట్లు, వడ్డెర ఫెడరేషన్ కు రూ.34.28 కోట్లు కేటాయించింది.
బీసీలకు వందశాతం సబ్సిడీ రుణాలు
ఆర్థిక సహకార పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలోని బీసీలకు వందశాతం సబ్సిడీతో రూ.50 వేల రుణాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలను రూపొందించగా, 2018 ఆగస్టు లో బీసీ సంక్షేమశాఖ సర్క్యులర్ జారీచేసింది. వందశాతం సబ్సిడీతో రూ.50వేల రుణసహాయం అందించేందుకు అర్హుల ఎంపిక, మంజూరీ విధానంపై జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్ల ఎండీలకు విధివిధానాలను సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశారు.
2020లో బీసీ సంక్షేమశాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్డడానికి రాష్ర్ట ప్రభుత్వం రూ.334.67 కోట్లు మంజూరు చేసింది.
అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
వెనుకబడిన తరగతుల (బీసీ)లో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆమోదం తెలుపుతూ 03 మార్చి, 2017న ఫైల్పై సంతకం చేశారు. వెనుకబడిన తరగుల కోసం ఇప్పటికే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండగా అదనంగా ఈ వర్గాలలోని అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ఆర్థిక సహకార సంస్థను (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ కార్పొరేషన్) ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీల సాంఘిక, విద్యా, ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరిచే ఉద్దేశ్యంతో ఎంబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. అత్యంత వెనుకబడిన బీసీ కులాల (ఎంబీసీ) అభివృద్ధికై ప్రభుత్వం 2017-18, 2018-19, 2019-20 బడ్జెట్లలో రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3,000 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా టి.శ్రీనివాస్ ను నియమించారు.
ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలు
సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత్యంత వెనుకబడిన బీసీ కులాల (ఎంబీసీ) అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్వయం ఉపాధి పథకాలకు ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు ఇస్తున్నట్లుగానే ఎంబీసీలకు కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంబీసీల కోసం అమలు చేసే స్వయం ఉపాధి పథకాల సబ్సిడీ ఫైలుపై ముఖ్యమంత్రి 8 మార్చి, 2018న సంతకం చేశారు. ఎంబీసీల కోసం అమలు చేయాల్సిన పథకాలకు వెంటనే రూపకల్పన చేసి, సహాయం అందించాలని ఆదేశించారు. బీసీలకు అమలు చేసే ఆర్థిక సహకార పథకానికి గతంలో రూ.లక్షకు రూ.60 వేలు (60శాతం) సబ్సిడీ ఇచ్చేవారు. ఆ సబ్సిడీని మరింత పెంచనున్నారు. అదే విధంగా రూ.ఒక లక్ష నుంచి రూ.12 లక్షల వరకు యూనిట్లు నెలకొల్పేందుకు వెసులు బాటు కల్పించనుంది. రూ.లక్ష వరకు తీసుకునే ఆర్థిక సహకారంలో 80 శాతం (రూ.80 వేలు) సబ్సిడీ, రూ.2 లక్షలు విలువైన యూనిట్ నెలకొల్పే వారికి 70 శాతం (రూ.1.40 లక్షలు) సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల విలువైన యూనిట్లు నెలకొల్పే వారికి 60 శాతం (గరిష్టంగా రూ.5 లక్షలు) సబ్సిడీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సంచార జాతుల యువతకు ఈ-ఆటోలతో ఉపాధి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన తరగతుల యువత ఆర్థిక వనరులు పెంచుకునేలా ఎంబీసీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యాచరణ తయారుచేసింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల వద్ద నడుపుకొనేందుకు వీలుగా.. ఎంబీసీ యువతకు ఈ-ఆటోలు అందించి, ఉపాధి కల్పిస్తున్నది. సంచార జాతుల్లో ప్రధానంగా బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దాసరి, దొమ్మరి, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండి, వంశరాజు, పాములోల్లు, పార్థీలు, పంబాల, దేవరలు, పెద్దమ్మల, వీరభద్రీయ, గుడాల, కంజరభట్ట, మొండిపట్టు, పరిగముగ్గుల, యాట, నొక్కర్, పాల ఎకిరి, కైకాడి, చొప్మారే, జోషినంది వాలి, మందుల, కూనపులి, పట్ర, రాజన్నల, గోత్రాల, బుక్క, అయ్యవారు, కాశికాపుడి, సిద్ధుల, సికిలిఘర్ కులాల వారు ఉన్నారు.
