హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అఫ్గనిస్తాన్ టు విజయవాడ వయా గుజరాత్.. ఈనెల 15న గుజరాత్లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ సంస్థకు రవాణా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ముఖానికి రాసుకొనే టాల్కం పౌడర్ ముసుగులో హెరాయిన్ను తరలించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కాకినాడకు చెందిన మాచవరం సుధాకర్ను చెన్నైలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. మరో ముగ్గురు కూడా డీఆర్ఐ అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి నుంచి ఆషీ ట్రేడింగ్ సంస్థ కార్యకలాపాలు, లావాదేవీలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది.
అఫ్గనిస్తాన్లోని హసన్ హుస్సేన్ లిమిటెడ్ నుంచి హెరాయిన్ను ఆషీ ట్రేడింగ్ సంస్థ ది గుమతి చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. చెన్నైకి చెందిన ఆషీ ట్రేడింగ్ సంస్థ తన చిరునామాను విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ భవనంగా పేర్కొంది. కానీ ఆ భవనంలో ఆషీ సంస్థకు సంబంధించి ఆధారాలు లభించలేదు. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ దీని మూలాలు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడకు పెద్ద మొత్తంలో హెరాయిన్ సరఫరా చేస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ కేంద్రంగా ఆషీ కార్యకలాపాలు జరుగడం లేదని పేర్కొన్నారు.