మంచిర్యాల, మే 28 (నమస్తే తెలంగాణ): అత్యవసర సేవలందిస్తున్న 108 వాహనాలకు మంచిర్యాలకు చెందిన వాయుపుత్ర గ్యాస్ ఏజెన్సీ ఉచితంగా ఆక్సిజన్ రీఫిల్లింగ్ చేస్తున్నది. ఆపత్కాలంలో తోడుగా నిలుస్తున్నది. కరోనా బాధితులను 108 వాహనాల్లో ఐసొలేషన్ కేంద్రాలకు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లోని దవాఖానలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల్లో ఆక్సిజన్ సమస్య ఏర్పడుతున్నది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతున్నది. ఈ క్రమంలో 108 వాహనాల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదని తెలుసుకొన్న వాయుపుత్ర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు పీ వెంకటేశ్ సేవాభావంతో ముందుకొచ్చారు. జిల్లాలోని 14 వాహనాలకు అవసరమైనప్పుడల్లా ఉచితంగా ఆక్సిజన్ రీ ఫిల్లింగ్ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. పలు వాహనాలకు ఆక్సిజన్ సమకూర్చారు. 108 వాహనాల్లో వాడే ‘డీ’ టైప్ సిలిండర్ల సామర్థ్యం 120 లీటర్లు ఉంటుంది. వెంకటేశ్కు 108 సేవల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విజయ్కుమార్, మంచిర్యాల జిల్లా 108 ఈవో కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు.