చల్లని చలికి మంచుదుప్పటితో ముసుగేసిన భానుడిని కిలకిలారావాలతో లే లేమ్మని మేల్కొలిపే పక్షుల సందడి.. నల్లని అడవిని ఆక్రమించి తెల్లని మంచు ఆడే వయ్యారాల సయ్యాటలు.. ఎలగొడ్డులా ముసుగేసుకొని రేఖలువారకముందే పొలంగట్లెమ్మటి సాగిపోయే అన్నదాత.. ఏటికి ఎదురీదే మీనాలకోసం పానంపెట్టి వలవిసిరే బెస్తన్న.. చలికాలంలో ఇవే కదా ప్రకృతి అందాలు! ఏడాదిన్నర నుంచి కరోనా ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోయిన ప్రజలు ఇప్పుడు ఈ శీతాకాల ఆనందాలకోసం అర్రులు చాస్తున్నారు. నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఆనందంగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. వింటర్ టూరిజంలో తెలంగాణలోని పలు ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గడిచిన 18 నెలలుగా కరోనా టెన్షన్తో బతికిన ప్రజలు ఇప్పుడు కాస్త తెరిపి కోసం తపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పెండ్లిళ్ల సీజన్ కళ కనిపిస్తున్నది. రానున్న నాలుగు నెలలు వేల సంఖ్యలో వివాహాలు ఉన్నాయి. ఇదే సమయంలో శీతాకాల పర్యాటకానికి డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూరిజం, ట్రావెల్స్ సంస్థ థామస్కుక్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది చలికాలంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తేలింది. గడిచిన రెండేండ్లలో వివాహాలు చేసుకున్నవారు, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. కశ్మీర్, రాజస్థాన్, అండమాన్, గోవా, ఊటీ, కేరళ సహా ఈశాన్య రాష్ర్టాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ సైతం వింటర్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మన రాష్ట్రంలోనూ చలికాలంలోనే పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అందుకే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు చాలా కీలకమని పర్యాటకశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యం
చలికాలంలో పర్యటనకు వెళ్లేవారు చారిత్రక కట్టడాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్లో చార్మినార్, గోల్కొండ కోట, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చారిత్రాక ఆలయాల్లో సందడి కనిపిస్తున్నది. వీటితోపాటు కొండ, గుట్ట ప్రాంతాలను సందర్శించేవారు ఎక్కువగా ఉంటున్నారని పర్యాటకశాఖ వర్గాలు చెప్తున్నాయి. మెదక్లోని కెథడ్రల్ చర్చి, సంగారెడ్డిలోని పురాతన జైలు మ్యూజియం, యాదాద్రి జిల్లాలో భువనగిరి ఖిల్లా, యాదాద్రి ఆలయం, నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వర ఆలయం, ఖమ్మంలోని స్తంభాద్రిహిల్, మహబూబ్నగర్ జిల్లాలోని టిప్పు సుల్తాన్ చౌక్, నల్లగొండ జిల్లాలో బుద్ధవనం, జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టలను చూసేందకు గతవారం రోజుల్లో వేలమంది వచ్చారు. రానున్న నాలుగు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
చలికాలంలో రాష్ట్రంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏడాది మొత్తంలో సందర్శించేవారిలో సగం మంది ఈ నాలుగు నెలల్లోనే వస్తారు. వివాహాల సీజన్ కావడంతో ప్రి వెడ్డింగ్ షూట్లు, వెకేషన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏటా ఈ సమయానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ సీజన్లోనూ సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-మనోహర్రావు, టీఎస్టీడీసీ ఎండీ