– పథకం నిర్వహణలో దేశంలోనే ముందంజలో ఉన్న తెలంగాణమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణ, కూలీలకు పని కల్పించడంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. కేటాయించిన పనిరోజులను ముందుగానే పూర్తిచేసి అదనపు పని రోజులకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి 10 కోట్ల పనిరోజులు టార్గెట్గా ఇచ్చింది. అధికారులు 15 ఫిబ్రవరి, 2018 నాటికి 10.83 కోట్ల పనిరోజులు కల్పించారు. ఆర్థిక సంవత్సరం మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తిచేయడంతోపాటు అదనంగా పని కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.
ఉపాధి హామీ కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో 15 ఫిబ్రవరి, 2019 నాటికి 24.4 లక్షల కుటుంబాల్లోని 41 లక్షల మంది కూలీలకు పనులు కల్పించారు.
ఫలితంగా ఒక్కో కుటుంబానికి సగటున 44.32 రోజుల పని దక్కింది. ఒక్కో కూలీకి సగటున రోజుకు రూ. 147.02 చొ ప్పున వేతనం అందింది. రాష్ట్రంలోని 1,68,535 మంది కూలీలకు 100 పనిరోజులను పూర్తిచేశారు.
2019-2020 సంవత్సరానికి గాను 14 రాష్ట్రాల్లో ఉపాధిహామీ ప్రగతి 50శాతం మించలేదు. కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం పలు ప్రతిష్టాత్మక పథకాలను చేపట్టిన సీఎం కేసీఆర్.. కేంద్ర నిబంధనల మేరకు ఉపాధి కూలీలకు రాష్ట్రంలో పనులు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో నీటి సంరక్షణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, హరితహారం, అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణంలో ఉపాధి కూలీలకు పని దొరికింది.
(ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కూడా సీఎం కేసీఆర్… ప్రధాని మోదీని పలుమార్లు ప్రత్యేకంగా కలిసి కోరినా, స్పందన లేదు)
తెలంగాణకు 10 కోట్ల పని రోజులు లక్ష్యంగా పెట్టగా, 2019 డిసెంబర్ వరకు 9.85 కోట్ల పనిరోజులు పూర్తి చేసుకుంది. దీంతో అదనంగా 2 కోట్ల పనిరోజులకు అనుమతి లభించింది. ఉపాధి కూలీలకు రూ.1478 కోట్లు చెల్లింపులు జరిగాయి. రాష్ట్రంలోని 32 జిల్లాలు 100శాతం పనులకు పోటీ పడుతుండటంతో సగటున 90శాతం నుంచి 96శాతం వరకు పనులు పూర్తయ్యాయి. వాగులు, ఇతర ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టి, చెక్ డ్యాంలు, చిన్న చెరువుల పునరుద్ధరణ పనులను ఉపాధిహామీ పథకంలో చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ప్రథమ స్థానం దక్కింది, సిద్దిపేట జిల్లాకు కూడా ప్రత్యేక అవార్డు లభించింది.
ఉపాధిహామీలో గుర్తించిన పనులు : 7,41,137
బడ్జెట్ అంచనా : రూ. 14,525 కోట్లు
పూర్తయిన పనులు : 4,89,045
మొత్తం ఖర్చు చేసిన నిధులు : రూ.5044 కోట్లు
జాబ్ కార్డులున్న కుటుంబాలు : 49,81,975
2019లో కూలీ పొందిన కుటుంబాలు : 23,61,982
వంద రోజులు పనులు చేసిన కుటుంబాలు : 1,19,438
జాబ్ కార్డులున్న కూలీలు : 1,08,63,762
2019లో పనులు చేసిన కూలీలు : 38,97,784
పురుషులు : 16,20,878 – మహిళలు : 22,75,044
ఎస్సీలు : 8,35,255 – ఎస్టీలు : 7,36,198
బీసీలు : 20,77,607 – మైనార్టీలు : 46,766
ఉపాధి హామీలో పనిచేసిన దివ్యాంగులు : 50,660
ఒక్కో కూలీకి సగటున రోజువారీ వేతనం : రూ.151 లభించింది.
