యాదాద్రి, సెప్టెంబర్ 17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మాడవీధులు, క్యూ కాంప్లెక్స్,క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో, స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని 11,858 మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.19,50,548 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు. కాగా అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు.