కరోనాలాంటి విపత్తులు వచ్చినపుడు కేవలం ప్రభుత్వరంగ వైద్యమే అందాలనుకోవటం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా ఉండటం వల్ల ప్రైవేటు దవాఖానల ద్వారా కూడా ప్రజలపై ఆర్థికభారం లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి. బడ్జెట్లో వైద్యరంగం కేటాయింపుల్లో ఏడాదికి రూ.ఐదారు వేల కోట్లు బీమాకు కేటాయించి, నిరుపేదలకు ప్రభుత్వమే బీమా చేయిస్తే బాగుంటుంది. ఏదైనా ప్రజలకు భారీ ఎత్తున మేలు చేయడమనేది సీఎం కేసీఆర్తోనే సాధ్యం. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ.. ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకొన్నా దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచినవే.
-కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు, మరణాలు పెరగటానికి కారణమేంటి?
మొదటివేవ్ సమయంలో జనం భయపడ్డారు. అందుకే లాక్డౌన్ విజయవంతమైంది. ఆ తర్వాత కరోనా పోయిందనుకొని భ్రమలో విచ్చలవిడిగా వ్యవహరించారు. చివరకు రెండో వేవ్ ప్రారంభంలోనూ అప్రమత్తం కాలేదు. ఆ నిర్లక్ష్యమే కొంపముంచింది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు పెరిగేందుకు కారణమైంది. ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే సమయంలో జనంలో మళ్లీ భయం మొదలైంది. అందుకే స్వల్ప శాతం మినహా మిగిలిన వారంతా ఇంటికే పరిమితం కావడం, జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేశారు. ఇప్పుడు కేసులు తగ్గుతున్నాయి.
కొన్ని ప్రైవేటు దవాఖానల్లో దోపిడీపై ఏమంటారు?
ప్రజలు ఇంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నపుడు కొన్ని దవాఖానలు వ్యవహరించిన తీరు బాధాకరం. వందలో ఇలాంటి దవాఖానలు 10-20 శాతం ఉన్నాయి. వాళ్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తున్నది. కరోనా చికిత్సలో భాగంగా నిర్ణీత, నిర్దేశిత మందులు (ప్రిస్కిప్షన్) అనేది లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎవరికి వారు మందుల్ని సూచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని దవాఖానలు ఎక్కువ డబ్బులు ఆర్జించాయనటంలో సందేహం లేదు. వైద్యులు పరిమితికి మించి స్టెరాయిడ్స్ సూచించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులకు స్టెరాయిడ్స్ ప్రధాన కారణంగా తెలుస్తున్నది. మరోవైపు వాస్తవంగా కరోనా సెకండ్ వేవ్లో కేసులు భారీగా పెరిగిన సమయంలో చాలామంది అవసరం లేకున్నా అనవసర భయాలతో దవాఖానల్లో చేరారు. ఇది పడకల కొరతకు కారణమైంది.
కరోనా వేళ వైద్యరంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
రెండోవేవ్లో వైద్యరంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు.. మందులు, ఆక్సిజన్. ఆక్సిజన్ ప్లాంట్ల సామర్థ్యం 10-20 రెట్లు పెరగాల్సిన అవసరముంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పెద్దఎత్తున కొత్త ప్లాంట్ల ఏర్పాటు, సామర్థ్య పెంపు అనేది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇందులో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు తదితర నిర్మాణాల సమయంలోనే ఆక్సిజన్ పైపుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. ఈ మేరకు ప్రభుత్వ చట్టాల్లో మార్పులు తేవాలి. తద్వారా ఇలాంటి విపత్తుల సమయంలో దవాఖానలపై భారం తగ్గుతుంది.
పారామెడికల్ రంగంలో ఎలాంటి మార్పులు అవసరం?
