హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాస్రావు ప్రకటించారు. సోమవారం కోఠిలోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో మా ట్లాడిన ఆయన 45 ఏండ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నదని స్పష్టంచేశారు. అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మొదటి, రెండో డోసులు ఇస్తామన్నారు. మొదటిదైనా, రెండోదైనా వ్యాక్సి న్ వేసుకోవాలనుకుంటున్నవా రు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తేల్చిచెప్పా రు. కొవిన్ పోర్టల్ ద్వారా స్లాట్బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని, గతంలోవలే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండబోదని తెలిపారు.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేప్పుడు భౌతికదూరం సాధ్యం కావటం లేదని, వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉంటున్నాయని అందుకే స్పాట్ రిజిస్ట్రేషన్కు స్వస్తి చెప్పినట్టు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి యువత సహాయం అందించాలని, చుట్టుపక్కల ఉన్న ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. రెండు డోసులు తీసుకున్నవారు మాత్రమే కరోనా బారిన పడకుండా 80% కాపాడుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారు. రెండోడోసు కోసం ఎదురుచూస్తున్న వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వివరించారు. ఒక డోసు తీసుకున్న వారు దేశంలో ఎక్కడైనా రెండో డోసు తీసుకునే వెసులుబాటు ఉన్నదని చెప్పారు.
రాష్ర్టానికి చేరుకున్న 4లక్షల డోసులు
సోమవారం రాత్రి వరకు 4 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ర్టానికి చేరుకున్నాయి. ఇందులో కొవిషీల్డ్ మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. డోసులు రావడంతో తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుందని చెప్పారు. రెండో డోసు తీసుకున్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 18 ఏండ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించే విషయంపై త్వరలో స్పష్టత రానున్నట్టు పేర్కొన్నారు.