ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశానని వెల్లడి
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నరసాపురంను జిల్లాగా ఏర్పాటు చేయాలని బుధవారం భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించినందుకు క్షమించాలని ప్రజలను కోరారు. నరసాపురం జిల్లా సాధనలో ఎమ్మెల్యే విఫలమయ్యాడని మండిపడ్డారు. ఈ ఘటనతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.