కరోనా సమయంలో వైద్యరంగాన్ని వేధించిన సమస్యల్లో మరో ప్రధానమైనది.. పారా మెడికల్ సిబ్బంది (మానవ వనరుల) కొరత. ఒక డాక్టర్ 10-15 రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. కానీ నర్సులు, ఇతర సిబ్బందిది ఆ పరిస్థితి కాదు. దీంతోపాటు టెక్నీషియన్స్ కొరత కూడా కనిపించింది. ఈ అనుభవాలను బట్టి పారా మెడికల్ కోర్సులను గణనీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సులతో ఉపాధి కూడా కచ్చితంగా లభిస్తుంది. నర్సులు మొదలు వివిధ రకాల టెక్నీషియన్లకు ప్రస్తుతం విపరీతమైన ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వం పారా మెడికల్ కాలేజీల అనుమతి, కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం, ఇతరత్రా ప్రోత్సాహం కల్పించాలి.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటానికి ఏం చేయాలి?
కరోనాలాంటి విపత్తులు వచ్చినపుడు కేవలం ప్రభుత్వ దవాఖానల ద్వారా మెరుగైనవైద్యం అనేది సాధ్యం కాదు. ప్రైవేటు వైద్య రంగం కూడా కలిస్తేనే మెరుగైన సేవలు అందుతాయి. ప్రైవేటు వైద్యం ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా మంచి పరిష్కారం. ప్రభుత్వమే నిరుపేదలకు బీమా చేయించాలి. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులపరంగా పరిశీలిస్తే ఇందుకు ఏటా రూ.5-6 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. బడ్జెట్లోనే బీమాకు కేటాయింపులు చేయాలి. దీంతో సాధారణ రోజుల్లోనే కాదు.. ఇలాంటి విపత్తులు వచ్చినపుడు బీమా కంపెనీలు-ప్రైవేటు దవాఖానల మధ్యే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం కేవలం పర్యవేక్షిస్తే సరిపోతుంది.
కరోనా కట్టడికి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకొన్నదని మీరు భావిస్తున్నారు?
కరోనా మొదటి, రెండో వేవ్ల్లో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు బాగున్నాయి. అందుకే రెండో వేవ్లో దేశంలోని ఇతర రాష్ర్టాల్లో మరణాలు గణనీయంగా ఉన్నా, తెలంగాణలో తక్కువ నమోదయ్యాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో ఆక్సిజన్ కొరత వేధించినా తెలంగాణలో ఆ పరిస్థితి రాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కావాల్సిన ఆక్సిజన్ను ఇతర రాష్ర్టాల నుంచి తెప్పించటంతో పరిస్థితి అదుపులోనే ఉన్నది. అటు కరోనా, ఇటు బ్లాక్ ఫంగస్ మందుల విషయంలోనూ ఆదిలో ఒకట్రెండు రోజులు కొంత ఇబ్బంది కలిగినా ప్రభుత్వం వెంటనే పరిస్థితిని చక్కదిద్దడంతో మందుల కొరత ఇబ్బంది పెట్టలేదు. లాక్డౌన్తో కేసులు తగ్గి, దవాఖానలపై భారం తగ్గింది.
అసాధ్యాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం
తెలంగాణలో ఏ అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని తీసుకున్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి లక్ష్యాలు భారీగా ఉంటాయి. ఆసరా పింఛన్లు తీసుకుంటే… రూ.2,016-3,016, రైతుబంధు, రైతు బీమా ద్వారా లక్షల మంది రైతులకు ప్రయోజనం, మిషన్ భగీరథలాంటి పథకాలతో ప్రతి ఇంటికీ సురక్షితమైన నల్లా నీళ్లు, కాళేశ్వరం సహా ఇరిగేషన్ను తీసుకుంటే కోటి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువుల పునరుద్ధరణ.. ఇలా ప్రతి ఒక్కటీ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. అందుకే ఈ ఆరోగ్య బీమా లాంటివి తీసుకురావాలన్నా సీఎం కేసీఆర్తోనే సాధ్యం. ప్రభుత్వ వైద్య రంగాన్నీ బలోపేతం చేయాలి.