తిరువనంతపురం : ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ప్రియురాలికి దూరంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. ఇంట్లో ఎవరికి తెలియకుండా తన ప్రియురాలిని ఏకంగా 11 ఏండ్లు ఓ గదిలో దాచుకున్నాడు. ఆమెకు చిన్న సమస్య కూడా ఎదురవకుండా ప్రేమగా చూసుకున్నాడు.
పాలక్కడ్ జిల్లాలోని అయిలూరు గ్రామానికి చెందిన ఓ యువతీయువకుడు కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రహమాన్(34) తన ప్రియురాలు సజిత(28) ఇంటికి కొద్ది దూరంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2010, ఫిబ్రవరి 2వ తేదీన రహస్యంగా సజితను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఇంట్లో ఉన్న ఓ చిన్న గదిలో సజితను ఉంచాడు. ఆ గదికి ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి, రహస్యంగా డోర్ ఏర్పాటు చేశాడు. ఇక గది తలుపుకు ఉండే గడియకు విద్యుత్ ప్రసరించేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గడియను ఎవరూ ముట్టుకున్న విద్యుత్ షాక్ వస్తోంది. ఇదంతా తన ప్రియురాలు ఆ గదిలో ఉందన్న విషయం ఎవరికి తెలియొద్దు అని ప్లాన్ చేశాడు. అలా 2010 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆ గదిలోనే సజిత ఉన్నది. రహమాన్ అమ్మనాన్నతో పాటు చెల్లి ఆ ఇంట్లో ఉన్నప్పటికీ, సజిత అక్కడ ఉంటున్నట్లు మాత్రం వారికి తెలియదు.
అయితే సజిత అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామంతో పాటు సమీప గ్రామాలను గాలించారు. ఎందరినో విచారించారు. అందులో రహమాన్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ సజిత రహమాన్ ఇంట్లో ఉంటున్న విషయం బయటకు రాలేదు.
ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహమాన్ తన ప్రియురాలిని తీసుకుని సమీపంలో ఉన్న వితన్నాసెరీ గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. అయితే రహమాన్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి రహమాన్ ఉంటున్న ప్రదేశాన్ని కనుగొన్న పోలీసులు అక్కడకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సజిత కూడా అక్కడ ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత రహమాన్ చెప్పిన వివరాల ప్రకారం.. 11 ఏండ్లుగా సజిత ఉన్న గదిని కూడా పోలీసులు పరిశీలించారు. ఈ కేసులో రహమాన్, సజితను కోర్టులో హాజరుపరచగా, వారిద్దరూ కలిసి ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో రహమాన్, సజిత సంతోషం వ్యక్తం చేశారు.