న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరైనా కుక్క, పిల్లి లాంటి జంతువులను పెంచుకుంటారు. వాటికి ఖరీదైన ఆహారం పెడుతారు. ఖరీదైన సబ్బులతో స్నానం చేయిస్తారు. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తారు. వాటిని పక్కనేసుకుని పడుకుంటారు. ఇంతవరకు పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎందుకంటే ఆమె తన పెంపుడు పిల్లికి చనుబాలిచ్చింది. అది కూడా తన ఇంట్లో కాదు. గాల్లో దూసుకెళ్తున్న ఓ విమానంలో సిబ్బంది, తోటి ప్రయాణికులు చూస్తుండగా ఆ పని చేసింది. విమాన సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసినా ఆమె పిల్లికి పాలివ్వడం ఆపలేదు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఓ మహిళ డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో న్యూయార్క్లోని సిరాక్యూజ్ నగరం నుంచి జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరానికి పోతూ వెంట తన పెంపుడు పిల్లిని తీసుకెళ్లింది. విమానంలో గాల్లో పరుగులు తీస్తుండగా సదరు మహిళ.. తన పెంపుడు పిల్లిని చేతుల్లోకి తీసుకుని చనుబాలివ్వడం మొదలుపెట్టింది. అది చూసి తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది కంగుతిన్నారు. పిల్లికి పాలివ్వడం ఆపి దాన్ని దాని క్యారియర్లో పెట్టాలని సిబ్బంది సూచించారు. కానీ వారి సూచనను ఆమె లెక్కచేయలేదు. తనపని తాను కొనసాగించింది.
దాంతో సిబ్బంది ఎయిర్క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా గ్రౌండ్కు మెసేజ్ పంపించారు. ’13A సీట్లో ఉన్న ప్రయాణికురాలు తను పెంపుడు పిల్లికి చనుబాలిస్తున్నది. పాలివ్వడం ఆపి పిల్లిని దాని క్యారియర్లో వదిలేయాలంటే ఆమె వినడం లేదు’ అని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. అంతేగాక ‘విమానం ల్యాండింగ్ తర్వాత డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన రెడ్ కోట్ బృందంతో ఈ సమస్యను పరిష్కరింపజేయండి’ అని ఆ మెసేజ్లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.