న్యూఢిల్లీ, మే 20: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం, 1897 కింద పరిగణించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న రోగుల్లో బ్లాక్ ఫంగస్ నిర్ధారణ, అనుమానిత కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖకు విధిగా రిపోర్ట్ చేయాలని సూచించింది. కరోనా రోగుల మరణాలకు, దీర్ఘకాల అనారోగ్యానికి ఈ వ్యాధి కారణమవుతున్నదని పేర్కొంది. ఈ ఫంగస్ను గుర్తించడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. స్టెరాయిడ్ థెరపీ, మధుమేహం నియంత్రణలో లేనివారు ఈ వ్యాధిబారిన ఎక్కువగా పడుతున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు పలు విభాగాల వైద్యులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, కంటి చికిత్స నిపుణుడు, ఈఎన్టీ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్, దంత వైద్యుల సేవలు అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్కు సంబంధించి స్క్రీనింగ్, డయాగ్నోసిస్, మేనేజ్మెంట్ తదితర మార్గదర్శకాలను అన్ని రాష్ర్టాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ, మెడికల్ కాలేజీలు పాటించాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ‘ఆంఫోటేరిసిన్-బీ’ యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ను ఇవ్వొచ్చని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వ్యాధితో ఇప్పటికే 90 మంది మరణించినట్టు మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీని చికిత్సకు అవసరమైన ఔషధాలను సరఫరా చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు.
బ్లాక్ ఫంగస్ కట్టడికి మూడు టిప్స్