గ్రామ పంచాయతీలు గుర్తించిన పనులను సిబ్బంది సహాయంతో పంచాయతీ కార్యదర్శులు చేయించాలి. పంచాయతీ సిబ్బందితోపాటు ఉపాధి హామీ కూలీలు, మేట్లకు కల్పించాల్సిన పనిని గుర్తించాలి. పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు, కూలీలకు చేతినిండా పని కల్పించాలి. ఉపాధి కూలీల హాజరు, చేసిన పనులపై గ్రామ పంచాయతీ సిబ్బంది, మేట్ల నుంచి వివరాలు తీసుకొని మస్టర్లు రికార్డు చేశాక వాటిని నిర్ధారించాలి. ప్రతివారం ఆఖరురోజున మస్టర్లపై సంతకాలు చేసి, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీసీఎస్లకు అప్పగించాలి. ఉపాధి హామీ శ్రమశక్తి సంఘాలు, ఉపాధి కూలీలతో సమన్వయం చేసుకొంటూ పనులు చేయించాలి.
రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీ వర్గాల్లోని 113 కులాలకు చెందిన వారు 52 శాతం (1.82 కోట్లు) ఉన్నారు. ప్రభుత్వం వీరికి విద్య, ఉద్యోగాల్లో 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నది. (బీసీ, ఎ-7 శాతం, బి-10 శాతం, సి-1 శాతం, డి-7శాతం, బీసీ ఇ -4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ( బిసి-ఇ కేటగిరిలో 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ చట్టం చేసింది) స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయిస్తున్నారు. 2014-15 లో రూ.2022.12 కోట్లు, 2015-16 బడ్జెట్లో 2,172 కోట్లు, 2016-17 లో రూ.2,537 కోట్లు, 2017-18 బడ్జెట్లో రూ.5,070.36 కోట్లు, 2018-19లో రూ.5,919.83 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.4528.01 కోట్లు, 2020-21 బడ్జెట్లో రూ.4,356 కోట్లు కేటాయించారు. గతంలో బీసీ సంక్షేమం కోసం 2013-14లో 1,659 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాలవారి (ఎంబీసీల) అభివృద్ధి కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయిస్తూ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నది. 2020-21లో మాత్రం రూ.500 కోట్ల నిదులు కేటాయించారు.
వెనుకబడిన కులాల సాధికారత, సంక్షేమానికి తెలంగాణలో బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ నం.25ను జారీ చేసింది. 10 అక్టోబర్, 2016న కమిషన్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్ చైర్మన్గా బి.ఎస్.రాములును ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు సభ్యులుగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జూలూరు గౌరీశంకర్, డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ నియమితులయ్యారు. ఈ ఫైలుపై 22 అక్టోబర్, 2016న సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
ఈ కమిషన్ కాల పరిమితి మూడేళ్ళు. కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తారు. కమిషన్లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. గతంలో బీసీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించేవారు. ఇటీవల ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్గా బి.ఎస్ రాములు, ఇతరులను కూడా నియమించేందుకు వెసులుబాటు ఉండేలా చట్ట సవరణ తీసుకువస్తూ ఆర్డినెన్స్ జారీచేసింది.
వెనుకబడిన తరగతుల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని వచ్చే అభ్యర్థనలను, బీసీ జాబితా నుంచి ఏ కులాన్నైనా తొలగించాలని వచ్చే ఫిర్యాదులను కమిషన్ పరిశీలించి విచారణకు స్వీకరిస్తుంది. 2017-18లో బీసీ కమిషన్ కు రూ.3.58 కోట్లు కేటాయించారు. బీసీ-ఇ వర్గాలకు సంబంధించిన రిపోర్టును బీసీ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది.
22 అక్టోబర్, 2019 తో ప్రస్తుత బిసి కమిషన్ కాలపరిమితి ముగిసింది.
బీసీ సంక్షేమశాఖ విద్యాసంబంధ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1206.70 కోట్లు విడుదల చేసింది. 2020 మే నెల నుంచి అక్టోబర్ 31 వరకు.. ఆర్నెళ్ల వ్యవధిలో భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధులను మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకులాలు, సాధారణ, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ హాస్టళ్లు, స్టడీ సర్కిళ్ల నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.