ఉద్యోగులంటే చాలా కంపెనీలకు చిన్నచూపే. ఎప్పుడూ వారితో పనిచేయించుకోవాలని చూస్తుంటాయి. అలసిపోయి పనివేళలో ఓ కునుకు తీస్తే ఇక అంతే. బాస్ పిలిచి చీవాట్లు పెడుతుంటాడు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకు అనుకూలంగా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నంపూట ఓ అరగంట కునుకు తీసేలా అనుమతిచ్చింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపింది.
వేక్ఫిట్ అనే పరుపుల తయారీ కంపెనీ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. తాము ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నా ఉద్యోగుల అవసరాన్ని గుర్తించలేకపోయామని, అందుకే ఇప్పుడు ఉద్యోగులకు పనివేళ మధ్యలో ఓ కునుకు తీసే అవకాశమిస్తున్నామని కంపెనీ కో ఫౌండర్ చైతన్య రామలింగెగౌడ అంటున్నారు. పనిమధ్యలో 26 నిమిషాలపాటు కునుకు తీస్తే పనిచేసే సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ, నాసా అధ్యయనంలో తేలిందన్నారు.
ఇందుకనుగుణంగానే తమ ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.00 గంటల ఉంచి 2.30 గంటలకు వరకు నిద్రపోయే అవకాశం ఇస్తున్నట్లు రామలింగెగౌడ తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పబోమన్నారు. కాగా, వేక్ఫిట్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లనుంచి మంచి స్పందన వస్తోంది. మార్కెట్లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారంటూ వేక్ఫిట్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు.