టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఎయిర్ ఇండియా కాక్పిట్లో తిరిగి టాటాలు ప్రవేశించారు. రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాలో నూరుశాతం వాటాను రూ.18,000 కోట్లతో కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ వేసిన బిడ్ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ దిగ్గజ విమానయాన కంపెనీని టాటాల నుంచి భారత ప్రభుత్వం జాతీయంచేసిన ఏడు దశాబ్దాలకు మళ్లీ ప్రైవేటీకరణ రూపంలో వారే దక్కించుకోవడం విశేషం. ఎయిర్ ఇండియాకు బహుళ ప్రాచుర్యం పొందిన ‘మహారాజా’ లోగోను కూడా అప్పట్లో టాటాలే రూపొందించారు.
నగదు రూ.2,700 కోట్లే
ఎయిర్ ఇండియా బిడ్డింగ్ వివరాల్ని దీపమ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే మీడియాకు వివరిస్తూ టాటాలు సమర్పించిన రూ.18,000 కోట్ల బిడ్ ప్రకారం సంస్థకు ఉన్న 15,300 కోట్ల రుణాన్ని స్వీకరిస్తారని, రూ.2,700 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లిస్తారని తెలిపారు. ఈ లావాదేవీ డిసెంబర్కల్లా పూర్తవుతుందన్నారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అజయ్సింగ్ నేతృత్వంలోని స్పైస్ జెట్ కన్సార్షియం రూ.15,100 కోట్లకు బిడ్చేయగా, అధిక ధరను కోట్చేసిన టాటాల బిడ్ను మంత్రుల కమిటీ ఆమోదించిందని పాండే చెప్పారు.
వివరాలివి…
టాటాలకు మూడో ఎయిర్లైన్స్ బ్రాండ్..
ఎయిర్ ఆసియా, విస్తారా బ్రాండ్ నేమ్స్తో ప్రస్తుతం నడుస్తున్న టాటాల ఎయిర్లైన్స్ వ్యాపారంలో ఎయిర్ ఇండియా మూడో బ్రాండ్ కానుంది. మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటుచేసిన వెంచర్ ఎయిర్ ఆసియా కాగా, విస్తారాను సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నెలకొల్పింది.
‘జేఆర్డీ ఎంతో సంతోషించేవారు ’
‘ఎయిర్ ఇండియాకు ఆహ్వానం. బిడ్ను టాటా గ్రూప్ గెలుచుకోవడం గొప్ప వార్త. జేఆర్డీ టాటా నాయకత్వంలో ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా వెలుగొందింది. ఇప్పుడు మనమధ్య జేఆర్డీ ఉంటే ఎంతో సంతోషించేవారు’ అంటూ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ నుంచి దిగుతున్న జేఆర్డీ టాటా ఫోటోను జతచేశారు.
ఎయిర్ ఇండియా ప్రయాణమిలా…
జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరుతో నెలకొల్పి, 1946లో ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ పేరుతో 1948 నుంచి యూరప్కు విమానాల్ని నడపడం ప్రారంభించారు. 1953లో దీనిని ప్రభుత్వం జాతీయం చేసింది. జాతీయం చేసిన తర్వాత 25 ఏండ్లపాటు జేఆర్డీనే సంస్థకు చైర్మన్గా కొనసాగించింది.