క్వారంటైన్లు, లాక్డౌన్ల కారణంగా ఈ ఏడాది ఆరంభం మొత్తం ఇళ్లకే పరిమితమైపోయారు ప్రజలు. ఆ భయం నుంచి బయటపడిన తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసే వరకూ కొంత స్వేచ్ఛ దొరికింది. ఇలా కష్టంగా గడిచిన ఏడాదిలో అందరికీ అందుబాటులో ఉంది ఇంటర్నెట్ ఒకటే.
మరి ఈ ఇంటర్నెట్లో ప్రజలు ఎక్కువగా దేని గురించి వెతికారు? అనే అనుమానం రావడం సహజం. ఈ విషయాన్ని గూగుల్ సెర్చింజన్ వెల్లడించింది. తమ #YearInSearchలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ ఏడాదిలో చాలా మంది ‘హౌ టు హీల్’ (ఎలా కోలుకోవాలి?) అంశంపై ఇదివరకెన్నడూ లేనంతగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఇంకో లాక్డౌన్ ఉంటుందా?’, ‘ధైర్యంగా ఎలా ఉండాలి?’, ‘నాకు వ్యాక్సిన్ ఎప్పుడు దొరుకుతుంది?’ వంటి అంశాలను కూడా బాగానే వెతికారట. అయితే ఈ సెర్చ్లో టాప్లో నిలిచిన అంశం ‘ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా’.
అలాగే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఐపీఎల్, ఎన్బీఏ, యూరో2021 కూడా బాగా సెర్చ్ చేశారు. ఇవి సెర్చింగ్లో టాప్-5లో ఉన్నాయి. భారత్ వరకే చూసుకుంటే ఐపీఎల్ టాప్ ప్లేస్లో నిలిచినట్లు గూగుల్ వెల్లడించింది.