కరోనా నేపథ్యంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ (జీవన వ్యయం) పెరిగిపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడమో లేక జీతాలు తగ్గించడమో చేస్తున్నాయి. దీంతో ఎంతోమంది జీవితాలు ఆగమయ్యాయి. సోషల్మీడియాలో నిత్యం ఎంతో మంది ఈ సమస్యపైనే పోస్టులు పెడుతున్నారు.
కాగా, సైమన్ అనే ఓ ఉద్యోగి ఓ వింత చర్యతో సోషల్మీడియాలో వైరల్ అయ్యాడు. తన కంపెనీ ఇచ్చే జీతం ఇంటి రెంట్ కట్టుకునేందుకు కూడా సరిపోవడం లేదని మూటాముల్లెతో సహా ఆఫీసుకి వెళ్లిపోయాడు. కిరాయి ఇంటినుంచి మూడు బ్యాగుల్లో సామాను సర్దుకుని ఆఫీసులో వాలిపోయాడు. తను పనిచేస్తున్న క్యాబిన్లోనే మకాం పెట్టాడు. తన క్యాబిన్లో సామాను సర్దుతున్న వీడియో టిక్టాక్లో వైరల్ అయ్యింది.
తన ఆఫీస్ క్యాబిన్నుంచే దినచర్యను ప్రారంభించాడు. డెయిలీ అప్డేట్స్ను టిక్టాక్లో పెట్టాడు. తన వస్తువులు, ఆహారం నిల్వ చేసుకున్న విధానం, బట్టలు సర్దుకుంటున్న తీరును వీడియో తీసి, టిక్టాక్లో ఉంచాడు. దీంతో అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంతవరకూ బాగానే ఉన్న నాలుగోరోజున అతడిని ఆఫీస్నుంచి పంపిచేశారట ఆ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అనంతరం అతడు పోస్ట్ చేసిన వీడియో క్లిప్స్ను కూడా తొలగించాలని ఆదేశించారట. ఇక ఆ కంపెనీతో తన రుణం తీరిపోయినట్లు అనిపిస్తున్నదని, ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారోనని భయంభయంగా ఉందని సైమన్ ఆవేదన వ్యక్తంచేశాడు.