రంగారెడ్డి జిల్లా కోర్టు, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేయడంపై సినీనటి సమంత కోర్టును ఆశ్రయించారు. అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వైద్యుడితోపాటు రెండు యూట్యూబ్ చానళ్లపై ఆమె కూకట్పల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిత జీవితంపై యూట్యూబ్ చానళ్లలో ఓ వైద్యుడు ఇంటర్వ్యూలో తనపై తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజ్యాంగం తనకు కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించినవారు మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని, పరువునష్టం ఎంతనేది తర్వాత కోరుతానని పేర్కొన్నారు. ఇక నుంచి తనపై తప్పుడు ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని, ఆ ఇంటర్వ్యూలను తొలిగించేలా ఆదేశించాలని సమంత కోర్టును అభ్యర్థించారు.