కాబూల్, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో మహిళల ఆందోళనలను కవర్ చేశారన్న కారణంతో ‘ఎటిలాట్రోజ్’ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను బంధించిన తాలిబన్లు వారిని తీవ్రంగా కొట్టారు. శరీరంపై గాయాలతో ఉన్న ఆ జర్నలిస్టుల ఫొటోలను సదరు మీడియా సంస్థ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. మరోవైపు, పంజ్షీర్లోని అఫ్గాన్ రెబల్ కమాండర్ అహ్మద్ షా మసూద్ (సీనియర్) సమాధిని తాలిబన్లు పాక్షికంగా ధ్వంసం చేశారు.
ఇంకోవైపు, ఇంకా 60 శాతం పంజ్షీర్ తమ ఆధీనంలోనే ఉన్నదని జాతీయ ప్రతిఘటన దళం పేర్కొంది. దేశంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలంటే ముందుగా న్యాయమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, నిరసనలు తెలిపే చోటు, ప్రదర్శించే ఫ్లకార్డులు, నినాదాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు తిరిగిరావాలని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని తాత్కాలిక ప్రధాని ముల్లా మహమ్మద్ హాసన్ అఖుంద్ చెప్పారు. కాగా తాజాగా ప్రకటించిన క్యాబినెట్లో అందరూ పురుషులే ఉండటాన్ని నిరసిస్తూ కాబూల్లో కొందరు మహిళలు నిరసనలు చేపట్టారు. వారిపై కర్రలు, కొరడాలతో తాలిబన్లు దాడిచేస్తున్న వీడియోలు బయటకువచ్చాయి.