హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా 70 నుంచి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండు మూడు నెలల్లో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన జోనల్ విధానం అమలుతో ఈ ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. మంగళవారం శాసనసభలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పరిపాలనా కేంద్రాలను పెంచామని, అందులో భాగంగానే 33 జిల్లాలతోపాటు మండలాలు, పోలీస్ కమిషనరేట్లు, ఇతర ఆఫీసుల సంఖ్యను పెంచామని వివరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఉద్యోగుల విభజన పూర్తికాగానే..
కొత్తగా ఏర్పడ్డ ప్రతి మండలంలో పోలీస్స్టేషన్ కావొచ్చు, ఇతర కొత్త కార్యాలయాలు కావొచ్చు.. వీటికి అవసరమైన సిబ్బందిని నియమించాల్సి ఉన్నది. కొత్త జోనల్ విధానం ప్రకారం ప్రస్తుత ఉద్యోగుల విభజన నెలలో పూర్తిచేస్తాం. ఆ తర్వాత ఏ జిల్లావారికి ఆ జిల్లా క్యాడర్ పోస్టులతో రిక్రూట్మెంట్ చేస్తాం. ఏ మండలానికి ఎంత సిబ్బంది ఉండాలో ఓ లెక్క ఉన్నది. దీని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నయ్.. మొత్తం 33 జిల్లాలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అనేదానిపై స్పష్టత వస్తుంది. నాకున్న అంచనా మేరకు కనీసం 70-80 వేల ఉద్యోగాలు కొత్తగా దొరుకుతయి. వాటన్నింటినీ నెల, రెండు నెలల్లో భర్తీ చేసేస్తం. కొంతమంది రేపే భర్తీ చెయ్యాలే.. ఎల్లుండే చెయ్యాలే అంటున్నరు.
అట్లా అయితదా? మొన్ననే కదా కొత్త జోనల్ విధానం వచ్చింది. దాన్ని ధిక్కరించలేం కదా? భవిష్యత్తులో ఏ జిల్లా బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఆ జిల్లావారికే దక్కుతాయి. దసరా పండుగ పూర్తికాగానే ఉద్యోగులతో మాట్లాడుతా. ఇదంతా సెట్ అయితే ఎక్కడి వాళ్లకు అక్కడ 100 శాతం ఉద్యోగాలు వస్తయ్. ఎక్కడివాళ్లు అక్కడ ఆనందంగా పని చేసుకుంటరు. మారుమూల జిల్లాలకు ఉద్యోగులు పోతలేరు. జోనల్ విధానం అమలైతే ఆ జిల్లాల బిడ్డలకే ఉద్యోగాలొస్తయ్. వాళ్లే పని చేసుకుంటరు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.51లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినం. కావాలంటే ఏ వ్యక్తికి, ఎక్కడ ఉద్యోగం ఇచ్చామో అభ్యర్థి సెల్ఫోన్ నంబర్తో సహా వివరాలను శాసనసభకు ఇస్తం.