(Lovers suicide) మునిపల్లి / సంగారెడ్డి : విడిపోయి ఉండలేక.. పెండ్లి చేస్తారన్న నమ్మకం లేక ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని బుదేరా ఎక్స్రోడ్స్లో సోమవారం చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బుదేరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కొహిర్ గ్రామానికి చెందిన అమృత (20), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన శివకుమార్ (24) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని రెండు కుటుంబాల్లో చెప్పగా.. అమృత తల్లిదండ్రులు పెండ్లికి అంగీకరించి ఉగాది తర్వాత అందరి సమక్షంలో పెండ్లి జరిపిస్తామని చెప్పారు. అయితే, ఇంతలో ఏంజరిగిందో తెలియదు కానీ, సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గమనించిన స్థానికులు బుదేరా పోలీసులకు సమాచారం అందించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అమృత ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు, శివకుమార్ బీఫార్మసీ కోర్సు చదువుతున్నారు. ఇక్కడ పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారినట్లు సమాచారం. కొండాపూర్ సీఐ లక్ష్మ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.