హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే వ్యాప్తి పూర్తిగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. గత రెండు వారాలకు, ఇప్పటికి కేసులు, వ్యాప్తి, పాజిటివిటీ రేటు తగ్గిందని అన్నారు. ప్రభుత్వ తీసుకొన్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ముఖ్యంగా ట్రీట్మెంట్ ఫస్ట్, ఇంటింటా జ్వరసర్వే విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో ప్రారంభించిన ఇంటింటి సర్వేను దేశమంతటా చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారని గుర్తుచేశారు. రెండున్నర లక్షల మందుల కిట్లను పంపిణీ చేయటంతో దవాఖానల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
దేశంలోని అనేక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తీవ్రంగా ఉంటే, తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని దవాఖానల్లో ఐదారు రాష్ర్టాల కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మొత్తం పడకల్లో 40శాతం పైగా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాల పేషెంట్లు చికిత్స పొందుతున్నట్టు వివరించారు. ప్రైవేటు దవాఖానల్లో అధికంగా బిల్లులు వేస్తే చర్యలు తప్పవని శ్రీనివాస్రావు హెచ్చరించారు. ఇప్పటికే 26 ఫిర్యాదులు రాగా, ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని, మాదాపూర్లోని ఓ దవాఖాన కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రైవేటు దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఫిర్యాదులకు 9154170960కు వాట్సాప్ చేయాలని సూచించారు. అటు.. కేంద్రం నుంచి సరిపోయేంత వ్యాక్సిన్లు అందకపోవటం వల్లే వ్యాక్సినేషన్కు అంతరాయం కలుగుతున్నదని అన్నారు.
బ్లాక్ఫంగస్కు సంబంధించిన అత్యవసర మందులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ప్రత్యేకంగా రెండు దవాఖానలు ఏర్పాటు చేసుకొన్నామని ఆయన చెప్పారు. ప్రజలను భయానికి గురిచేసేలా టీవీ చానళ్లు ప్రసారాలు చేయవద్దని, బ్లాక్ ఫంగస్ను భూతద్దంలో చూపించవద్దని కోరారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని వివరించారు. ఇదిలా ఉండగా, ఆరు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ వైద్యరంగ ముఖచిత్రమే మారిపోతుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ రమేశ్రెడ్డి అన్నారు. వైద్య విద్యార్థులకు 15 శాతం ైస్టెపెండ్ పెంచినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.